తానోడి కివీస్ ని ఫైనల్స్ కి పంపిన టీమిండియా...అదే కారణమా ?

  ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ దే...ఈ వరల్డ్ కప్ సీజన్ మొదలయిన నాటి నుండే వినిపించిన మాట ఇది. దానికి ఎన్నో ఉదాహరణలు మరెన్నో పోలికలు. అందుకు తగ్గట్టే టీమిండియా కూడా తనదైన ప్రదర్శన కనబరిచింది. క్రికెట్ దిగ్గజం అయిన ఆసీస్ ను సైతం వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో ముందుంది. ఇంగ్లాండ్ తో ఆట తప్ప మిగతా అన్ని మ్యాచ్లు గెలిచిన ఇండియా  ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం, అది కూడా గెలుస్తామని కాన్ఫిడెన్స్ వచ్చాక కాస్త ఇబ్బంది కారణమనే చెప్పాలి. ఆటలు అన్నాక గెలుపోటములు సహజమే. టాపార్డర్ కుప్పకూలగా, జట్టు విజయ తీరాలకు చేర్చేందుకు జడేజా, ధోని చేసిన వీరోచిత పోరాటం వృథా అయ్యింది. దీంతో భారత అభిమానులు నైరాశ్యంలో కూరుకుపోయారు. మొదటి ఐదు పరుగులకే 3 వికెట్లు పడిపోగా మరో 19 రన్స్‌కే మరో వికెట్ పడింది. వారి స్కోరు 1,1,1,6.. ఆ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) వికెట్ పడకుండా కాసేపు అశలు రేకెత్తించారు. ఇద్దరూ అడపాదడపా సింగిల్స్ తీస్తూ కాపాడుకుంటూ వచ్చారు.  అయితే, సాంట్నర్ వీరిద్దరి సహనాన్ని పరీక్షించి బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో గ్రేట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చారు. వీరిద్దరు సింగిల్స్‌కే పరిమితం అవుతూ వచ్చారు. ఈ దశలో రన్ రేట్ 9కి చేరింది. అప్పుడే అసలు ఊహించని విధంగా జడేజా సిక్సుల మీదు సిక్సులు కొడుతూ న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ధోని సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే జడేజా కివీస్ బౌలర్ల భరతం పట్టాడు. అయితే చివర్లో 77 పరుగులు చేసి జడేజా ఔటయ్యాడు. ధోని(50) కూడా రెండో సింగిల్‌కు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.  మరో 3 బంతులు మిగిలి ఉండగానే 221 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయ్యింది.   ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణాలేంటో విశ్లేషిస్తే  ముందుగా మాట్లడుకోవాల్సింది టాస్ గురించే. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టాస్ గెలవగానే విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓకవేళ కోహ్లి టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాడే. అల అముందు టాస్ గెలుచుకోవడం అనేది కీలకంగా మారింది.  ఇక వర్షం కూడా ఓటమికి కీలకమగా మారింది మ్యాచ్ జరుగుతున్న మాంచెస్టర్‌లో వర్షం పడకుండా మ్యాచ్ మంగళవారమే మ్యాచ్ ముగిసి ఉంటే ఫలితం వేరీలా ఉండేదేమో. కానీ బ్యాడ్ లక్ వర్షం కారణంగా మ్యాచ్ బుధవారానికి వాయిదా పడింది. ఉదయాన్నే పిచ్ మీద పడిన వర్షం కారణంగా పేస్‌కు అనుకూలించే పరిస్థితులలో కివీస్ పేస్ బౌలర్లు చెలరేగిపోయారు. ఇక భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలడం కూడా మ్యాచ్ ఓటమికి మరో కారణం టాప్ ఆర్డర్ పేక మేడను తలపించింది.  ఒకరి వెనక ఒకరు ఒకరి వెనక ఒకరు అలా వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టాప్-3 బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు చొప్పున చేసి అవుటయ్యారు. అప్పుడే భారత్ ఓడిన ఫీలింగ్ వచ్చినా ధోనీ ఏడో స్థానంలో దిగడం కూడా ఓటమికి ఓ రకంగా కారణం కావొచ్చు. దినేశ్ కార్తీక్ స్థానంలో ధోనీని ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే ఫలితం మరోలా ఉండేదేమోనని వేస్లేషణలు వస్తున్నాయి. ఏదయితేనేమి మనం ఓడాము అంటే పోరాడినట్టే, ఈ పోరాటం ఇలాగే కొనసాగాలని వచ్చే ఏడాది అయినా మనవాళ్ళు ప్రపంచ కప్ కొట్టాలని కోరుకుందాం.

ఒక పరాజయం 100 తప్పులు.. 'కమ్మ' బ్రాండ్ కొంప ముంచిందా?

  టీడీపీ ఘోర పరాజయంలో కమ్మ బ్రాండ్ కీలక పాత్ర పోషించిందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్లాన్ ప్రకారం పార్టీ మీద కమ్మ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఆ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నా.. దాన్ని గుర్తించలేకపోయారు, ఒకవేళ గుర్తించినా ఆ ముద్రని పోగొట్టడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పాలి. దాదాపు అన్ని పార్టీలకు ఏదొక కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నిజానికి ఏ కులమూ ఓ పార్టీకి పూర్తిగా మద్దతు తెలపదు, తెలిపిన దాఖలాలు కూడా లేవు. టీడీపీ విషయంలో కూడా అదే జరిగింది. నిజానికి కమ్మ సామాజికవర్గమంతా టీడీపీ వెంటలేదు. అది 2019 ఎన్నికల ఫలితాల్లో కూడా తేలిపోయింది. ఎందుకంటే కమ్మ వారు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అంటే ఎన్నికల ముందు టీడీపీ కమ్మ పార్టీ అని చేసిన ప్రచారమంతా కావాలనే చేసిందని అర్ధమవుతోంది. కానీ దీన్ని పసిగట్టడంలో బాబు విఫలమయ్యారు. అప్పట్లో టీడీపీని బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ అనే వారు. కొందరు బీసీల పార్టీ అని కూడా అనేవారు. కానీ ఈ మధ్య కమ్మ పార్టీ అనే ముద్ర పడింది. అసలు నిజానికి బాబు కమ్మ సామాజికవర్గాన్ని కావాలనే దూరం పెడతారని కూడా పార్టీలో చెప్పుకుంటారు. ఎక్కడ కుల ముద్ర పడుతుందేమోనన్న భయంతో.. వారి దగ్గర విషయం, నిజాయితీ ఉన్నా కూడా భయంతో పక్కన పెట్టేవారట. దీంతో కమ్మ వర్గం బాబుకి దూరమవుతూ వచ్చిందట. కుల ముద్ర పడకూడదని ముందు జాగ్రత్త తీసుకున్న బాబు.. తీరా పార్టీ మీద జరిగిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఓ వైపు కమ్మ వారిని దూరం చేసుకున్నారు, మరోవైపు పార్టీపై పడిన కమ్మ ముద్ర ప్రచారాన్ని తిప్పికొట్టలేక ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు.  

భలే ప్లాన్ చేసిన జగన్...ముందు ఆ విషయం చూడండి సార్ !

