నీళ్లడిగిన గ్రామస్తుడి తల పగలగొట్టిన సర్పంచ్.. వీడియో వైరల్
posted on Sep 22, 2021 @ 3:06PM
ఆయన ఊరికి సర్పంచ్. గ్రామ ప్రజల సమస్యలు తీర్చే పదవిలో ఉన్నారు. అలాంటి సర్పంచ్ విచక్షణ కోల్పోయాడు. దిగజారి ప్రవర్తించాడు. గ్రామ సమస్యపై ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశాడు. కొట్టడమే కాదు ఎగిరెగిరి తన్నాడు. బండ రాయితో తల పగులగొట్టాడు. గ్రామస్తుడిపై సర్పంచ్ దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నీళ్ల సమస్యను ఎప్పుడు తీరుస్తారంటూ ప్రశ్నించినందుకు ఓ గ్రామస్థుడిపై సర్పంచ్ దాడి చేశారు. ఆ వ్యక్తిని ఎగిరెగిరి తన్నారు. అంతటితో ఆగకుండా రాయితో అతడిని చితకబాదారు. దీంతో ఆ వ్యక్తి తలకు తీవ్రగాయమైంది. కన్ను వాచిపోయింది. తలకు నాలుగు కుట్లు పడ్డాయి. బాధితుడు శ్రీనివాస్ ను సర్పంచ్ జైపాల్ రెడ్డి తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గ్రామంలో కొన్ని రోజులుగా నీళ్ల సమస్య ఉందని, కిరాణా షాపుకు వెళ్లగా అక్కడ సర్పంచ్ తో పాటు మరికొందరు నీళ్ల గురించి మాట్లాడుకుంటుండగా తానూ సమస్యపై ప్రశ్నించానని బాధితుడు శ్రీనివాస్ చెప్పారు. అయితే, నువ్వేందిరా అడిగేదంటూ సర్పంచ్ తన్నాడని, కిందపడేసి రాయితో బాదాడని తెలిపారు. ఇష్టమొచ్చినట్టు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సర్పంచ్ జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
అయితే తనపై కొందరు కావాలనే కుట్ర చేశారని సర్పంచ్ జైపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఊరికే శ్రీనివాస్ ను కొట్టలేదని, తనను బూతులు తిట్టాడని, అమ్మను కలిపి తిట్టాడని ఓపిక నశించే కొట్టానని చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉందన్నారు జైపాల్ రెడ్డి. వేరే వాళ్లతో తన గల్లా కూడా పట్టించి దాడి చేయించబోయాడన్నారు.బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కలిసి తనపై కుట్ర చేశారని ఆరోపించారు. శ్రీనివాస్ తో తనకెలాంటి గొడవలు లేవని, అతడు మంచివాడని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల చెప్పుడు మాటలు విని తనపై దాడికి ప్రయత్నించాడని, తాగి వచ్చి గొడవ పెట్టుకున్నాడని తెలిపారు. పోలీసుల చెకింగ్ లో కూడా ఆ విషయం తేలిందని చెప్పారు సర్పంచ్ జైపాల్ రెడ్డి.