బీజేపీ కార్యాలయం గేట్లు బద్దలు.. తలకు గాయమైనా బండి సంజయ్ అరెస్ట్
posted on Jan 3, 2022 7:36AM
కరీంనగర్ లో రాత్రి తీవ్ర ఉద్రిక్తత తలెత్తంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత రాత్రి ఏడున్నర గంటల నుంచే దీక్ష కోసం ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం నుంచే బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయలు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకున్నారు. అయితే, ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అరెస్టులతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ బైక్పై కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వారి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లి దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో దీక్ష ప్రారంభం కాగా, కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పార్టీ నేతలు మూసివేశారు. దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో లైట్లు ఆఫ్ చేసిన పోలీసులు కిటీకీల గుండగా లోపల దీక్ష చేస్తున్న వారిపై ఫైర్ ఇంజిన్లతో నీళ్లు చల్లారు. ఆ తర్వాత తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ తలకు గాయమైంది. అరెస్ట్ చేసిన సంజయ్ను మానకొండూరు పోలీస్ స్టేషన్కు తరలించగా, అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగించారు.
దీక్ష భగ్నం చేయడంపై బండి సంజయ్ మాట్లడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం, అహంకారంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపైనా మండిపడిన ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఎంతోమంది గాయపడ్డారని, వారికేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు, ‘‘నువ్వు జైలుకెళ్లే సమయంలో నీ కుటుంబ సభ్యులు కూడా పోలీసుల తీరుతో ఇలాగే ఇబ్బంది పడతారు’’ అని కేసీఆర్ను హెచ్చరించారు. తన కార్యాలయంలోకి వచ్చి దౌర్జన్యం చేసిన పోలీసులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తానని హెచ్చరించారు.
బండి సంజయ్ అరెస్ట్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. బండి సంజయ్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తలపులు బద్దలుగొట్టి మరీ ఆయనను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు కూడా సంజయ్ అరెస్ట్ను ఖండించారు.