  బాద్యతలు చేపట్టిన నాటి నుండి సంచలనాలకు మారుపేరుగా మారుతున్న ఏపీ సీఎం వైస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో నేడు కలెక్టర్, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. ప్ర‌ధానంగా ఎటువంటి స‌మ‌స్య‌లు మీ దృష్టికి వ‌స్తున్నాయంటూ క‌లెక్ట‌ర్ల‌ను వీడియా కాన్ఫిరెన్స్ లో అడగగా  రైతు ఆత్మ‌హ‌త్యల ప్రస్తావన వచ్చింది.  గత ప్రభుత్వ హాయంలో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కానీ 391 మందికి మాత్రమే పరిహారం  ఇచ్చారని తెలిసింది. దీంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడమే కాదు, వారికిస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. 2014–2019 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.  డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రికార్డులు చెప్తున్నాయని కానీ 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయని జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ రైతు కుటుంబాలకు పరిహారాన్ని నిరాకరించినట్టుగా దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. జిల్లాల్లో పరిశీలించి ఎవరైనా అర్హులున్న రైతు కుటుంబాలు ఉంటే వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను జగన్ ఆదేశించారు.  ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ సూచించారు. ఎక్కడైనా సరే రైతు కుటుంబాల్లో జరగ రానిది జరిగితే వెంటనే కలెక్టర్‌ స్పందించాలని, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళాలని సూచించారు. చనిపోయిన వారి కుటుంబాల పట్ల సానుభూతితో ఉండాలని, మానవత్వంతో మెలగాలని అన్నారు. మనిషే చనిపోయాడు మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదని జగన్ స్పష్టం చేశారు.  నిజానికి ఈ పధకాన్ని కూడా జగన్ ఎన్నికల హామీలలో ఒకటిగా పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా తన ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారాన్ని అతని కుటుంబానికి అందిస్తుందని జగన్ కీలక హామీ ఇచ్చారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్, రైతు సంక్షేమానికి దివంగత మహానేత వైఎస్ఆర్ ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు.  రైతులకు ఆర్థిక సాయం విషయంలో తొలి సభలోనే చట్టాన్ని తెస్తామని అన్నారు. రైతు ఎలా మరణించారని ఎవరూ అడగరని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడి దాకా బాగానే ఉంది జగన్ గతంలో చనిపోయిన రైతులకే కాక ఇప్పుడు చనిపోయినా ఇస్తానని ఆయన హామీ ఇచ్చినట్టే. నిజానికి చాలా చోట్లస్ విత్తనాల కొరతతో రైతులు బాధ పడుతుంటే దని గురించి పట్టించుకోకుండా ఈ ప్రకటన చేయడం అంటే ఈ ఆత్నహత్యలను మరగున పడేసే ప్రయత్నమే.  చనిపోయిన రైతులకి పరిహారం ఇవ్వాలి కాదనం, అలాగే మరే రైతూ ఆత్మహత్య చేసుకోకుండా ఆపగలగాలి. ఇంగ్లిష్ లో ఒక సామెత ఉంటుంది Prevention is Better Than Cure అని. జగన్ కూడా అలాంటి నిర్ణయాలు ఏవయినా తీసుకుని ఉంటె బాగుండేది. అసలు రైతులు ఆఅత్మహత్యల జోలికి వెళ్ళకుండా ఉండాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. అది ప్రభుత్వం అందించే అవకాశం ఉండదు కాబట్టి బీమా చేయించే అవకాశాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి.  అంతే కాక రైతుల నుంచి ప్రభుత్వమే పంటను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే కధ రైతుకు నిజమైన సాయం చేసినట్టు ! అలా కాక ఆయన చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇస్తామంటే ? రైతుకు ఏమని సందేశం ఇద్దామని ? ప్రభుత్వమో, అధికారులో వెళ్లి డబ్బు ఇస్తే కన్నవారి కడుపుకోత, ఆ పిల్లల ఆక్రందనలు తీరుస్తాయా ? రైతు మరణిస్తే ఇవ్వడం సబబే కానీ వారి జీవితానికి అండగా ఉండేలాగా మరేదైనా చేస్తే ఉపయోగం కదా. మరణించాక ఇచ్చే ఎక్స్ గ్రేషియా కన్నా బ్రతికున్నప్పుడు బ్రతుకు మీద భరోసా ఇస్తే ఆ రైతు కుటుంబం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా.  అదీ కాక నేటి సమాజంలో ముసల్లోలకి పెన్షన్ ఇవ్వడానికే లంచం అడుగుతున్నప్పుడు వీరికి డబ్బు మంజూరు చేసే అధికారులు ఈ ఏడు లక్షలలో ఏమీ తినరని మీరు గుండెల మీద చేయివేసుకుని చెప్పగలరా ? ఇంకా ఎన్ని రోజులు ఈ సానుభూతి రాజకీయాలు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ విత్తనాల ఆలస్యం వలన తొలకరి నాటికి కూడా అవి అందకపోతే ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడి రాదని ! వారు ఏమైనా చేసుకుంటే అప్పుడు కూడా తెలుగుదేశం మీద నిందలు వేసి ఊరుకుంటారా ? రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అని ఒక ప్రభుత్వం తలచుకుంటే చేయలేనిది ఏముంది ? మీరు ఈ పరిహార ప్రకటనలు చేసేకంటే విత్తనాలు సంపాదించి పంచిపెట్టండి, రైతులకి ఎంతో మేలు చేసిన వారు అవుతారు.

జగన్ ఫిర్యాదు ఎఫెక్టా...లేకా బాబును కార్నర్ చేసే ప్లానా ?

  తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసిన బీజేపీ అందుకు అనుగుణంగా తన పని చేసుకుపోతోంది. ఈ నేపధ్యంలో నాయకులకి సన్నిహితంగా మెలిగిన, మెలిగారని ఆరోపణలు ఉన్న అధికారులను కూడా ఫోకస్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతోన్న జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై నిన్న సీబీఐ సోదాలు జరిపింది.  ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో అధికారులు దాడులు చేపట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌ వద్ద  రూ.4 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు.  అయితే గాంధీ ఇంతకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో పని చేశారు. వైసీపీ అధినేత జగన్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిలపై ఈడీ కేసులు నమోదు చేసింది గాంధీనే కావడం ఇప్పుడు పలు చర్చలకు తావిస్తోంది. ఎందుకంటే 2017… ఫిబ్రవరిలో మోడీని కలిసిన అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అప్పటి ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న బొల్లినేని గాంధీతోపాటు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్‌ల‌పై జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు.  టీడీపీ ప్రోద్బలంతోనే గాంధీ తనపై తప్పుడు కేసులని బనాయించారని మోడీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. అంతేకాక ఈడీ కేసులతో ఏమాత్రం సంబంధం లేని తన భార్య భారతికి కూడా నోటీసులు జారీ చేశారని అందుకే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని జగన్ కోరారు. అయితే అప్పట్లోనే జగన్ ఆరోపణల కారణంగానే గాంధీ జీఎస్టీకి బదిలీ అయ్యారని అనుకునేవారు. తొలుత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పని చేసిన గాంధీ తర్వాత ఈడీలో ఏడేళ్లపాటు పని చేశారు.  జగన్ కేసు తర్వాత ఆయన జీఎస్టీకి బదిలీ అయ్యారు, ఇక రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి సంబంధించిన కేసులో చంద్రబాబు సూచనల మేరకు పలు ఫైళ్లల్లో మార్పులు చేసినట్టు కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని కూడా ఈయన మెడ ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ నోట్ చేసుకుని ఓకే సారి రంగంలోకి దిగింది సీబీఐ. అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో బొల్లినేనిపై సీబీఐ కేసు అనేది తీవ్ర చర్చనీయామాశంగా మారింది, అయితే ఈ సీబీఐ దాడులు ఇక్కడితో ఆగుతాయా ? లేక ఇంకా ఎవరినైనా టార్గెట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీని ముంచేసిన వారసులు!

  తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని స్వర్గీయ ఎన్టీఆర్ ఘనంగా ప్రకటించారు. కానీ తరువాత పరిస్థితి మారిపోయింది. కొన్నేళ్లుగా టీడీపీలో వారసుల హవా నడుస్తోంది. టీడీపీకి కూడా వారసత్వ పార్టీ ముద్ర పడింది. ఓ రకంగా టీడీపీ ఘోర పరాజయంలో వారసత్వం కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. దాదాపు ప్రతి జిల్లాలో టీడీపీ ఒకటి-రెండు కుటుంబాల చేతిలో బందీ అయిపోయింది. నాయకులు.. తమ సోదరులనో, తనయులనో, బంధువులనో పార్టీలోకి తీసుకొచ్చి.. మిగతా వారిని నాయకులుగా ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి కార్యకర్త స్థాయి నుంచి ద్వితీయ శ్రేణి నేత వరకు ఎదిగిన వారు.. వారసుల మూలంగా నాయకులు కాలేకపోతున్నారు. నిజంగా నాయకత్వ లక్షణాలుంటే వారసుడ్ని పరిచయం చేయడంలో తప్పులేదు. అలా కాకుండా 'పాలించడం మా హక్కు, పార్టీ మా సొత్తు అన్నట్టుగా' ఎటువంటి అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి.. పార్టీ మీద, ప్రజల మీద రుద్దాలని చూడకూడదు. కానీ టీడీపీలో కొందరు అదే చేసారు . కేవలం వారసత్వం అనే ట్యాగ్ తో పార్టీలోకి వచ్చి కొందరు టికెట్లు సాధించారు. వారు ఓడిపోయి, పార్టీని ఓడించారు. వారసత్వ రాజకీయాల విషయంలో బాబు కూడా ఏం చేయలేకపోయారు. తన తనయుడు లోకేష్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా మంత్రిని చేసేయడంతో.. మిగతా నేతల వారసులకు కూడా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు. లోకేష్ కూడా పార్టీలో యువతికి ప్రాధాన్యం ఇస్తామంటూ.. వారసులకు ఇచ్చారు తప్ప, కొత్తవారిని ఎంకరేజ్ చేసిన దాఖలాలు లేవు. ఇక మహానాడులో వారసుల హడావుడి అంతాఇంతా కాదు. వారే పార్టీ భవిష్యత్ అన్నట్లు ప్రమోట్ చేసేవారు. ఇటువంటి చర్యల వల్ల నిజాయితీగా పార్టీ కోసం కష్టపడిన శ్రేణులు పార్టీకి దూరమయ్యాయి. తరువాత పార్టీ అధికారానికే దూరమైంది.  

లోకేష్ చాలా తెలివైన వాడే...కానీ అదే దెబ్బేసింది....మాజీ నేత విశ్లేషణ !

  ఏపీ మాజీ సీఎం కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలివి తక్కువ వాడని, పప్పు అని అప్పటి ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ప్రాజెక్ట్ చేసింది. ఆయన మీద వందల కొద్దీ మార్ఫింగ్ పోస్ట్ లు చేసీ చేసీ ఆయనకు పప్పు అనే పేరు పెట్టేసింది. దానికి తోడు ఆయనకు తెలుగు సరిగా పలకక పోవడంతో జనం అదే నిజమని నమ్మారు. నిజానికి ఆయన తెలివైన వాడు, అది ఆయనతో రాజకీయం చేసిన వారికి మాత్రమే తెలుసు, అది వైసీపీ వారికయినా టీడీపీ వారికయినా కీలక నేతలుగా ఉన్నవారికి. ఈ విషయం చెబితే మీకు నవ్వు రావచ్చు కానీ అదే నిజం. ఇదే విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు ఆ పార్టీ మాజీ నేత ప్రస్తుత బీజేపీ నేత అంబికా కృష్ణ. తాజాగా బీజేపీలో చేరిన ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నారా లోకేశ్ కు ప్రజల్లో అంత ఆదరణ రాలేదని అందుకే మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో ఓడిపోవడం టీడీపీకి, లోకేశ్ కు అపప్రధేనని అభిప్రాయపడ్డారు. లోకేశ్ కొన్ని పద్ధతులను మార్చుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ అపాయింట్ మెంట్ కూడా పార్టీ నేతలకు దొరికేది కాదని వ్యాఖ్యానించారు.  చంద్రబాబుతో అపాయింట్మెంట్ కావాలన్నా దొరికేది కానీ లోకేశ్ తో దొరికేది కాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికినా లోకేష్ ది దొరకక కొంతమంది మంత్రులు కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారని చెప్పుకొచ్చారు. నాయకుడి వెనుక లక్షల మంది ఉంటారని, అది అర్థం చేసుకుని వాళ్లకు టైం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కానీ అది తెలియక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే లోకేష్ చేసిన బ్లండర్ అని అంబికా కృష్ణ చెప్పారు.  నిజానికి లోకేశ్ చాలా తెలివైనవాడనీ, ఆలోచనాపరుడనీ, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడని అంబికా కృష్ణ తెలిపారు. ‘ఓ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? ఓ సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయం లోకేశ్ కు బాగా తెలుసనీ, అయితే ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్ సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతుందేమో? అని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఇది ఈయన అనుభవం వలన వచ్చిన అభిప్రాయం మాత్రమే కానీ ఈ విషయం చాలా మందికి అర్ధం అయ్యింది. లోకేష్ కి మైనస్ ఏదయినా ఉంది అంటే అది లోకేష్ వెనక ఉన్న టీమ్ మాత్రమే. కిలారు రాజేష్, పెద్ది రామారావు లాంటి వారిని ఆయన ఒక కోటరీగా ఏర్పరచుకుని ప్రజలు కాదు కదా నాయకులను కూడా తన అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. అదే ఆయన కొంప ముంచింది. 

జగన్ రాజధానిని దొనకొండకి మారుస్తారా ?

