బాబు పాదయాత్రలకు ఉలిక్కిపడుతున్న వైకాపా?

తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు సాగిస్తున్న మీ కోసం వస్తున్నా పాదయాత్రలకు మంచిస్పందన లభిస్తోంది. బాబు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదరణ వస్తోందని తెలుగుదేశం శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ పాదయాత్రలకు ఉలిక్కిపడుతోంది. ప్రత్యేకించి ఈ పార్టీకి కీలకమైన రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి స్పందన రావటం వైకాపాకు అస్సలు మింగుడుపడటం లేదు. పైగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి  అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చెంచల్‌గూడా జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించటంతో మరో ఆర్నెళ్లు ఆయన కోసమే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఈలోపు క్యాడర్‌ను కట్టడి చేయటం కష్టమని వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే అత్యవసర సమావేశం కూడా అయ్యారు. ఈ సమావేశంలో తమ క్యాడర్‌ను ఎలా నిలబెట్టుకోవాలనే అంశంపై చర్చించారు. ఇటీవల వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి రాష్ట్రంలో తాను పర్యటించినప్పుడు త్వరలో జగన్‌ వచ్చి మిమ్మల్ని కలుస్తాడని చెప్పారు. ఎంత ఆలస్యమైనా సుప్రీంకోర్టు ద్వారా బెయిల్‌ సంపాదించేయగలమన్న ధీమాతోనే ఆమె ఆ మాట ఇచ్చారు. కానీ, పరిస్థితి తారుమారు అయింది. సుప్రీం కోర్టు బెయిల్‌ ఇవ్వటానికి నిరాకరించటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు జారుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరంతా 2014కు వైకాపా అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో పార్టీలో చేరినవారే. అలానే కొన్నాళ్లు కేసు నడిచినా జగన్‌ బయటికి వచ్చి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సొమ్ము బయటపెడతారని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నమ్మారు. అనుకోకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) ఈ కేసు దర్యాప్తుతో పాటు అక్రమం అని తేలిన ఆస్తులను సీజ్‌ చేయటం ప్రారంభించింది.

దానితో పాటు సుప్రీంకోర్టు కూడా సిబిఐను 2013మార్చిలోపు జగన్‌ కేసును పూర్తిస్థాయి విచారణ చేయమని ఆదేశించింది. ఈ ఆదేశం అందుకున్న సిబిఐ సిబ్బంది కొరతను ఢల్లీిలో తమ విభాగం సహాయంతో తీర్చుకుని సూట్‌కేసు కంపెనీలపై నిఘా పెట్టింది. దీంతో ఈ కంపెనీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సిబిఐకు లభ్యమవుతాయన్న నమ్మకం రాష్ట్రవ్యాప్తంగా పెరిగింది.  దీంతో అరదండాలు, సీజ్‌లు పూర్తయ్యాటప్పటికి వైకాపాకు ఉన్న ఆస్తి హారతి కర్పూరం అవుతుందని మేథావులు సైతం తేలుస్తున్నారు. అప్పుడు తిరిగి పాతస్థితికి వచ్చిన జగన్‌ ఏమీ చేయలేరని కూడా వైకాపాలో ఉన్న నేతలు, కార్యకర్తలూ కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి వెనక్కి వెళదామంటే కాంగ్రెస్‌ మొహం చూడటానికి కార్యకర్తలు ఇష్టపడటం లేదు. ఎందుకంటే జగన్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ మంత్రుల అవినీతి రచ్చ రచ్చ అవుతోంది. ఈ దశలో ఆశావహంగా తెలుగుదేశం పార్టీ ఒక్కటే వైకాపా కార్యకర్తలను ఆకట్టుకుంటోంది. పైగా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన పార్టీని పటిష్టం చేసుకునేందుకు పాదయాత్రలు చేయటం వల్ల గ్రామాల్లో కేడర్‌ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలానే ప్రభుత్వ వ్యతిరేకత బాబుకు బాగా ఉపయోగపడగలదని మీడియా కూడా విశ్లేషిస్తోంది.  ఈ నేపథ్యంలో మరో గత్యంతరం లేక తెలుగుదేశం పార్టీ వైపు వైకాపా కార్యకర్తలు దృష్టి సారిస్తున్నారు. ద్వితీయశ్రేణి నేతలు కూడా బాబుకు వస్తున్న స్పందనను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చివరికి తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రమే 2014 ఎన్నికల్లో పోటీ పడతాయన్న మాట నిజం కాబోతోందని రాజకీయపరిశీలకులు ప్రస్తుత పరిస్థితిని బట్టి స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వైకాపాగా ఆ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ సమయానికి నేతలు మాత్రమే మిగులుతారని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు బలంగా నమ్ముతున్నారు. మునిగిపోయే ఓడ నుంచి అధికారంలోకి వచ్చే అవకాశమున్న టిడిపికి వచ్చేయండని అన్ని జిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు ఆహ్వానం పలుకుతున్నారు. దీంతోతమ వంతు ఎప్పుడు వస్తే అప్పుడు పార్టీ మార్పును ప్రకటించేయవచ్చని ఎదురుచూస్తున్నారు. వైకాపా నేతలు మాత్రం వలసల నివారణకు గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. కార్యకర్తలకు నేతలు టచ్‌లో ఉండాలని వైకాపా ముఖ్యనేతలు వైవిసుబ్బారెడ్డి, మైసూరారెడ్డి తదితరులు కోరుతున్నారు. తక్షణం ఏదో ఒక కార్యక్రమం చేయకపోతే తమ భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందన్న పరిశీలకుల సూచనలకు తలగ్గిన ముఖ్యనేతలు మళ్లీ ఓదార్పు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు.  నిన్నటిదాకా జగన్‌ ఈ యాత్రలు చేస్తే ఇకపై విజయమ్మ దాన్ని కొనసాగించాలని, ఇడుపులపాయ నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రలకు ఆమెను సన్నద్ధం చేయాలని వైకాపా సమావేశంలో  సూచనలు వచ్చాయట. దీనిపై విజయమ్మ, జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”