నెల గడిచినా అందని అధికారం.. ఏపీలో సర్పంచుల ఆగ్రహం
posted on Mar 25, 2021 9:26AM
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కొత్త సర్పంచులు గెలిచారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు రోడ్డున పడి ఏడుస్తుంటే.. గెలిచిన వారు ఇంట్లో కూర్చొని ఏడవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి. నెల రోజులు క్రిందట ఎన్నికైన సర్పంచులు.. తమకు ఇంకా అధికారం రాకపోవడంతో కుమిలి పోతున్నారు. ప్రభుత్వం కరుణ కోసం పడిగాపులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నెల రోజులు గడిచినా నేటి వరకు పాలకవర్గాలకు అధికారాలు, బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో నేటికీ గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి.
సర్పంచుల అధికారికంగా ప్రమాణ స్వీకారం తేదీని నిర్ణయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఆయా సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. అంతవరకు సర్పంచ్ హోదా ఉండదు. పంచాయతీకి సంబంధించి ఎటువంటి అధికారాలు సర్పంచ్ గా ఉండవు. ఆర్థిక సంవత్సరం ముగింపులో భాగంగా మార్చి నెలాఖరు కావడంతో 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చుచేసి తమకు బాధ్యతలు అప్పగించే నాటికి పంచాయతీల్లో ఖాళీ ఖజానా ను ప్రత్యేక అధికారులు అప్పగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని నూతనంగా ఎన్నికైన సర్పంచులు వాపోతున్నారు.
2013 లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే సర్పంచులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాని ఈసారి నెల రోజులు గడిచిన ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం సర్పంచులు బాధ్యతలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేస్తారని సమాచారం.ఎన్నికలు జరిగి, ఫలితాలు ప్రకటించిన తేదీతో సంబంధం లేకుండా, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి సర్పంచులు, వార్డు సభ్యులకు ఐదేళ్లపాటు పదవీకాలం ఉంటుంది. పంచాయతీల్లో సచివాలయ ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయాలన్నా, నిధులను డ్రా చేయాలన్నా సర్పంచ్ లకు చెక్ పవర్ ఉంటుంది. అధికారికంగా జీవో జారీ చేసినా నాటి నుంచి మాత్రమే సర్పంచ్ గా అన్ని రకాల అధికారాలు లభిస్తాయి.
సర్పంచుల బాధ్యతలకు సంబంధించి కొన్ని మార్పులు ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఏప్రిల్ లోగానీ వీరు బాధ్యతలు చేపట్టే అవకాశలు లేవని అంటున్నారు. ఈ నెలాఖరుకు 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోనున్నాయి. వీటిని ప్రత్యేక అధికారుల చేత ఖర్చు పెట్టించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతు న్నారు. ఈ నెలాఖరు వరకు పంచాయతీ ప్రత్యేకాధికారుల ఏలుబడే కొనసాగే పరిస్థితి ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు మంజూర య్యి నిధులు, విధులపై సర్వహక్కులు పాలక వర్గాలకే ఉంటాయి. ప్రత్యేకాధికా రులు నిధుల దుర్వినియోగం, మళ్లింపు, ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంతోపాటు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు.
మరోవైపు అధికారికంగా ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టని విషయం చాలామంది జనాలకు తెలియదు. దీంతో తాగునీ టి సమస్యను పరిష్కరించాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలంటూ ప్రజలు ఒత్తిడి తీసుకువస్తున్నారని పలువురు సర్పంచులు వాపోతున్నారు. జగన్ రెడ్డి సర్కార్ తీరుతో గెలిచినా ఆనందం లేకుండా పోయిందని, ఖజానా అంతా ఖాళీ చేసి ఇస్తే తర్వాత తాము చేయడానికి కూడా నిధులు ఉండవలే ఆందోళన సర్పంచుల్లో వ్యక్తమవుతోంది.