ఇళ్ల పట్టాలపై జగన్ సర్కార్ కొత్త వ్యూహం.. మమా అనిపిస్తున్నారు!!
posted on Feb 13, 2020 @ 1:50PM
ఉగాది రోజున పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ సర్కార్.. విశాఖపట్నంలో భారీగా భూసమీకరణ జరుపుతోంది. ప్రభుత్వం జరిపే ఈ ప్రయత్నాలకు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అయితే ఎక్కడైనా భూములను సమీకరించినా వాటిని పేదలకు పంపిణీ చేయాలంటే ముందుగా ఆ భూముల్లో లేఔట్ లు వేయాలి. భూమిని చదును చేసి రోడ్లు కాలువలు నిర్మించి విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఆ తర్వాత ఆయా స్థలాలను ఫ్లాట్టుగా విభజించి పంపిణీ చేయాలి. ఈ పనులను పూర్తి చేయటానికి సగటున ఎకరాకు 40 లక్షల రూపాయల అవుతుందని విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ఉన్నతాధికారులకు వెల్లడిస్తున్నారు. ఈ మధ్య పెరిగిన వ్యయాలు ఈ సేవలకు జీఎస్టీని కూడా కలుపుకుంటే ఎకరాకు 52 లక్షలు అవుతుందని లెక్కకట్టి తేల్చేశారు. సమీకరించ దలచిన 6,000 ల పైచిలుకు ఎకరాలలో ఈ విధంగా లేఔట్ లు వేయాలి అంటే సుమారు 3,000 ల కోట్లు అవసరమని లెక్కకట్టారు.
అయితే అంత మొత్తంలో తాము సమీకరించలేమని వీఎంఆర్డీఏ అధికారులు చేతులెత్తేశారు. దీంతో వారికి ఆ విషయంపై బోధపడేలా మార్గదర్శకాలిచ్చారు. ఇతర వ్యాపార లేఔట్ ఉన్న అంత వ్యయం పెట్టనక్కర్లేదని నామమాత్రపు లేఔట్ వేస్తే చాలని సూచించారు. దాంతో అధికారులూ కిందా మీదా పడి ఆ వ్యయాన్ని 52 లక్షల నుంచి ఏకంగా 2.5 లక్షల రూపాయలకు తగ్గించారు. అదేవిధంగా వీఎంఆర్డీఏ పై పడే భారం 150 కోట్లన్నమాట. ఎకరా స్థలంలో 2.5 లక్షల రూపాయలతో మౌలిక వసతులు ఎలా సమకూరుతాయని ప్రశ్నిస్తే భూమిని చదును చేసి ట్రెంచ్ లు కొట్టి మార్కింగ్ వేస్తే చాలని అంతకు మించి ఏమీ అవసరం లేదని కూడా అంటున్నారు. మరి రోడ్లు వేయిస్తామని.. కాలువల కోసం చిన్న గోతులు తవ్వుతామని కూడా చెప్తున్నారు. ఇతర లేఅవుట్ ఉన్న తారు రోడ్లు, విద్యుత్ సదుపాయం వంటివి ప్రస్తుతానికి ఉండవని పరోక్షంగా వెల్లడిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆ సంస్థలో అన్ని నిధులు ఉన్నాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.