ఒమిక్రాన్ తో భారత్లో థర్డ్ వేవ్? WHO అధికారి అలర్ట్..
posted on Dec 12, 2021 @ 1:06PM
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 59 దేశాలకు వ్యాపించింది. భారత్లో ఇప్పటి వరకు 34 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన విజయనగరం వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలో మూడో వేవ్ రాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్త వేరియంట్ వచ్చినంత మాత్రాన దయనీయమైన పరిస్థితులు తలెత్తుతాయని భావించాల్సిన అవసరం లేదన్నారు పూనమ్ ఖేత్రపాల్. అయితే, కొంత అనిశ్చితి మాత్రం ఉంటుందని తెలిపారు. మహమ్మారి ఇంకా అంతం కాలేదని పూనమ్ తెలిపారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్ని మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలన్నారు.
ఇప్పటికే ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయని పూనమ్ అభిప్రాయపడ్డారు. అయితే, అది ఎలాంటి ప్రభావం అనేది మాత్రం ఇప్పుడే నిర్ధారించలేమన్నారు. మరింత స్పష్టత కోసం ప్రతి దేశం సమగ్రమైన సమాచారం పంపాలని కోరారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ వ్యాప్తి, తీవ్రత, ఇన్ఫెక్షన్ రేటు, లక్షణాలను నిర్ధారించడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.
దక్షిణాఫ్రికా నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్ వల్ల రీఇన్ఫెక్షన్లు అధికంగా నమోదవుతున్నాయని పూనమ్ తెలిపారు. అలాగే డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కానీ ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదన్నారు. ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ఖచ్చితంగా ధరించాలని పునమ్ సూచించారు. జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ముప్పు తప్పదని హెచ్చరించారు డాక్టర్ పూనమ్ ఖేత్రవాల్.