నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు: చంద్రబాబు

ప్రధానమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పష్టం చేశారు. మెదక్ జిల్లా సదాశివపేటలో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఇఫ్త్తార్ విందు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశానికి సుభిక్షం కాదని, సెక్యులర్ భావాలు గల వ్యక్తికే మద్దతు ఇస్తామని బాబు చెప్పారు. ముస్లింల అభివృద్ధికి అవసరమైన చర్యల కోసం పార్టీ పరంగా కమిటీ వేశామన్నారు. అందులో చర్చించి త్వరలో ముస్లిం డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపారు. కాగా త్వరలోనే తాను ఉర్దూ నేర్చుకుంటానని చంద్రబాబు తెలిపారు. అయితే 2014 సాధారణ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఫోకస్ అవుతున్న దృష్ట్యా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.