ఆంధ్రోళ్లు ఆదరిస్తారా?
posted on Apr 11, 2023 @ 2:02PM
ఆంధ్రోళ్ల పెత్తనం పోవాలే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలే.. నీళ్లు.. నిధులు.. నియామాకాలు.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి.. ఆ క్రమంలో ఆ ప్రాంత వాసులందరినీ ఏకం చేసి.. ఏక తాటిపైకి తీసుకు వచ్చి.. సుదీర్ఘ ఉద్యామాన్ని నడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ బాస్ కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ఆ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు. నడిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వలస పాలన, ఆంధ్రోళ్లు అంటే సీమాంధ్ర వాసులపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ ఇంకా ఏపీ జనంలో పచ్చిగానే ఉన్నాయి. సరే అదలా ఉంచితే..
కేసీఆర్ ఇటీవల పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని తొలగించి.. ఆ స్థానంలో భారత్ అని చేర్చి... టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ రాజకీయాలలోకి ఒక్క సారిగా పోల్ వాల్ట్ లా గెంతేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక కూటమిని తయారు చేసేందుకు కేసీఆర్ నడుం బిగించారు. ఆ క్రమంలో ఆయన ఇప్పటికే మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు నిర్వహించిఅక్కడి స్థానిక నేతలను కారెక్కించారు.
అదే విధంగా సాటి తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్కు కేసీఆర్ బాధ్యతలు కట్టబెట్టారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ అధ్యక్షతన విశాఖపట్నం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది.
అయితే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతోంది. అయితే కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ను ఆంధ్ర ప్రజలు ఓన్ చేసుకొంటారా? అన్న సందేహాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. నాటి నుంచి నేటి వరకూ అంటే ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఏపీ స్థిరంగా కుదురుకున్న దాఖలు లేవు. ఏపీ ఇంకా సమస్యల సుడిగుండంలో చిక్కకొని అల్లాడిపోతోంది. అలాగే విభజన సమయంలో ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు సైతం గల్లంతు అయ్యాయని వారు గుర్తు చేస్తున్నారు.
విభజన బిల్లు.. ఆమోదం పొందే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5, 10, 15 ఏళ్లు అంటూ.. బహిరంగ వేలం జరుగుతోన్న వేళ... నాయకులు గొంతు సవరించుకునేలోగానే బిల్లు పాస్ అయిపోయిందని.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా లేదు.. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. మహాభారతంలో భీముడు.. జరాసంధుడ్ని సునాయాశంగా చీల్చినట్లు.. విభజనతో రాష్ట్రాన్ని చీల్చారు. విభజనతో అన్ని విధాలుగా నష్టపోయినా ఏపీకి ఇంత వరకు న్యాయం జరగలేదు. మరో వైపు విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సి ఉమ్మడి ఆస్తుల పంపకం ఈ రోజుకూ తేల లేదు. నదీ జాలాల్లో నీటి వాటా కోసం.. ఈ రెండు రాష్ట్రాల పేచీ నేటికీ జలసౌధ సాక్షిగా కొన.. సాగుతోనే ఉందని వారు వివరిస్తున్నారు. అలాగే ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగులు పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉంది.
అలాంటి వేళ ఆంధ్ర ప్రదేశ్కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అయితేనేమీ.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ ఈ గులాబీ దళం ఏనాడు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చిన పాపాన పోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే.. మా తెలంగాణకీ ఇవ్వాలి.. పోలవరంకు జాతీయ హోదా ఇస్తే.. మా కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలంటూ కేసీఆర్ ఫ్యామిలీ ప్లస్ ఆయన కేబినెట్లోని మంత్రులు సైతం పలు సందర్బాల్లో పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేశారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణలో ఉన్న పరిశ్రమలు ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలన్నీ మూటా ముల్లు సర్థుకొని ఆంధ్రప్రదేశ్కు తరలిపోతాయంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. గతంలో ఎన్నిక ప్రచారం వేళ.. చేసిన వ్యాఖ్యల వీడియోలు నేటికి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ.. ప్రైవేటీకరణ దిశగా మోదీ ప్రభుత్వం వేసిన అడుగు పూర్తి కావోస్తున్నాయి. అలాంటి వేళ దీనిని కొనుగోలు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం బిడ్ వేస్తోందనే ఓ టాక్ అయితే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్రా ఉద్యోగులు ఒక్కరు కూడా ఉండకూడదంటూ.. హుకూం జారీ చేసిన కారు పార్టీ అధినేత.. నేడు.. ఆంధ్రప్రదేశ్కు ఎలా వస్తారని... ఓ వేళ వస్తే.. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారా అంటే సందేహేమే అని పరిశీలకులు అంటున్నారు.
అదీకాక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23 జిల్లాలతో నిత్య కల్యాణం పచ్చ తోరణంలాగా నిత్యం కళకళలాడుతూ ఉండేదని... ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే.... దేశంలోని మొత్తం రాష్ట్రాల జాబితాలో... అక్షర క్రమంలోనే కాదు... అభివృద్ధిలోనే కాదు... ఆర్దికాభివృద్ధిలో సైతం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండేదని... కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. అంటే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత.. విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలి పోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో అగ్రస్థానంలోనే ఉన్నా.. అభివృద్ధిలో... ఆర్థికాభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థానానికి సర్రున జారిపోయిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో... ఉన్న కళను పొగొట్టి.. మళ్లీ పాత కళ తీసుకు వస్తామని పక్క రాష్ట్రం వారు ఎవరో వచ్చి చెబితే.. ఆంధ్రోళ్లు ఆదరిస్తారా? అంటే.. ఏమో... ఎన్నికల వేళ వరకు వేచి చూడాల్సిందేననే ఓ అభిప్రాయం అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.