తెలంగాణలో భూముల విలువ పెంపు.. గురువారం నుంచి కొత్త రేట్లు
posted on Jul 20, 2021 @ 6:54PM
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్ జీవో జారీ చేశారు. భూముల రేట్లు పెంచుతూ, కొత్త ధరలు ఈ నెల 22 నుంచే అమలులోకి వస్తాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 30 శాతం నుంచి 50 శాతం వరకు భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం పెంచింది. ఈ కొత్త రేట్లకు అనుగుణంగా ప్రభుత్వ వెబ్సైట్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసేందుకు సాయంత్రం 5 గంటలకు వెబ్సైట్ సర్వీస్ను రాష్ట్ర స్టాంప్స్, రిజిస్ట్రేషన్ నిలిపేసింది. భూముల రేట్లతో పాటు వాటి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని కూడా ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు భూముల విలువ పెంపు, సవరణ జరుగలేదు. రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా యథావిధిగా ఉన్నాయి. కానీ బహిరంగమార్కెట్లో భూముల విలువలు బాగా పెరిగాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం ఈసారి కొంతమేరకు భూముల విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుందని సీఎస్ తెలిపారు. భూముల మార్కెట్ విలువు పెంచుతున్నారన్న సమాచారంతో పాత ధరల్లో రిజిస్ట్రేషన్లకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో భూముల క్రయ విక్రయాల నిమిత్తం జనాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు.
ఇటీవల ప్రభుత్వం కోకాపేట సహా ఇతర ప్రాంతాల్లో భూములను వేలం వేసింది. ప్రభుత్వ భూములను తక్కువ రేట్లకే అమ్మి, ఆ వ్యవహారం ముగిశాక ఇప్పుడు భూముల రేట్ల పెంపు నిర్ణయం తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. సర్కారు భూములను తక్కువకు అమ్మి, అవి కొనుక్కొన్న కంపెనీలకు లాభం చేకూర్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసినట్టుగా కనిపిస్తోందని రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ఈ జీవో ఇస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేదని, కానీ ప్రజల సొమ్మును తన బినామీలకు దోచిపెట్టేందుకే వేలం ముగిసిన వారం తర్వాత ఉత్తర్వులు ఇచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
భూముల రేట్ల పెంపు ఇలా..
1. వ్యవసాయ భూములకు తక్కువ ధర ఉన్న దగ్గర ఎకరానికి రూ.75,000 పెంపు
2. వ్యవసాయ భూముల కోసం, ప్రస్తుతం ఉన్న విలువలు తక్కువ ధర ఉన్న దగ్గర 50%, మధ్యరకంగా ఉన్న దగ్గర 40%, అత్యధికంగా ఉన్న దగ్గర 30% పెంపు
3. ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పటి వరకు కనిష్ట విలువ చదరపు గజానికి రూ.100 ఉండగా.. చదరపు గజానికి రూ.200గా పెంపు
4. ఓపెన్ ప్లాట్లు తక్కువ ధర ఉన్న దగ్గర 50%, మధ్య రకంగా ఉన్న భూములకు 40%, అత్యధికంగా ఉన్న దగ్గర 30% సవరించారు
5. అపార్ట్మెంట్ కోసం ప్రస్తుతం ఉన్న అతి తక్కువ విలువ ఉన్న దగ్గర చదరపు అడుగుకు రూ.800 ఉండేది. ఇప్పుడది రూ.1000
6. అపార్ట్మెంట్లకు సంబంధించి తక్కువ విలువ ఉన్న దగ్గర 20 శాతం, ఎక్కువ విలువ ఉన్న దగ్గర 30 శాతం పెంపు
7. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు స్టాంప్ డ్యూటీ రేట్ల అమ్మకానికి 6% నుంచి 7.5 శాతానికి పెంపు