మచిలీపట్నంలో మిస్టరీగా మారిన ఆరేళ్ళ బాలుడు మిస్సింగ్!!

ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ కేసులు ఈ మధ్య భారీగా నమోదౌతున్నాయి. తాజాగా మచిలీపట్నంలో ఒక బాలుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. తొమ్మిది రోజుల క్రితం ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలుడు నందు ఆచూకీ ఇంత వరకు లభించలేదు. ఆ బాలుడు కోసం తలిదండ్రులు ఊరంతా గాలించినా ఫలితం లేకుండా పోయింది. అదేవిధంగా మచిలీపట్నం మొత్తం జల్లెడ పట్టినా పోలీసులకి బాలుడి ఆచూకీ దొరకలేదు. నందుని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదంటే ఆడుకుంటూ నందు ఏదైనా ప్రమాదానికి గురయ్యాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

కాగా ఈ నెల 4 వ తేదీన పెదకరగ్రహారంలో ఆరేళ్ల బాలుడు నందు అపహరణకు గురైయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. కాలువలు, చెరువులు, బావులు, ముళ్ళపొదల్లోనూ వెతుకుతున్నారు. నందును కిడ్నాప్ చేశారనే అనుమానంతో పోలీసులు ఆ దిశగా ముమ్మర గాలింపు చేపట్టారు. అంతేకాకుండా బాలుడి తండ్రి ప్రియురాలిపై కూడా అనుమానం వ్యక్తమౌతుంది. అలాంటి అనుమానాన్నే వ్యక్తం చేస్తూ తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతిని కూడా విచారించారు. ఆమె నుంచి కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా తొమ్మిది రోజులైనా పిల్లాడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Teluguone gnews banner