  జగన్ రాజధానిని మారుస్తాడా? ఇప్పుడు ఇదే చర్చ ఏపీని పట్టి కుదిపేస్తోంది. ఇలా చర్చ జరగాడానికి ఒక కారణం జగన్ గద్దె నెక్కిన వెంటనే అమరావతి పనులను ఆపడమే కాక వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు - ఎమ్మెల్యేలు దోనకొండ మరియు చుట్టుపక్కల భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా ఈ అనుమానాలకు కారణమవుతోంది. జగన్ ప్రణాళికల ప్రకారమే వీరంతా కొంటున్నారనే చర్చ మొదలయ్యింది.  నిజానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పడు ఏపీ రాజధాని కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ దోనకొండను ఏపీ రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసింది. అయితే చంద్రబాబు ఈ ప్రభుత్వ భూములున్న ప్రాంతాన్ని కాకుండా అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. అయితే అత్యదిక ప్రభుత్వ భూములు ఉన్న దోనకొండకి ఇండస్ట్రీయిల్ కారిడార్ పేరిట ఒక సెజ్ కి శంకుస్థాపన చేసి వదిలిపెట్టారు. అయితే జగన్ మొండితనం, ఎన్నికల ముంగిట రాజధాని మార్పు విషయంలో అతడి వైఖరి సందేహాలకు తావిస్తున్నాయి.  ఎన్నికల ముందుఓ జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జగన్‌ను రాజధాని మార్పుపై అడిగితే ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఆ మౌనం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహాలున్నప్పటికీ జగన్ ఆనాడు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు యోచన నిజంగానే జగన్‌కు ఉందేమో అన్న డౌట్లు వచ్చాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించి అక్కడ ఎంత అభివృద్ధి చేసినా భవిష్యత్తులో టీడీపీ దాని క్రెడిట్ పొందవచ్చు చేసుకోవచ్చు.  తమ ప్రణాళికల్నే జగన్ అమలు చేశాడని చెప్పొచ్చు. కాబట్టి అమరావతిలో ముందు అనుకున్న స్థాయిలో అభివృద్ధి అయితే జరక్కపోవచ్చు. ఇప్పుడే కాక మరోవైపు 2014లో కూడా జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా దొనకొండలో భారీగా భూములు కొన్నట్లు సమాచారం. వాళ్ల కోసం జగన్ రాజధాని మార్చొచ్చన్న ప్రచారం కూడా ఉంది. కానీ రాజధాని మార్పు అంత సులువైన వ్యవహారమేమీ కాదు కాబట్టి అధికారికంగా ఇలాంటి మార్పేమీ చేయకుండా అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతిలో యాక్టివిటీ తగ్గించి రాయలసీమ, దొనకొండ ప్రాంతాలలో తమకు కావలసిన హైకోర్టు లాంటివి, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం.. క్రమంగా అమరావతి ప్రాధాన్యం తగ్గించడం లాంటివి జగన్ చేయొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇది ఎంతవరకూ నిజం అవుతుందో ? తెలీదు కానీ చర్చ మాత్రం జరుగుతోంది.  

కుమారస్వామి సంచలన నిర్ణయం...వారికి ఆ ఆఫర్

  ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. అయితే మరోపక్క రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు.  సీఎంను మార్చినా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని వారు చెబుతున్నారు. అయితే సీఎం పదవి నుంచి వైదొలిగేది లేదని చెబుతున్న కుమారస్వామి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇరు పార్టీలకు చెందిన 13 మంది రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను కూడా వారు తిరస్కరించినట్టు సమాచారం. ఇక ఈరోజు నేడు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా కొందరు మంత్రులతో రాజీనామా చేయించి, వాటిని రెబల్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజీనామాల విషయంలో తాను ముందు వరుసలో ఉన్నట్టు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, జలవనరుల శాఖా మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం పరమేశ్వర తన నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.  కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే మంత్రి పదవులు త్యాగం చేయడానికి సిద్ధపడాలని ఈ సమావేశంలో పలువురు మంత్రులు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ముంబైలోని హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు పదిమంది కుమారస్వామి ఆఫర్‌ను తిరస్కరించారని చెబుతున్నారు. త్వరలోనే తామంతా బీజేపీలో చేరబోతున్నట్టు రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ చెబుతున్నారు. ఇక ఇదే మంచి సమాయం అనుకున్న సీఎం ఆశావహులు తమ తమ అభిమానుల చేత సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.  అలా ప్రచారం జరుగుతున్న పేర్లలో డీకే శివ కుమార్, రామలింగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటు ముందుకు వచ్చింది. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆ తీర్మానంలో పేర్కొంది.

వైసీపీ మాస్టర్ ప్లాన్....అనుకున్నదే చేశారు....

  వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పదవి నుండి తొలగించగానే అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనుకున్న పదవిలో విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టాలి అనుకున్న ప్రభుత్వం దాని కోసం ఏకంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌(లాభదాయక హోదా) కిందకు రాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఆర్డినెన్స్‌ జారీచేసింది. గత నెలలోనే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఈ పోస్టులో నియమించారు. అయితే అప్పుడు ఈ పోస్టుకు ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నుంచి మినహాయింపు లేదు. దీంతో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ముప్పు వచ్చే అవకాశం ఉండడంతో ఆ నియామకాన్ని రద్దు చేశారు. చట్టసభల సభ్యులు ఇతర లాభదాయక పోస్టుల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ అనే నిబంధనలు గతంలో తీసుకొచ్చారు. మంత్రి పదవులు, స్పీకర్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు-సభ్యులు లాంటి పదవులు శాసనసభ విధుల్లో భాగం కాబట్టి వాటిని లాభదాయకం కింద చూడొద్దని ఒక జాబితా ఖరారు చేశారు. ఏయే పోస్టులు లాభదాయకం కావో నిర్ధారించుకునే అధికారాలు రాష్ర్టాలకే ఉంటాయి. ఏపీలో 116 పోస్టులను ఇప్పటికే ఈ జాబితా నుంచి మినహాయించారు. చివరిసారిగా 2007లో టీటీడీ చైర్మన్‌, సభ్యుల పదవులను ఈ జాబితా నుండి మినహాయించారు. అదేవిధంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు కూడా ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నుంచి మినహాయింపునిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌క్వాలిఫికేషన్స్‌(అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌, 2019’ను గవర్నర్‌ నరసింహన్‌ శనివారం జారీచేశారు. దీంతో విజయసాయిరెడ్డిని మళ్లీ నియమించుకునేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.  దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని మళ్లీ పదవి వరించింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ సర్కారు జీవో నెంబర్ 35 జారీ చేసింది. ఢిల్లీ ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ విజయసాయిరెడ్డి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వస్తే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా గౌరవించాలని ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఆయనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేసింది.

ఒక పరాజయం 100 తప్పులు.. నాశనం చేసిన బాబు 'నేనే' మంత్ర జపం

  ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆ విషయం ప్రజలకు తెలుసు. ఆ విషయాన్ని ప్రజలు చెప్తే బాబుకి కూడా గౌరవంగా ఉంటుంది. కానీ బాబు.. హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేశా, హైదరాబాద్ ని నేనే ప్రపంచపటంలో పెట్టా, అన్నీ నేనే చేశా అంటూ పదేపదే చెప్పుకోవడంతో.. ఉన్న గౌరవం పోయి నవ్వుల పాలయ్యారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయన నేను అనే మాటని వదల్లేదు. ఆ పని నేనే చేశా, ఆ ప్రాజెక్ట్ నేనే తెచ్చా ఇలా అన్నీ నేనే నేనే అంటూ పదేపదే చెప్పి చులకన అయిపోయారు. ఆయన నిజంగానే ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ ఆయన పదేపదే నేనే చేసానని చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఆయన నిజంగానే ప్రజలకోసం చేస్తే.. ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు, గెలిపిస్తారు. కానీ ఇలా పదేపదే నేనే అనడం వల్ల విపక్షాలు దాన్ని అస్త్రంగా మలుచుకొని ప్రజల్లో ఆయన్ని చులకన చేసాయి. ఇప్పుడు ఆయనే విపక్షానికి పరిమితం అయ్యారు. ఎన్నికల ముందు కూడా బాబు నేనే మంత్రాన్ని జపించారు. ఒకవైపు ప్రజల్లో పలువురు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే.. బాబు ఆ విషయాన్ని పట్టించుకోకుండా నన్ను చూసి ఓటేయండి, అన్ని నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని అనుకోని ఓటేయండి అని చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు మాత్రం స్థానికంగా ఉండేది ఎమ్మెల్యేలే కదా అని వారిని ఓడించి ఇంటికి పంపారు. బాబుని ప్రతిపక్షానికి పరిమితం చేసారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా నిర్లక్ష్యం చూపారు. అన్నింటికి బాబు నేనున్నా, అన్ని నేనే అంటున్నారుగా అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళు ఓడిపోయారు, పార్టీని ఓడించారు. మొత్తానికి బాబు నేనే మంత్ర జపం.. ప్రజల్లో చులకన భావనతో పాటు, పార్టీకి ఓటమిని కూడా రుచి చూపించింది.

