15 వేల వాహనాలు సీజ్.. తెలంగాణలో కఠినంగా లాక్ డౌన్
posted on May 22, 2021 @ 10:32AM
తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈనెల 12 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే మొదట పోలీసులు సీరియస్ గా వ్యవహరించలేదనే ఆరోపణలు వచ్చాయి. లాక్ డౌన్ ఉన్నా వాహనాలు భారీగానే రోడ్లపై కనిపించాయి. జనాలు తిరుగుతున్న విజువల్స్ మీడియాలో ప్రసారమయ్యాయి. లాక్ డౌన్ పై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో డీజీపీ డైరెక్షన్ లోనే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. సడలింపు సమయం ముగిసిన తర్వాత రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్రెడ్డి ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు.
యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్న వారిపై కొరడా ఝళీపిస్తున్నారు పోలీసులు. పది గంటల తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చిన వారి నుంచి నిన్నటి వరకు ఏకంగా 15 వేల వాహనాలను పోలీసులు జప్తు చేశారు. మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కారణం లేకుండా బయటకు వచ్చే వారి వాహనాన్ని తాత్కాలికంగా జప్తు చేసి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. జరిమానా చెల్లించినా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాతే వాహనాన్ని ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు.
మరోవైపు లాక్డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే అందుకు కారకులైన వారిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. మే నెల తొలి రెండు వారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి 4.31 లక్షల కేసులు నమోదయ్యాయి. మాస్కు ధరించని వారి నుంచి రూ. 31 కోట్లను జరిమానాగా వసూలు చేశారు.