బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.. కేసీఆర్ పై సంచలనం..
posted on Dec 7, 2021 @ 1:09PM
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వలసల జోరు కొనసాగుతోంది. ఉద్యమ నేతలంతా ఒక్కొక్కరుగా బీజేపీ గూటికి చేరుతున్నారు. సోమవారం ఉద్యోగ సంఘం నేత విఠల్ కాషాయ కండువా కప్పుకోగా.. మంగళవారం జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. కొంత కాలంగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న.. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. తీన్మార్ మల్లన్నకు తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదు ఇచ్చి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీలో చేరిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్ అన్నారు. ఆయన భరతం పట్టడమే తన లక్ష్యమని చెప్పారు. ‘‘నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు.. 15 మీటర్ల తాడు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావును కట్టేస్తా. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా అంటూ కామెంట్ చేశారు మల్లన్న. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే..ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి.. తాడు తీసుకొచ్చేందుకే తాను ఢిల్లీకి వచ్చానని చెప్పారు. తనపై 38 కేసులు పెట్టారు. అయినా ఏం సాధించారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారని, ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్పై పోరాడతామని తీన్మార్ మల్లన్న తెలిపారు.
దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందే అన్నారు తరుణ్ చుగ్. కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నవీన్ కుమార్ కలం ఎత్తారని చెప్పారు. తెలంగాణా యువత తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురు చూస్తుంటారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓట్లు సాధించారని తెలిపారు. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు యాత్రలు చేస్తుంటే అధికార పార్టీ దాడులు చేస్తూ, కేసులు పెడుతోంది. ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని తరుణ్ చుగ్ మండిపడ్డారు.