బీజేపీలో జనసేన విలీనం.. బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్!!

  అమెరికాలో తానా ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తానా వేడుకల్లో అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తో సమావేశమయ్యారు. అమెరికాలో జరిగిన వీరి భేటీ అందరిలోనూ ఆసక్తి కలిగించింది. ఇది కచ్చితంగా రాజకీయ భేటీ అయ్యుంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్, రామ్ మాధవ్ మాత్రం అలాంటిదేం లేదని కొట్టి పారేస్తున్నారు.  పాత పరిచయంతోనే రామ్ మాధవ్ ను కలిశానని పవన్ వెల్లడించారు. తాను రామ్ మాధవ్ ను కలవడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ లేవని స్పష్టం చేశారు. రామ్ మాధవ్ కూడా పవన్ ను స్నేహపూర్వకంగానే కలిశానని, తమ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ తో పనిచేసే ఉద్దేశం లేదని, అయితే పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. వీరిద్దరూ ఇది స్నేహపూర్వక భేటీ అని చెప్తున్నప్పటికీ, ఈ భేటీలో ప్రధానంగా రాజకీయ అంశాలే చర్చకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పిన రామ్ మాధవ్.. నిజంగానే ఈ భేటీలో పవన్ ని బీజేపీలోకి ఆహ్వానించారని వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ.. ఇప్పుడు పవన్ మీద దృష్టి పెట్టిందట. పవన్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఆయనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పవన్ కి దగ్గరైతే యూత్ బీజేపీకి దగ్గరవుతారని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. అదేవిధంగా మెజారిటీ కాపు సామాజికవర్గం కూడా పవన్ వెంట నడిచే అవకాశముంది బీజేపీ అంచనా వేస్తోందట. అందుకే ఇప్పుడు పవన్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. దానిలో భాగంగానే రామ్ మాధవ్.. పవన్ ని కలిసి జనసేనను బీజేపీలో విలీనం చేయాలనీ అప్పుడు మీరే సీఎం అభ్యర్థి అని చెప్పారట.. లేదా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కోరారట.  అయితే ఈ విషయంలో పవన్ మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని గతంలో పవన్ పదేపదే విమర్శించారు. ఇప్పుడు అదే బీజేపీతో దోస్తీ అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లి జనసేన మరింత బలహీన పడుతుందని ఆయన భావిస్తున్నారట. ఇక విలీనం అనే మాట వింటేనే పవన్ ఉలిక్కిపడుతున్నారట. గతంలో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో 18 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకుంది. అయితే తరువాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసారు. దీంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. అందుకే పవన్ విలీనం అంటేనే ఉలిక్కిపడుతున్నారట. అదీగాక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం పట్ల పవన్ కూడా అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసారు. మళ్ళీ ఇప్పుడు తానే తాను స్థాపించిన పార్టీని విలీనం చేయడం కరెక్ట్ కాదని పవన్ భావిస్తున్నారట. అయితే బీజేపీ కనీసం పవన్ తో పొత్తుకైనా ఒప్పించాలని చూస్తోందట. మరి పవన్ బీజేపీతో కలిసి పనిచేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

తొక్కుదామనుకుంటే ఏకు మేకయ్యాడు రేవంత్ !

  ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసి తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదటి సారి లోక్ సభలో అడుగుపెట్టిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెరాస దుమ్ము దులిపి పారేశారు. జీరో అవర్ లో ఆయన లేవనెత్తిన అంశాలు పలువురుని ఆకట్టుకున్నాయి. పోడు భూముల వివాద అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించి ఇటీవల అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడి సహా పోడు భూముల సమస్యల గురించి మాట్లాడి దశాబ్దాలుగా ప్రభుత్వం, ఆదివాసీల మధ్య నలుగుతున్న భూ సమస్య పరిష్కారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.  రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని కాగజ్ నగర్ దాడిని ప్రస్తావించారు. ఐదు లక్షల హెక్టార్ల భూముల విషయంలో సమస్య కొన్నేళ్లుగా సాగుతోందన్నారు. అడవిని పోడు చేసి ఆదివాసీలు జీవిస్తుండగా వారిని వెళ్లగొట్టేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఐదో షెడ్యూల్‌లో ఉన్న సున్నితమైన ఈ సమస్య విషయంలో కేంద్ర అటవీ, హోంశాఖ మంత్రులు జోక్యం చేసుకొని తక్షణమే సమీక్ష జరపాలని కోరుతున్నానని రేవంత్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.  ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా సభలో మాట్లాడారు. ఇంటర్ విద్యార్థుల అంశాన్ని సంజయ్‌ ప్రస్తావించారు. అయితే ఈ విషయాలు ఇప్పుడు హైలైట్ గా నిలుస్తున్నాయి. దానికి కారణం ఈ ఇద్దరూ అసెంబ్లీకి పోటీ చేసి ఓడి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ కి పోటీ చేసి గెలిచారు. అయితే సంజయ్ సంగతి ఏమో కానీ రేవంత్ ని మాత్రం అప్పట్లో కేసీయార్ గట్టిగా టార్గెట్ చేశారు. అదేదో సినిమాలో అన్నట్టు గేటుని ఎంత గట్టిగా నెడితే అంత బలంగా వెనక్కి వస్తుందని అలాగే వచ్చి నేషనల్ లెవల్లో కెసీఆర్ కి చెమటలు పట్టిస్తున్నాడు రేవంత్. బీజేపీలోకి వెళ్తాడని ప్రచారం కూడా జరుగుతోంది. నిజంగా అది గనుక జరిగిందా ? కేసీఆర్ ఒంటెత్తు పోకడ పాలనకి చరమ గీతం పాడడానికి బీజేపీ మొదటి అడుగు వేసినట్టే.

బాబుని టార్గెట్ చేయడానికి జగన్ కి మరో దారి ?

