పర్యాటకులకు రక్షణ కరువు?

రాష్ట్రంలో పర్యాటకులకు రక్షణ కల్పించలేని వాతావరణం నెలకొంది.  ప్రత్యేకించి పూర్తిస్థాయి అభివృద్థి చెందిన టూరిస్టు ప్రాంతాలపైనే ప్రభుత్వం దృష్టిసారించింది. దీంతో కొత్తగా అభివృద్థి చెందాల్సిన పర్యాటక ప్రాంతాల గురించి అస్సలు ప్రణాళికే లేకుండా పోయింది. ప్రభుత్వమే ప్రణాళిక రూపొందించుకోకపోవటంతో ఇక్కడ పోలీసుల నుంచి తప్పించుకు తిరిగేవారు ఆశ్రయం పొందుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందని జలపాతాల వద్ద అయితే అస్సలు రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తమిళనాడు వంటి పొరుగురాష్ట్రాలను పరిశీలిస్తే జలపాతాలు వంటి వాటి దగ్గర రక్షణచర్యలు గట్టిగా ఏర్పాటు చేశారు. అందువల్ల అక్కడ మరణాలు, ఇతర క్రైమ్‌ జరిగే అవకాశాలు తక్కువ. రాష్ట్రంలో మాత్రం నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ చిత్తూరు జిల్లా భైరెడ్డిపల్లి మండలం కైగల్‌ జలపాతం వద్ద ఓ ప్రేమజంటను గుర్తుతెలియని కొందరు వేధించారు. కర్నాటకలోని బంగారుపేటకు చెందిన ఆ జంటలోని యువతిపై అత్యాచారం చేశారు.  ఈ జంటను చికిత్స నిమిత్తం వి.కోట ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.