ఒమిక్రాన్తో భారీగా మూడో ముప్పు!.. కేంద్రానికి ఐఎంఏ హెచ్చరింపు..
posted on Dec 7, 2021 @ 1:24PM
ఇండియన్ మెడికల్ అసోసియేషన్-ఐఎంఏ. కొవిడ్ గురించి, ఒమిక్రాన్ గురించి, థర్డ్ వేవ్ గురించి.. వారికంటే ఎక్కువ అవగాహన ఇంకెవరికీ ఉండకపోవచ్చు. అలాంటి ఐఎంఏ.. తాజాగా ఒమిక్రాన్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రానికి కీలక సూచనలు చేసింది. బూస్టర్ డోస్.. థర్డ్ వేవ్పై సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 23కి చేరిన సందర్భంగా ఐఎంఏ వ్యాఖ్యలు అప్రమత్తతను సూచిస్తోంది. ఇంతకీ ఐఎంఏ ఏం చెప్పిందంటే.....
‘దేశంలోని కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ వెలుగుచూడటం పెద్ద ఎదురుదెబ్బ. దీనిపై తగిన చర్యలు తీసుకోకపోతే.. భారీ స్థాయిలో మూడో వేవ్ను చవిచూడాల్సి రావొచ్చు’ అని హెచ్చరికలు చేసింది. ‘ఈ సమయంలో మనం వ్యాక్సినేషన్పై శ్రద్ధ వహిస్తే.. భారత్ ఒమిక్రాన్ ప్రభావాన్ని తప్పకుండా అధిగమించగలదు. అర్హులంతా టీకా తీసుకోవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలి. ఇప్పటివరకు టీకాలు చేరుకోనివారికి అవి అందేలా చూడాలి. రెండో డోసు తీసుకోవాల్సిన వారిపై శ్రద్ధ పెట్టాలి. ఈ క్లిష్ట సమయంలో వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్స్, బలహీన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు అదనపు డోసు ఇవ్వడంపై అధికారికంగా ప్రకటన చేయాలని కోరుతున్నాం’ అని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది.
ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో తీవ్రత తక్కువే ఉందని, డెల్టాతో పోలిస్తే మాత్రం 5 నుంచి 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు ఐఎంఏ తెలిపింది. ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా అంటువ్యాధిని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రయాణాలపై ఆంక్షలను తాము సమర్థించనప్పటికీ.. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేయాలని కోరింది.
ఆఫ్రికన్ దేశాల్లో అమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత.. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య సడెన్గా పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేసింది. పాఠశాలలు, కళాశాలల్లో కొవిడ్ ప్రొటోకాల్స్ను పాటించాలని తెలిపింది. 12 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు వేసే ప్రతిపాదనపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది ఐఎంఏ.