మాజీ మిస్ తెలంగాణ మళ్లీ ఆత్మహత్యాయత్నం..
posted on Oct 29, 2021 @ 9:29PM
హైదరాబాదులో బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించిన మాజీ మిస్ తెలంగాణ హాసిని రెండ్రోజుల వ్యవధిలో మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. మొన్న ఫ్యాన్ కు ఉరేసుకున్న యువతి, నేడు మున్నేరులో దూకింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర బ్రిడ్జి పైనుంచి మునేటిలోకి దూకి హాసిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కృష్ణా జిల్లా నందిగామలో బైక్ పైవచ్చి కాలువలోకి హాసిని దూకింది. ద్విచక్ర వాహనంపై వచ్చి బ్రిడ్జి పైన వాహనాన్ని నిలిపి నీటిలోకి దూకింది. హాసినిని బ్రిడ్జి పైనుంచి దూకడం గమనించి స్థానికులు రక్షించారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు.
21 ఏళ్ల కలక భవాని అలియాస్ హాసిని స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా బూదవాడ గ్రామం. మోడలింగ్ పై ఆసక్తితో హైదరాబాదులో ఉంటోంది. 2018లో హాసిని మిస్ తెలంగాణ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. రెండ్రోజుల కిందట హిమాయత్ నగర్ లోని తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది.తాను చనిపోతున్నానంటూ కుటుంబసభ్యులకు, ఫ్రెండ్స్ కు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జగిత్యాలకు చెందిన ఓ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించగా, వారు వెళ్లేసరికి చున్నీ ముడి జారిపోవడంతో ఫ్యాన్ నుంచి మంచంపై పడిపోయిన స్థితిలో హాసిని ఉంది. దాంతో ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు విషయం వివరించగా, వారు వచ్చి ఆమెను కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే నందిగామ సమీపంలోని కీసర వద్ద ఈ రోజు మున్నేరు బ్రిడ్జిపై నుంచి దూకేసింది. స్థానికులు సకాలంలో గుర్తించి కాపాడడంతో ఆమె ప్రాణాలకు ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ప్రస్తుతం నందిగామ ఆసుపత్రిలో హాసిని చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందులతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు హాసిని మొన్న పోలీసులకు వెల్లడించింది.