  అభివృద్ధిని సైతం పక్కన పెట్టి గత ప్రభుత్వ అవినీతి మీదే ఫోకస్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబును కార్నర్ చేసే మరో విషయాన్ని వెలికి తీశారు. అదేంటంటే సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్ వ్యవహారం. టీడీపీ సర్కార్ గతంలో  జారీ చేసిన ఈ చెక్కులు అది కూడా తొమ్మిది వేలకు పైగా చెక్కులు బౌన్స్ కావడంతో ఈ సాకు చూపి బాబును కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 9వేలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బౌన్స్ అయిన వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల ముందు ఎలా అయినా వోట్లు గుద్దించుకునే క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఖజానాల నుండి సొమ్ము తరలించారని ఆరోపణలు వైసీపీ చేస్తోంది. వ్యవసాయ శాఖలో విత్తనాల కొరతకు కారణం , కొనుగోలు చెయ్యకపోవటం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవటమేనని వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు ఆరోపణలు చేసినా ఎవరూ అంతగా పట్టించుకోలేదు.  కానీ ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ల వ్యవహారం మాత్రం కలకలం రేపుతోంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ నిధులు కేటాయించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోరిందే తడవుగా చెక్కులు జారీ అయ్యేవి. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పెట్టిన కొన్ని అనవసర పధకాల వలన నిధుల మళ్లింపు జరిగినదని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయని అధికారులు చెబుతున్నట్టు సమాచారం. 9 వేలకుపైగా చెక్కులు బౌన్స్ అవగా ఆ అయ్యిన వాటి విలువ 40 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇక దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారట జగన్.  

ఒక పరాజయం 100 తప్పులు.. కోడికత్తి టీడీపీకే దిగిందా?

  ఒకప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద రాజకీయపరమైన విమర్శలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. నాయకులు ఒక్కరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. దీనికి టీడీపీ కూడా మినహాయింపు కాదు. ఓ రకంగా టీడీపీ ఘోర పరాజయానికి ఈ వ్యక్తిగత విమర్శలు కూడా కారణమని చెప్పవచ్చు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మీద పదేపదే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుండేది. అదే టీడీపీ కొంపముంచింది. జగన్ అప్పటికే అవినీతి ఆరోపణల కేసుల కేసులో ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. జగన్ ని అప్పటి కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా జైలుకి పంపిందని అప్పటికే వైసీపీ శ్రేణుల్లో అభిప్రాయం ఉంది. దానికి తోడు.. తరువాత ఆయన అధికారంలోకి వచ్చేవరకు యాత్రల పేరుతో ప్రజల్లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన్ను 'ఏ1' అంటూ పదేపదే టీడీపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయడంతో.. ప్రజల్లో జగన్ మీద తెలీకుండానే సానుభూతి ఏర్పడింది. అదేవిధంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి విషయంలో కూడా టీడీపీ నోరు పారేసుకుంది. బాబూ రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలైతే.. జగన్ మీద ఆయన తల్లో, చెల్లెలో దాడి చేసి ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు మిగతా టీడీపీ నేతలు కూడా 'కోడి కత్తి.. కోడి కత్తి' అంటూ జోకులేసారు. అక్కడ దేనితో దాడి జరిగిందనేది కాదు.. ఎవరి మీద దాడి జరిగిందనేది ముఖ్యం. ఓ ప్రతిపక్ష నేత దాడి మీద జరిగితే.. అధికార పార్టీ నేతలు మాట్లాడాల్సిన మాటలేనా అవి?. అలా కోడి కత్తి అంటూ నోరు పారేసుకుని, జగన్ మీద సానుభూతి పెంచారు. తమ పార్టీ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. ఓ రకంగా గత ఐదేళ్లల్లో టీడీపీ తమ ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న అభివృద్ధి గురించి చెప్పడం కంటే.. జగన్ మీద విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చించింది. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది.

హోదాని అటక ఎక్కించారు.. కనీసం ఇప్పుడైనా పోరాడతారా జగన్?

  2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగానే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా ఏపీకి అన్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఏపీకి కేంద్రం మొండిచేయి చూపించిందని విమర్శించారు. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఎన్నికలకు ముందు.. తమ పార్టీని గెలిపిస్తే ఏపీకి న్యాయం జరిగేలా చూస్తామని జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో.. బీజేపీకి పూర్తీ మెజారిటీ ఉందని, కాబట్టి బ్రతిమాలడం తప్ప చేసేదేమి లేదని జగన్ చేతులెత్తేశారు. మరోవైపు బీజేపీ నేతలేమో హోదా ముగిసిన అధ్యాయమని కుండబద్దలు కొట్టేసారు. మొత్తానికి అందరూ కలిసి హోదా విషయం అటక ఎక్కించారు. హోదా విషయంలో మొండిచేయి చూపిన కేంద్రం.. బడ్జెట్ లో కూడా ఏపీకి అన్యాయం చేసింది. ఏదో విజయ సాయి మీడియా ముందుకొచ్చి అన్యాయం జరిగిందని చెప్పారు సరే. మరి సీఎం జగన్ ఏం చేయబోతున్నారు?. గతంలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగితే, అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మీద వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. టీడీపీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోతుందని వైసీపీ పదే పదే విమర్శలు చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు రోజులు మారాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు?. కేంద్రం మెడలు వంచి ఏపీకి న్యాయం జరిగేలా చూస్తారా?. లేక హోదా విషయంలో వెనక్కి తగ్గినట్టే తగ్గి విమర్శలు పాలవుతారా?. ఏపీ ప్రజలు జగన్ ని నమ్మి వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. 22 ఎంపీ సీట్లు అంటే మాములు విషయం కాదు. ప్రాంతీయ పార్టీలలో ఎంపీల సంఖ్యా పరంగా వైసీపీనే ముందు వరుసలో ఉంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీలతో ఏపీకి న్యాయం జరిగేదాకా పోరాటం చేయిస్తారా? లేక బీజేపీని ఢీ కొట్టడం రిస్క్ ఎందుకని సైలెంట్ గా ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది.

చేతులు కాలాకయినా ఆకులు పట్టుకున్నారు....థాంక్స్ లోకేష్ గారూ !

  టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ తెలిపారు. వైసీపీ నేతలు బెదిరించినా, దాడిచేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కేసులు పెట్టి వేధించినా టీడీపీ ప్రత్యేక విభాగం నంబర్ 7306299999కు సమాచారం అందించాలని సూచించారు. ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు, అభిమానులను రక్షించుకోవడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. అలాగే టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆదుకునేందుకు ప్రతీ జిల్లాకు లీగల్ సెల్ ఏర్పాటు చేశామని లోకేశ్ పేర్కొన్నారు.  టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు తమపై ఎదురైన వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు https://www.facebook.com/tdpsocialmedialegalcell  అనే ఫేస్ బుక్ పేజీని ప్రారంభించామని తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు కార్యకర్తల దృష్టికి వస్తే, ఈ పేజీ వేదికగా పంచుకోవాలని కోరారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన పోరాటం చేస్తామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీపై దుష్ప్రచారం చేస్తూ, పార్టీ నేతలపై అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  దీని కోసం ప్రతి జిల్లాలో తెదేపా లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను, అభిమానులను రక్షించుకోవడం మా బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు.  అయితే ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. దానికి కారణం మనం చేసిన మంచి పనులు జనాలకు తెలిస్తే జనానికి మనం నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ కానీ మనపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని అడ్డుకోకపోతే ప్రతి ఒక్కరికి దూరమైపోతామని చాన్నాళ్ళగా తెలుగుదేశం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారు ఎప్పటి నుండో మొత్తుకున్నా వారి మాట చెవిన పడేసుకున్న పాపాన పోలేదు పార్టీ.  కానీ అంతా అయిపోయి జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు ఆ విషయాన్ని గొప్పగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తనకున్నంత మీడియా బలం వైకాపాకు లేదనే భ్రమలో ఉండింది కానీ అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియాని వైకాపా ఆక్రమించింది అనే విషయాన్ని పార్టీ గ్రహించలేకపోయింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైకాపా, టీఆర్ఎస్ కార్యకర్తలు చంద్రబాబును తిట్టని తిట్టు లేదు. బోల్లిబాబు అంటూ మొదలు పెట్టి రకరకాల పేర్లతో, ఫోటో మార్ఫింగ్ లతో చంద్రబాబు గురించి చేయని ప్రచారం, చెప్పని అబద్ధమూ లేదు.  కానీ అధికారంలో ఉన్న పార్టీని ఇంత ధైర్యంగా తిడుతున్నా, వ్యక్తిగత పరువుకు భంగం కలిగిస్తున్నా తెలుగుదేశం ప్రముఖులు అస్సలు పట్టించుకోలేదు. నవ్విన నాపచేను పండుతుంది అనుకున్నారో ఏమో అసలు ఖండన కూడా ఉండేది కాదు. ఏకంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వైకాపా అనఫీశియాల్ పెయిడ్ పేజెస్ లో లోకేష్, చంద్రబాబుల మార్ఫింగ్ ఫోటోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. విజయసాయిరెడ్డి మొదట తన ట్విట్టరులో ఏదో ఒక ఆరోపణ చేస్తారు. ఆ ఆరోపణ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.  పార్టీలో ఆ స్థాయి వ్యక్తి రాతపూర్వకంగా చెప్పారు అంటే అది నిజమై ఉంటుంది కదా అని ఆ పార్టీ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేసేవారు. కానీ ఏ ఒక్క ఆరోపణ మీద కూడా టీడీపీ పరువు నష్టం దావా వేయలేదు. కోర్టుకు వెళ్లలేదు, దీంతో ఆయన మళ్లీ మళ్లీ ఎప్పుడూ ఎవరూ చేయని ఆరోపణలు కూడా చేయడం మొదలుపెట్టారు. అలా రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు పనులను, అభివృద్ధిని అబద్ధమని నమ్మించడంలో వైసీపీ వంద శాతం సక్సెస్ అయ్యింది. దీనిని మొగ్గలోనే అడ్డుకుని ఉంటే టీడీపీకి ఇంత డ్యామేజ్ కచ్చితంగా జరిగేది కాదు. చివరకు ఈరోజు కృష్ణా జిల్లాకు తొలకరి కంటే ముందే నీరు అందిస్తున్న పట్టిసీమ కూడా చంద్రబాబు కట్టి తప్పు చేశాడు, అవసరం అయితే ఆ పట్టిసీమని కూడా కూలగొట్టాలి అని ఆ పార్టీ నేతలు అంటున్నారంటే బాబు చేసిన అభివృద్ధిని వైసీపీ ఎలా ప్రచారం చేసిందో అర్ధం అవుతోంది. మొత్తానికి చేతులు కాలాక అయినా ఆకులు పట్టుకుంటూ మంచి పనే చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు లోకేష్ కి థాంక్స్ కూడా చెబుతున్నారు.   

జగన్ అభద్రతా భావం....అందుకే విజయసాయి తొలగింపు ?

  ఏపీ రాజకీయాల్లో ఒక ఘటన ఆసక్తికరంగా మారింది, అదే విజయసాయి రెడ్డి ప్రత్యేక ప్రతినిది హోదా నుండి తొలగింపు. నిజానికి ఇది మామూలుగా అయితే అంత పెద్ద ప్రాముఖ్యత లేని వార్తే అని చెప్పాలి. ఏదో పొరపాటున నియమించారు, ఇప్పుడు రూల్ తెలిసి తప్పించారని సరిపెట్టుకోవచ్చు. కానీ గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి గురించి జరుగుతున్న ప్రచారం మాత్రం అలా సరిపెట్టుకోనివ్వడం లేదు.  ఎందుకంటే ఇది జగన్ తీసుకున్న అనూహ్య నిర్ణయం. వైకాపాలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి విజయసాయి, అక్రమాస్తుల కేసులో కలిసి జైలుకి వెళ్లి వచ్చిన నాటి నుండి ఈయనను పార్టీలో నెంబర్ 2 స్థానానికి వచ్చేలా చేశారు జగన్. అసలు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఈయన ఏకంగా ఒక పార్టీలో నెంబర్ 2 అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. ఆయన చదువు ప్రకారం ఆయన ఒక తెలివయిన వ్యక్తి అయ్యుండచ్చు, కానీ ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా జగన్ పుణ్యమా అంటూ ఏకంగా పీఎంవోలో గంటల తరబడి కూర్చునే స్థాయికి వచ్చారు.  ఆ మహత్యమో ఏమో కానీ 2019 ఎన్నికల్లో అయితే విజయసాయిరెడ్డి లేకుండా ఏ పనీ జరగలేదు. జగన్ ని కూడా అంతగా పట్టించుకోక క్యాడర్ మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఎంతో కీలకంగా కనిపించిన ఆయనకు ప్రచారం జరిగినట్టే ప్రాధాన్యత దక్కింది. మొన్నటి విజయం అనంతరం ఏకంగా 5 పదవులు జగన్ ఆయనకు కట్టబెట్టారు. అందులో అత్యంత కీలకమైన, కేబినెట్ ర్యాంకు కలిగిన పోస్టు ‘ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి’ పదవి కూడా ఒకటి. అయితే ఈ పోస్టును రద్దు చేస్తూ నిన్న రాత్రి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  దీనికి కారణంగా నిబంధనల పేరు చెబుతున్నారు. ఓ ఎంపి మరో లాభదాయక పదవిలో కొనసాగేందుకు వీలు లేదన్నది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఉన్న నిబంధన. ఇదే విషయంలో గతంలో కూడా సోనియా గాంధి వంటి వారి మీద చాలా వివాదాలు రేగాయి. అందుకే తప్పించామని చూచాయగా చెబుతున్నా ఈ కీలకమైన పోస్టును పీకేయడం వెనుక మరో పెద్ద కారణమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో మోడీకి ఏపీ బీజేపీ నేతల కంటే సాయిరెడ్డి ఎక్కువ దగ్గరయ్యాడని విశ్లేషకుల భావన. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నాడు, మోడీ వచ్చి విజయ్ గారూ బాగున్నారా అని అన్నారని, ఇది జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని ఆయన పేర్కొన్నాడు.  నిజానికి విజయసాయి మీద ఆంధ్రా పళని స్వామి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన సొంత పార్టీకి ఎలా హ్యాండ్ ఇచ్చి మోడీతో చేతులు కలిపి సీఎం పీఠాం అనుభవిస్తున్నాడో ఈయన కూడా అదే చేయబోతున్నాడనేది కొందరి వాదన. అదీ కాక ఏపీలో వైసీపీ వారిని చేర్చుకోడానికి బీజేపీ తలుపులు తెరిచింది, ఎటూ జగన్ గెలిచేందుకు మోడీ ఈవీఎంల ద్వారా సాయ పడ్డాడు అనే ప్రచారం ఉండనే ఉంది, ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలను తప్పించి, విజయసాయి రెడ్డిని బీజేపీ సీఎం చేసినా ఆశ్చర్యం లేదని ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాల మధ్య సాయిరెడ్డిని తప్పించడం ఏపీ రాజకీయల్ల్లో కలకలం రేపుతోంది. ఈ ప్రచారాల వలన ఏర్పడిన అభద్రతా భావం వలనే జగన్ విజయసాయి రెడ్డిని తప్పించారనేది జరుగుతున్న ప్రచారం. చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకూ దారితీస్తుందో ?  

