వేర్పాటువాదులారా.. మహాత్ముడి బాటలో నడవలేరా?

గాంధీ మహాత్ముడు ఎన్నుకున్న సత్యాగ్రహమనే పదునైన ఆయుధం తెల్లవాళ్లకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఎక్కడా హింసలేదు. ఎక్కడా పరుష పదజాలం లేదు. ఎక్కడా దూకుడు తత్వంలేదు. అంతా శాంతి యుతంగా సాగిపోయింది. పరాయిదేశంనుంచి వచ్చి మనపంచన చేరి తిరిగి మన జాతినే బానిస జాతిగా భావించి నెత్తికెక్కిన బ్రిటిషర్లను గాంధీ మహాత్ముడు శాంతి మార్గంలోనే మట్టికరిపించాడు తప్ప తన జీవితం మొత్తంలో ఒక్కమాటకూడా పరుషంగా మాట్లాడలేదు. రాజకీయమంటే ఇలాగే ఉండాలని మొత్తం ప్రపంచానికి చూపించిన మహనీయుడు గాంధీజీ. తన గొప్పదనంవల్లే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలిసినా పదవుల్ని ఆశించకుండా దేశంకోసమే నిలిచిన త్యాగశీలి గాంధీజీ. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చూస్తున్న గాంధీజీ ఆత్మ నిజంగా ఎంతగా క్షోభపడుతోందో.. వేర్పాటు వాదం తెగ బలిసిపోయి రాళ్లు రప్పలు విసిరేసుకుంటూ జనం విధ్వంసానికి దిగుతున్న హీన స్థితిని చూడలేకే కొండా లక్ష్మణ్ బాపూజీలాంటి గాంధేయవాది తనువు చాలించారేమో.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమిస్తున్న వాళ్లలో నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడుతున్నవాళ్లు ఈ రోజు ఎంతమందున్నారు..? ప్రత్యేకరాష్ట్రంకోసం పోరాటం పేరుతో స్వలాభంచూసుకుంటున్న నేతల చేతిలో అమాయకులు చాలామంది బలైపోతున్నారన్న సత్యాన్ని గుర్తించడానికి ఎందుకు ఎవరూ ఇష్టపడడంలేదు..? ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమిస్తున్న వాళ్లందరూ మహాత్ముడి జీవితంనుంచి సత్యమార్గంలో ఎంతటి ఫలితాన్నైనా సాధించుకోవచ్చన్న విషయం ఎందుకు తట్టడంలేదో..! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరుతో అభివృద్ధి నిరోధకులుగా మారిన కుటిల రాజకీయ నేతలకు మహాత్ముడి ఆత్మ మూడు ప్రశ్నలు వేస్తోంది. మహాత్ముడి బాటలో నడిచి సత్యాగ్రహాలతో మీక్కావాల్సినందాన్ని మీరు సాధించుకోలేరా..? మీమీద మీకు ఆమాత్రం నమ్మకంలేదా..? నిజంగా మీక్కావాల్సింది ప్రత్యేక రాష్ట్రమా.. లేక అంతులేని స్వలాభమా..?

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.