ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్...
posted on Dec 24, 2021 @ 8:04PM
విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థి సంఘాల ఆందోళనలు, విపక్షాల డిమాండ్లతో ప్రభుత్వం దిగొచ్చింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కొవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ప్రతీ ఒక్క విద్యార్థిని పాస్ చేయాల్సిందేనన్న డిమాండ్ నేపథ్యంలో విద్యాశాఖ తాజాగా సమీక్ష నిర్వహించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించిన విద్యాశాఖ.. విద్యార్థుల భవిష్యత్ మేరకు వారికి ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.ఇందులో భాగంగానే పరీక్షలు రాసిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరిని పాస్ చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
ఇంటర్ ఫస్టియర్లో మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో అందులో 2,24,012 మంది (49 శాతం) విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. ఫెయిలయ్యామనే ఆవేదనతో ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు కూడా జరిగాయి. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. కొవిడ్ కారణంగా క్లాసులు జరగలేదని, అందుకే విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారనే అభిప్రాయమే అన్ని వర్గాల నుంచి వచ్చింది. అన్ని వైపుల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం.. ఫెయిలైన విద్యార్థులను కూడా పాస్ చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
'కోవిడ్తో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కోవిడ్ సంక్షభం కారణంగా మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాం. అన్ని అంశాలు ఆలోచించిన తర్వాతే పరీక్షలు పెట్టాం. తాజాగా ప్రకటించిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసవ్వగా..మిగిలిన 51 శాతం మంది ఫెయిలయ్యారు. అయితే ఫెయిలయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నారు. ఫస్టియర్ ఫలితాలపై ప్రభుత్వాన్ని, సీఎంను టార్గెట్ చేయడం సరికాదు. ప్రతీదీ రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటైపోయింది' అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఫలితాలపై ఇంటర్ బోర్డులో ఎలాంటి లోపాలు జరగలేదన్నారు మంత్రి. వాల్యుయేషన్ పకడ్బందీగా నిర్వహించారని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరిస్తే మంచిదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫెయిలయిన విద్యార్థులందరికి కనీస 35 మార్కులు ఇచ్చి పాస్ చేస్తున్నామని సబిత చెప్పారు. ఇంటర్ సెకండ్ ఇయర్లోనైనా విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నన్నారు. ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్ సెకండియర్లో కూడా ప్రభుత్వమే పాస్ చేస్తుందని ఆశించడం మంచి పద్దతి కాదని మంత్రి సబితా విజ్ఞప్తి చేశారు