ఇంగ్లీష్ లెక్చరర్ అవతారమెత్తిన జగన్... స్టూడెంట్స్ గా మారిపోయిన విద్యావేత్తలు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొఫెసర్‌ అవతారమెత్తారు.  విజయవాడలో నిర్వహించిన... ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్ ఎడ్యుకేషన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు ప్రవేశపెట్టారో వివరించారు. మన విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అన్నారు. అంతేకాదు, ఎడ్యుకేషన్‌లో ప్రపంచ దేశాలతో భారత్‌‌ను... ఆంధ్రప్రదేశ్‌ను పోల్చుతూ లెక్కలతో సహా వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుంటే... సదస్సుకు హాజరైనవారంతా స్టూడెంట్స్ లా మారిపోయి... శ్రద్ధగా విన్నారు.

ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడని, అయితే ఒక తండ్రిగా నా పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని కోరుకుంటానని, అందుకే.... ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామన్నారు. పేద విద్యార్ధులకు కూడా ఇంగ్లీష్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏలుతుందన్న జగన్మోహన్ రెడ్డి... ఇంగ్లీష్ లాంగ్వేజ్ లగ్జరీ కాదని... అందరికీ నెస్సస్సరీ లాంగ్వేజ్ అన్నారు. అయితే, పేద విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నదని, అందుకే... తాము ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అదే సమయంలో, మాతృభాషకు అన్యాయం జరగకుండా తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేశామని జగన్ గుర్తుచేశారు. తాము తీసుకున్న నిర్ణయంతో పేద విద్యార్ధులు సైతం ప్రపంచంతో పోటీపడగలరని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. 99శాతం ప్రైవేట్ స్కూళ్లన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండగా, పేద పిల్లలు మాత్రమే తెలుగు మీడియంలో ఎందుకు చదవాలని జగన్ ప్రశ్నించారు. మీరైనా, నేనైనా మన పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించగలమా అన్నారు.

కేవలం, ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడమే కాదు... మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేస్తూ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు జగన్ తెలిపారు. నాడు నేడుతో పాఠశాల రూపురేఖలే మార్చేయబోతున్నామని జగన్ వెల్లడించారు. నాణ్యమైన విద్యతోపాటు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Teluguone gnews banner