రాత్రికి రాత్రే 135 ఏళ్ల చరిత్ర నేలమట్టం! అంత రహస్యమెందుకు కేసీఆర్..
posted on Jun 13, 2021 @ 12:02PM
తెలంగాణలో మరో చరిత్రాత్మక కట్టడం కాలగర్భంలో కలిసిపోయింది. 135 ఏండ్ల చరిత్ర నేలమట్టం అయింది. హైదరాబాద్ లోని చరిత్రాత్మక సచివాలయ భవనాన్ని కూల్చినట్లే.. వరంగల్ సెంట్రల్ జైలును కూడా గప్ చుప్ గా నేలమట్టం చేశారు అధికారులు. శనివారం తెల్లవారుజామున మొదలైన కూల్చివేత పనులు.. ముమ్మరంగా సాగుతున్నాయి.పెద్ద పెద్ద యంత్రాలతో భవనాలను కూల్చేస్తున్నారు అధికారులు. ఇదంతా అత్యంత రహస్యంగా కానిచ్చేస్తున్నారు. కూల్చివేతలను పరిశీలించేందుకు మీడియాకు, జైల్ సిబ్బందికి గాని అనుమతి ఇవ్వడం లేదు. కూల్చివేతలకు సంబంధించి ఇప్పటివరకు కనీసం ఒక ఫోటో కూడా బయటికి రాలేదంటే.. ఎంత గప్ చుప్ గా పని కానిస్తున్నారో ఊహించవచ్చు.
సెంట్రల్ జైలును కూల్చవద్దంటూ ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయనుందని వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే అధికారులు చకచకా పనులు మొదలు పెట్టారు. జైలు అధికారులు శుక్రవారం రాత్రే ఆగమేఘాల మీద ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వద్దకు వెళ్లి జైలు స్థలాన్ని అప్పగిస్తున్నట్లు లేఖ అందించారు. ఆ వెంటనే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.ఇప్పటికే సగానికి పైగా భవనాలను కూల్చేశారని తెలుస్తోంది. కూల్చివేతలతో కేఎంసీ నుంచి వరంగల్ వైపు రోడ్డును క్లోజ్ చేసేశారు. ఎంజీఎం సెంటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జైల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంక్ను సైతం క్లోజ్ చేశారు.
వరంగల్ జైలు కూల్చివేతల్లో అధికారులు తీరుపై విమర్శలు వస్తున్నాయి. మీడియాను సైతం అనుమతించకుండా జైలు గేట్లు మూసేసి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేయాల్సిన అవసరం ఏముందని జనాలు ప్రశ్నిస్తున్నారు.సెంట్రల్ జైల్లో కూల్చివేతలు జరుగుతుంటే రోడ్డుపై కూడా నిర్బంధాలు ఎందుకంటూ జనం మండిపడుతున్నారు. అసలు కూల్చివేత విషయాన్ని ఎందుకంత గోప్యంగా ఉంచుతున్నారని నిలదీస్తున్నారు.
భారతదేశంలోనే అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన కారాగారం వరంగల్ సెంట్రల్ జైలు. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో నిర్మిం చిన ఈ కారాగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రస్తుతం దేశంలోనే అత్యంత పటిష్టమైనదిగా చెప్పుకుంటున్న తీహార్ జైలు నుండి కూడా ఎన్నోసార్లు ఖైదీలు తప్పించుకొని వెళ్లారు. కానీ 135 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వరంగల్ జైలు నుండి ఇప్పటివరకూ ఒక్క ఖైదీ కూడా తప్పించుకొని పోలేదంటే, ఈ జైలు నిర్మాణం ఏవిధంగా ఉందో ఊహిం చొచ్చు. ఈ జైలులో నేసిన తివాచీలు ప్రపంచ ప్రఖ్యా తిని గాంచాయి. నక్సలైట్ అగ్రనేతలైన కానూ సన్యాల్తోపాటు కాళోజి, దాశరథి, వీవీ, ప్రస్తుత మావోయిస్టు అగ్రనేత గణపతి లాంటి ఎందరో ఈ జైలు జీవితం గడపిన వారే.
