టిఎస్ టెట్ దరఖాస్తు గడువుపెంపు
posted on Apr 10, 2024 @ 2:16PM
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్-2024) దరఖాస్తు గడువు పొడిగించడం జరిగింది. ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుంది. కానీ, ఈసారి టెట్ దరఖాస్తులు బాగా తగ్గాయి. మూడు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అనుకుంటే.. ఇప్పటివరకు రెండు లక్షలకు కూడా దాటని వైనం. అయితే, ఈసారి దరఖాస్తు రుసుము రూ. 1000 గా నిర్ణయించడం కూడా అభ్యర్థులు ఆసక్తి కనబరచకపోవడానికి ఒక కారణమని సమాచారం. ఇక 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.83 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 27న టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెట్ దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే. గతంలో టెట్ ఒక పేపర్కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది. ఈ విషయంలో అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనలేదు.
అయితే టెట్ రాసేందుకు ఇప్పటి వరకు కేవలం 1,66,475 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈసారి టెట్ దరఖాస్తు ఫీజు భారీగా పెంచడంతో అభ్యర్థులు రాసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఏప్రిల్ 8 సాయంత్రం నాటికి పేపర్-1కు 63,524 మంది, పేపర్-2కు 1,02,951 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రెండు లక్షల లోపే అప్లికేషన్లు వచ్చాయి.
మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను ఏప్రిల్ 15 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
వీరు అర్హులు..
➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.
➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
పరీక్ష విధానం:
➥ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.