తెలంగాణకు త్వరలో తొమ్మిది ప్రైవేటు విశ్వవిద్యాలయాలు!!
posted on Feb 13, 2020 @ 1:34PM
తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఎడ్యుకేషన్, ఇండస్ట్రీయల్, మెడికల్ హబ్ లుగా మారి వినూత్నంగా దూసుకుపోతుంది. అయితే కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రానున్నట్లు తెలుస్తోంది. రాబోవు విద్యా సంవత్సరం నుంచే వాటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కీలక అడుగు పడినట్లు తెలుస్తోంది. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై సీఎం కేసీఆర్ సంతకాలు చేసినట్టు సమాచారం అందుతుంది. సుమారు తొమ్మిది వర్సిటీల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. అయితే వర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేరు వేరు యూనివర్సిటీలకు వేరు వేరు చట్టాలు కాకుండా ప్రైవేటు వర్సిటీల అన్నింటికీ కలిపి ఒకే చట్టం చెయ్యాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా ఆ కసరత్తును తుది దశకు చేరినట్లు కూడా సమాచారం అందుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు బిల్లును ప్రవేశ పెట్టే అవకాశముంది. ఆ తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల హడావిడి మొదలు కానుంది. నిజానికి ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి 2018 మార్చిలో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దాంతో అప్పటికే రాష్ట్రంలో వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్న పలు సంస్థలకు మార్గం సుగమమైంది. అప్పట్లోనే ప్రైవేటు వర్సిటీలు ప్రారంభమవుతాయని భావించిన పలు కారణాలతో సాధ్యం కాలేదు. గత ఏడాది కూడా సాధ్యం కాలేదు. ఈ యేడాది ఖచ్చితంగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఒకేసారి భారీగా ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఇప్పటికే సుమారు 15 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో పాటు రాష్ట్రంలోని పలు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఆసక్తి చూపాయి. వీటిలో మల్లారెడ్డి, శ్రీనిధి, అనురాగ్, ఎస్ఆర్, గురునానక్ ఉన్నాయి. ప్రస్తుతానికి తొమ్మిది యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో టెక్ మహీంద్రా, ఎస్ఆర్, మల్లారెడ్డి, గురునానక్, శ్రీనిధి, నిప్ మర్, అనురాగ్, ఎంఎన్ఆర్ వాక్సిన్ వర్సిటీలు ఉన్నాయి. వీటి దరఖాస్తులను పరిశీలించిన ప్రత్యేక కమిటీ వర్సిటీలు ఏర్పాటు చేసే భవనాలు ప్రాంతాలను కూడా తనిఖీ చేసింది. సంబంధిత నివేదికను రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి పంపింది. ఆ వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ సీఎం కేసీఆర్ తాజాగా సంతకం కూడా చేశారని తెలుస్తోంది. మరో రెండు ప్రముఖ విద్యా సంస్థలు రాడ్ క్లిఫ్, అమిటీ కూడా రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి స్థలం విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటు కానున్న తొమ్మిది ప్రైవేటు వర్సిటీల్లో ఒకటి మెడికల్, మరొకటి మహిళా వర్సిటీ అని తెలుస్తుంది. వీటిలో ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు మెడికల్ ప్రైవేటు వర్సిటీని, మల్లారెడ్డి విద్యాసంస్థలు మహిళా వర్సిటీని ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి దీన్నిబట్టి తెలంగాణలో భారీ స్థాయిలో ప్రైవేలు వర్సిటీలు రానున్నట్లు తెలుస్తోంది.