Read more!

తీన్మార్ మల్లన్న కేసులో మాజీ రౌడీ షీటర్? 

తెలంగాణలో సంచలనంగా మారిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కేసులో కీలక విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన బెదిరింపుల కేసులో ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్డు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. తర్వాత పోలీసులు కస్టడి పిటిషన్ వేయడంతో.. నాలుగు రోజుల కస్టడికి కోర్టు అనుమతిచ్చింది. కస్డడీలో భాగంగా మల్లన్నను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో మల్లన్న కేసులో హైదరాబాద్ కు చెందిన ఓ మాజీ రౌడీ షీటర్ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. 

తీన్మార్ మల్లన్న కేసులో మాజీ రౌడీషీటర్ అంబర్ పేట శంకర్ పేరును పోలీసులు విచారించారు.  ఆదివారం శంకర్ ను పిలిచిన పోలీసులు.. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.ఏప్రిల్ 19న తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న రూ.30లక్షలు డిమాండ్ చేశాడని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు. ఈ కేసులోనే ప్రస్తుతం మల్లన్నను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ డబ్బు చెల్లింపు విషయంలో తనకు-శర్మకు మధ్య సెటిల్ మెంట్ చేయడానికి అంబర్ పేట శంకర్ ప్రయత్నించాడని మల్లన్న పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం శంకర్ ను పిలిచిన పోలీసులు అతడిని విచారించారు. శర్మ కోరిన మీదట ఇరువురి మధ్య రాజీ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. అయితే తాను డీల్ సెటిల్ చేయలేకపోయానని అంబర్ పేట శంకర్ పోలీసులకు చెప్పారని తెలుస్తోంది.

లక్ష్మీకాంత శర్మ బాధితులు పేరుతో తీన్మార్ మల్లన్న యూట్యూబ్ చానెల్ లో కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. అందులో లక్ష్మీకాంత శర్మ బాధితులమని చెబుతూ కొంతమంది తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు ఫిర్యాదు చేశారు. మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని.. ఇవ్వకుంటే తప్పుడు వార్త కథనాలు ప్రసారం చేస్తానని బెదిరించినట్టు లక్ష్మీకాంత శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  దీంతో గత ఏప్రిల్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 27న అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పుడు రౌడీ షీటర్ పేరు తెరపైకి రావడంతో .. ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది