సిద్దం సభలకు వేల సంఖ్యలో బస్సులు..పోలింగ్ కు  మాత్రం జాడలేవు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు. 
 హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని ఏపీకి చెందిన వారంతా ఓటేసేందుకు తప్పకుండా సొంతూళ్లకు వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ డీజీపీ ర్యాంక్‌ అధికారి అయిన ఆర్టీసీ ఎండీకి మాత్రం ఇది ఎందుకు తెలియలేదనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు సీఎం జగన్‌ నిర్వహించిన ప్రతి 'సిద్ధం' సభకు వెయ్యి నుంచి 3 వేల చొప్పున బస్సులు కేటాయించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజలకు మాత్రం సరైన ఏర్పాట్లు చేయలేదు. 
 ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతి ఒక్కరూ సొంతూళ్లకు ప్రయాణమవుతారని తెలిసినా ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయలేకపోయారు. సోమవారం పోలింగ్‌ జరగనుండగా, శని, ఆదివారాలు వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో రద్దీ అధికంగా ఉంటుందనే అంచనా వేయలేకపోయారు. 
హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా శుక్ర, శనివారాల్లో రోజుకు 300 చొప్పున మాత్రమే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం 205 బస్సులే సిద్ధం చేశారు. దీంతో అవి ఏమాత్రం సరిపోవడంలేదు. హైదరాబాద్‌ నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు ఎలాగోలా రైళ్లు, బస్సుల్లో విజయవాడకు చేరుకున్నా.. అక్కడి నుంచి చుట్టుపక్కల మండలాలు, ఇతర జిల్లాల్లోని సొంత ఊరికి వెళ్లేందుకు బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 ఈ నెల 8 నుంచి ఆదివారం వరకు హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు 1,048 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని ఆర్టీసీ పేర్కొంది. వీటన్నింటిలో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో ఓటేయడానికి పొరుగు రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వస్తున్న వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్లను, ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. 

ఈసీని ఆశ్రయించిన పవన్ కళ్యాణ్ 

ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లినా బాధ్యతతో ఓటేయడానికి వస్తున్న వారికి బస్సులు ఏర్పాటు చేయాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర సిటీల నుంచి జనం పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని చెప్పారు. అయితే, పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకున్న జనాలకు సరిపడా బస్సులు లేవని తెలిపారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న వారి కోసం అదనంగా బస్సులు తిప్పాలని కోరారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను కోరారు. ఈమేరకు జనసేన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.వాస్తవానికి ఓటేయడానికి పెద్ద సంఖ్యలో జనం వస్తారనే విషయం ముందుగానే అంచనా వేసి, అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే, ప్రస్తుతం అలాంటి చర్యలు ఏవీ చేపట్టినట్లు కనిపించడంలేదన్నారు. బాధ్యతను మరవకుండా ఓటేయడానికి వస్తున్న వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయడం ఆర్టీసీ అధికారుల కనీస బాధ్యత అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సభలకు ఆగమేఘాలమీద బస్సులను ఏర్పాటు చేసే అధికారులకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న జనాల సమస్యలు కనిపించడంలేదా అని నిలదీశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఈ లేఖలో కోరారు.

Teluguone gnews banner