ఓ ఊరినే అమ్మేశారు!

ధర్మరాజు జూదంలో భార్యను పోగొట్టుకున్నాడని.. హరిశ్చంద్రుడు తన సత్యవ్రతం కోసం భార్యనే అమ్మేశాడని.. విన్నాం. అది ధర్మం, సత్యం, న్యాయం కోసమన్నది అందరికి తెలిసిన సత్యం. అయితే నేటికాలంలో  కొద్దిగా పలుకుబడి వుందా?, మాటలతో బురిడి కొట్టించగల నేర్పరులా?, కుందేలును కోతిగా చెప్పించగల నేర్పుందా? అట్లయితే... ఓ.కె. ఈ రాష్ట్రంమీదే...?  నిజం.. ఎలా..అని సామాన్యులకు అనుమానమోస్తోందా? ఇదిగో...ఇలా.. గౌనివారిపల్లె రెవిన్యూ గ్రామం (కొండాపురం పంచాయితీ) పరిధిలోని  రాంపురం  గ్రామపరిధిలోని ఓ కుగ్రామంలోని ఈ భూమి అంతా మాదేనంటూ కొందరు దళారులు రికార్డులు సృష్టించిపొరుగురాష్ట్రాలకు చెందిన ఓ ప్రైవేటు  కంపెనీకి అమ్మేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విధంగా  ఆ భూమి తమదేనన్నట్లుగా రికార్డులు కూడా సృష్టించేశారట! అలా ఊరునే అమ్మేసుకున్నారు ఆ ఘనులు.  ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి తమ గ్రామాన్ని కాపాడమంటూ ఆ గ్రామస్తులు  వేడుకుంటున్నారట... వీరిని ఇలాగే వదిలేస్తే  ఇప్పుడు ఢిల్లీగా పిలువబడే హస్తినాపురం గతంలో మా పూర్వీకులైన పాండవులేదని.. పట్టాలు పుట్టించి వాటిని మళ్ళీ ఏ తెల్లోడికో అమ్మేయగల నేర్పరులు.  వీరి లిస్టులో   ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాంతాలు కూడా ఉన్నాయేమో!  దేవుళ్ళారా... చారిత్రక పురుషుల వంశజుల్లారా  మా దళారుల కన్ను మీ మీదపడుతుందేమో... బహుపరాక్‌!

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.