జగన్ పుట్టినరోజున వైసీపీ అరాచకం! దళితుడిపై పెట్రోల్ పోసి నిప్పు..
posted on Dec 21, 2021 @ 2:25PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. జగన్ పుట్టినరోజు వేడుకలంటూ పలు ప్రాంతాల్లో హంగామా చేశారు వైసీపీ కార్యకర్తలు. పలు చోట్ల ఓవరాక్షన్ కూడా చేశారు. గుంటూరు నగరంలో అయితే వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు.
జగన్ పుట్టినరోజే హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గం పత్తిపాడు మండలపరిధిలోని బోయపాలెం జాతీయ రహదారిపై వైసీపీ నేతలు వీరంగం వేశారు. పోలీసులు తమను ఏం చేయలేరనే ధైర్యంతోనే ఏమో రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించారు వైసీపీ కార్యకర్తలు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం జీజీహెచ్కు తరలించారు.పెదనందిపాడు మండలం, కొప్పర్రుకు చెందిన వెంకటనారాయణ పెద్దకుర్రపాడు అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
వైసీపీ శ్రేణులు మద్యం మత్తులో చంద్రబాబును దూషించడంతో అక్కడే ఉన్న వెంకటనారాయణ వారిని అడ్డుకున్నాడు. జగన్ వచ్చిన తర్వాతే మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని, చంద్రబాబు ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడితనం లేదని అన్నాడు. మాకే ఎదురు సమాధానం చెబుతావా? అంటూ వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టే యత్నం చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన వెంకటనారాయణను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బాధితుడు దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త. ఈ ఘటనపై టీడీపీతోపాటు అన్ని వర్గాలకు చెందిన దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.