సాయిరాజ్ అరెస్టుకు నిరసనగా బంద్ పాటిస్తున్న వ్యాపార సంస్థలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పిరియా సాయి రాజ్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సోంపేటలో ఆయన ఇంటి వద్ద ఆయనను అరెస్టు చేశారు. 2010 ఏప్రిల్ నెలలో జరిగిన థర్మల్ వ్యతిరేక ఆందోళనలో పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. ఆ సమయంలో అతను థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ వేసిన టెంట్‌ను ఎమ్మెల్యే కూల్చారు. దీనిపై పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు. ఆదివారం 12.08.12 న సాయిరాజ్ ను అరెస్టు చేసి బారువ పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి సాయిరాజ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయి రాజ్ అరెస్టుకు నిరసనగా స్వచ్చందంగా వ్యాపార సంస్థలు శ్రీకాకుళంలో బంద్ పాటిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.