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీకి పెద్ద దెబ్బ వేసిన పెద్ది!

  టీడీపీ ఘోర పరాజయంలో పెద్ది రామారావు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. నారా లోకేష్ ప్రసంగాలు మెరుగు పరచాలనే ఉద్దేశంతో పెద్ది రామారావును శిక్షకుడిగా ఎంపిక చేసారు. లోకేష్ కి శిక్షణ ఇవ్వడం ఏమో కానీ, ఆయన పార్టీకి పరోక్షంగా శిక్ష విధించారనే అభిప్రాయం వ్యక్తమవవుతోంది. పెద్ది రామారావు రచయిత. పలు నాటకాలు, సీరియల్స్ రచించారు. మరి ఈయన లోకేష్ దృష్టిలో ఎలా పడ్డారో తెలీదు కానీ.. లోకేష్ ప్రసంగాలు మెరుగుపరిచే బాధ్యత పెద్దికి అప్పగించారు. బహుశా పెద్దికి తెలుగు మీద పట్టు ఉండటం వల్ల ఎంపిక చేశారేమో?. అయితే ఆ ఎంపికే తరువాత వారి కొంపముంచింది. పెద్ది వైసీపీ సానుభూతి పరుడనే ప్రచారం కూడా ఉంది. మరి అలాంటి పెద్దిని లోకేష్ తన దగ్గర ఎలా పెట్టుకున్నారో అర్థంకాని ప్రశ్న. పెద్ది మూలంగా లోకేష్ ప్రసంగాలలో పెద్దగా మార్పేమీ లేదు. అదే తడబాటు, అదే నవ్వులపాలు. కానీ పెద్ది జీవితం ఈ నాలుగేళ్లలో చాలా మారిపోయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఆర్థికంగా చాలా బలపడ్డారట. అంతేకాదు ఈయన పార్టీ డేటాని కూడా లీక్ చేసారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయంలో బాబుకి ఈయన తప్పుడు రిపోర్టులు కూడా ఇచ్చారు అంటారు. మొత్తానికి పెద్దిని పక్కన పెట్టుకొని.. బాబు, లోకేష్ లు పార్టీకి పెద్ద నష్టమే చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

సీఎం జగనే...కానీ పాలన మాత్రం ఆయనదా ?

  ఏపీలో ఆగ‌స్ట్ 15వ తేది నుంచి గ్రామ సేవ‌కుల వ్య‌వ‌స్థ అమ‌లులోకి రానుంది. దీంతో ఇక‌ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీ వారి చేతుల మీదుగానే పంపిణీ కానున్నాయి. ఆఖ‌రికి రేష‌న్ స‌రుకుల‌ను సైతం గ్రామ సేవ‌కులే ఇంటింటికి చేరుస్తారని సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటి దాకా రేష‌న్ అందిస్తున్న డీల‌ర్ల వ్య‌వ‌స్థ ర‌ద్దు కానుంది. వేలాది మంది రేష‌న్ డీల‌ర్లు రోడ్డున ప‌డ‌నున్నారు, అయితే ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే వారంతా త‌మ రేష‌న్ డీల‌ర్ల వ్య‌వ‌స్థ‌ను రద్దు చేయ‌వ‌ద్ద‌ని కోరుతూ ప‌లు విన్న‌పాలు చేశారు.  అయినా ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి స్పంద‌న లేని నేప‌థ్యంలో ఎపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు ఆధ్యాత్మిక గురువు స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్ప‌తిని ఈ రేష‌న్ డీల‌ర్లు ఆశ్రయించారు. ఈ వ్య‌వ‌స్థ ర‌ద్దు కాకుండా త‌మ‌రే త‌మ‌ను ర‌క్షించాల‌ని ఈరోజు స్వామిజీ అభ్య‌ర్ధించారు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నిజానికి స్వాములు ఆధ్యాత్మిక దీవెనలు ఇస్తారు తప్ప ప్రభుత్వాలు, మంత్రులు, సీఎంల మాదిరిగా సమస్యలు పరిష్కరించరు కదా. మరి అలాగైతే.. రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారం కోసం స్వరూపానంద వద్దకు ఎందుకు వచ్చినట్టు ? అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఏపీలో ఏ పని కావాలన్నా స్వరూపానంద ఆశీస్సులు ఉంటే చాలని, స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ నిత్యం స్వామి వారి పాద సేవ చేస్తుంటే స్వామి వారి నోట నుంచి వచ్చే మాటను పెడచెవిన పెట్టరని, ఈ లాజిక్ గ్రహించిన రేషన్ డీలర్లు ఇలా తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ ను ఆశ్రయించడానికి బదులుగా నేరుగా స్వరూపాందన వద్దకు వచ్చారని ప్రచారం జరుగుతోంది.  గతంలో తెలంగాణలోనూ చిన్నజీయర్ స్వామిని కలిసి రెవెన్యూ ఉద్యోగులు ఆ శాఖను ప్రక్షాళన చేయకుండా కేసీఆర్ కు చెప్పాలని వినతిపత్రం ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు జగన్ విషయంలో కూడా రేషన్ డీలర్ లు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే ఇదంతా కావాలని చేసిందని వైసీపీ అనుకూల వెబ్ మీడియా కధనాలు ప్రచురించింది. స్వామీజీని కలసిన రేషన్ డీలర్ల వర్గం అసలు యూనియన్ లో ఒక భాగం మాత్రమేనని కేవలం జగన్ ని టార్గెట్ చేయడం కోసమే వారు ఈ పనిచేసినట్టు తెలుస్తోందని కధనాలు ప్రచురించింది.  గతంలో జగన్ స్వామీజీని కలిసినప్పుడు టీడీపీ నేతలు నానా హంగామా చేసి స్వరూపానంద పవర్ సెంటర్ గా మారుతున్నారని ఆరోపించారని ఆ ఆరోపణలకి తగ్గట్టే మంత్రివర్గ కూర్పు సమయంలో చాలామంది ఆశావహులు స్వరూపానంద దర్శనానికి ఎగబడ్డారు కూడా. ఆ తర్వాత జగన్ నుంచి సూచనలు వెళ్లాయో లేక స్వామీజీయే అవగతం చేసుకున్నారో తెలియదు కానీ ఇటీవల రాజకీయ తాకిడి శారదా పీఠానికి కాస్త తగ్గిందని, కానీ ఇప్పుడు కావాలనే ఇలా రేషన్ డీలర్ లు చేశారని అంటున్నారు.  ముందుగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నామని చెబితే శారదా పీఠం నిర్వాహకులు ఒప్పుకోలేదని, అందుకే భక్తుల ముసుగులో ఆ డీలర్లు స్వామీజీని కలిశారని, ఎక్కడా డీలర్లనే ప్రస్తావనే రాకుండా, అసలు సమస్య ఏమిటో కూడా స్వరూపానందకు చెప్పకుండా దర్శనం చేసుకుని, ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు తీసుకుని వైరల్ చేశారనేది ఆ మీడియా సారాంశం. అయితే ఇందులో నిజం ఎంత అనేది ఆ స్వరూపానంద స్వాముల వారికే ఎరుక.