విజయసాయి రెడ్డి పరువు గోవిందా!
posted on Mar 24, 2021 @ 10:08PM
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పరువు పోయింది. పార్లమెంట్ సాక్షిగా ఆయన చేసేవన్ని తప్పుడు ఫిర్యాదులేనని తేలింది. తనపై విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగిందని విజయసాయి రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని పార్లమెంట్ సభాహక్కుల సంఘం తేల్చింది. పార్లమెంట్ సభ్యులహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలతో సభా హక్కుల సంఘం లోక్సభకు 70వ నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదులోని పరిశీలన అంశాలను ప్రస్తావించారు. విశాఖ ఎయిర్పోర్టులో విజయసాయిపై దాడి జరిగిందనడానికి సాక్ష్యాలు లేవని సభాహక్కుల సంఘం స్పష్టం చేసింది. 26 జనవరి 2017లో విశాఖ ఎయిర్పోర్టులో తన దాడి జరిగిందని విజయసాయి చేసిన ఫిర్యాదులో ఆధారాలు లేని కారణంగా సభాహక్కుల సంఘం ఉల్లంఘనకు రాదని నివేదికలో వెల్లడించింది.
26 జనవరి 2017లో విశాఖ ఆర్కే బీచ్లో ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేయడానికి ప్రజాసంఘాల సిద్ధమయ్యాయి. అప్పట్లో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరుగుతుండడంతో ఆ స్పూర్తితో అందరూ ముందుకు రావాలని సోషల్ మీడయాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత జగన్, విజయసాయితో పాటు వైసీపీ ముఖ్యనేతలు హైదరాబాద్లో విమానం ఎక్కి విశాఖలో దిగారు. అయితే తర్వాత రోజు అంటే 2017 జనవరి 27వ తేదీ నుంచి విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉండడంతో అప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో విమానాశ్రయంలో జగన్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
తమను పోలీసులు అడ్డుకోవడంతో ఎయిర్పోర్టులో జగన్, విజయసాయి రచ్చరచ్చ చేశారు. పోలీసులను తోచేశారు. తాము అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తామని హెచ్చరించారు. ఈ ఘటనలో విజయసాయి చాలా దూకుడుగా వ్యవహరించారు. ఆయన పోలీసులను తోచేస్తున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తానే పోలీసులపై దురుసుగా ప్రవర్తించి.. తనపైనే దాడి చేశారంటూ ఎంపీ హోదాలో రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ ఆయన తప్పుడు ఫిర్యాదు చేశారని తేల్చింది. ఆయనపై దాడికి ఆధారాలు లేవని తెలిపింది.