కరోనా కౌగిలిలో దేశం..
posted on May 22, 2021 @ 10:27AM
దేశంలో కరోనాఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మరోరోజు నాలుగు వేలకు పైనే మరణాలు నమోదయ్యాయి. రోజూవారీ కేసులు మాత్రం కొద్దిమేర తగ్గాయని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారం 20,66,285మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,57,299మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. గత కొద్దిరోజులుగా కొత్తకేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అలాగే గత నాలుగు రోజులుగా నిత్యం 20లక్షలపైనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ..మూడు లక్షలకు దిగువనే కేసులు వెలుగుచూస్తున్నాయి. అలాగే 24 గంటల వ్యవధిలో 4,194మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మరోసారి వరసగా రెండోరోజు కరోనా మరణాలు నాలుగువేలకు పైబడ్డాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1,263, తమిళనాడులో 467మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారిసంఖ్య 2,62,89,290 చేరింది. గత సంవత్సరకాలంలో మహమ్మారి 2,95,525మంది ఉసురుతీసింది.
ఇక క్రియాశీల కేసులు 30లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం 29,23,400మంది కొవిడ్తో బాధపడుతుండగా.. నిన్న 3,57,630మంది కోలుకున్నారు. వరసగా 9వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం రికవరీలు 2.3కోట్ల మార్కును దాటాయి. క్రియాశీల, రికవరీ రేట్లు వరసగా..11.12 శాతం, 87.76 శాతంగా ఉన్నాయి. మరోవైపు నిన్న 14,58,895 మందికి టీకాలు డోసులు అందాయి.
తెలంగాణాలో.. బ్లాక్ ఫంగస్ తో ఒకరు మృతి..
బ్లాక్ ఫంగస్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహబూబ్నగర్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె వాసి వెంకట్రెడ్డి(46) మృతిచెందారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆయన కంటికి ఇన్ఫెక్షన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంకట్రెడ్డిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాధితుడికి బ్లాక్ఫంగస్ సోకినట్లు నిర్ధరించారు. అక్కడ చికిత్స పొందుతుండగా నిన్న రాత్రి వెంకట్రెడ్డి పరిస్థితి విషమించింది. దీంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం మృతిచెందారు.