కాకతీయ సామ్రాజ్యంగా ఓరుగల్లుకు ఎంత చరిత్ర ఉందో, వరంగల్ కేంద్ర కారాగారానికి అంత పేరుంది. 19వ శతాబ్దం అంతం వరకు జైళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేది. నేరస్తులు, నేరా రోపణ ఎదుర్కొంటున్న వారిని గోదాముల లాంటి గదుల్లో ధించేవారు. సరైన మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు ఉండేవి కావు. అయితే 1880లో నిజాం ప్రభుత్వంలో హన్కిన్ అనే అధికారి జైళ్ల శాఖ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజాం రాష్ట్రంలో జైళ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులొ చ్చాయి. అందులో భాగంగానే, 1885లో వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం జరిగింది. 15 ఏళ్ల క్రితం వరకు నాటి కట్టడ ప్రతిరూపంగా ఉన్న జైలు ముఖ ద్వారం స్థానంలో కొత్త ప్రవేశ ద్వార నిర్మాణం జరి గినా లోపల మాత్రం గత నిర్మాణాలు యధాతథంగా కన్పిస్తాయి. నాటి నుండి నేటి వరకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటు పరిశుభ్రత, ఖైదీల్లో పరి వర్తనకు మారుపేరుగా నిలిచిందీ కారాగారం. జైళ్లను ఉత్తమ ప్రమాణాలు కలిగిన పరివర్తనాలయాలుగా మార్చినందుకు హన్కిన్స్కు నిజాం ప్రభుత్వం 1913లో ప్రత్యేక పురస్కారం అందచేసింది.
వరంగల్ జైలు కమ్యూనిస్టు తీవ్రవాదులను ఉంచే ప్రధాన కారాగారంగా పేరొందింది. 2010 వరకు మావోయిస్టు, జనశక్తి పార్టీ వాళ్లకు ప్రత్యేక బ్యారక్లను కేటాయించేవారు. వారి కిచెన్లను వారే నిర్వహిం చుకునేవారు. ఖైదీలు కోర్టుకు వెళ్లకుండా ఇక్కడి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపే సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ జైలులో ఐఎస్.ఐ. లాంటి వాటికి చెందిన కరుడు గట్టిన ఉగ్ర వాద ఖైదీలను ఉంచుతున్నారు.
13 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సెంట్రల్ జైలులో 700 మంది ఖైదీలను ఉంచడానికి అవకాశ ముండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కృష్ణా జిల్లాల అండర్ ట్రయల్స్, నేరస్థులను కూడా ఇక్కడ ఉంచేవారు. విచారణ ఎదుర్కొనే అండర్ ట్రయల్స్కు ఇక్కడ ప్రత్యేక లాకప్ ఉండడం దానికి ఒక కారణం. ఖైదీలకు వైద్య సదుపా యాలు అందించడానికి ప్రత్యేక డిస్పెన్సరీ, విద్యావ కాశాలకుగానూ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ శిక్ష అనుభవిస్తూనే అనేక మంది ఖైదీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేశారు. దీనిలో బాస్కెట్బాల్, వాలీబాల్ తదితర క్రీడా సౌక ర్యాలున్నాయి. గతంలో ఈ జైలులోని ఖైదీలు, అండర్ ట్రయల్స్ రాసే రచనలు, కవితలు, కథలతో సుధార్ అనే ఇంటర్నల్ మ్యాగజైన్ కూడా వెలువరించేవారు. పలు వ్యాధులతో బాధపడే ఖైదీలను ఐసోలేషన్లో ఉంచడానికి ప్రత్యేక గదులున్నాయి.
సెంట్రల్ జైలు పరిధిలో ఉన్న 15 ఎకరాల వ్యవసాయ భూమిలో కూర గాయలు, మొక్కజొన్న, మామిడి చెట్లతో పాటుగా అనేక పూల మొక్కలను నేటికీ పెంచుతున్నారు. ఈ జైలు ఖైదీల ద్వారా పెట్రోల్ పంపులను కూడా నిర్వ హిస్తున్నారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన వరంగల్ సెంట్రల్ జైలు ఇకనుండి చరిత్రగానే మిగిలిపోనుంది. అయితే ఈ జైలు స్థలంలో అత్యాధు నిక ప్రమాణాలతో చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్మించ డంపై వరంగల్ వాసులు సంతృప్తి చెందుతున్నారు.