సుబ్బిరామిరెడ్డి బిజినెస్ లాజిక్

 

నెల్లూరులో సీటు కచ్చితంగా పోతుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. తెలిసితెలిసీ అధిష్ఠానం పరువును నిలబెట్టడానికే అన్నట్టుగా తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి బరిలోకి దిగారు. అనధికారికి లెక్కలప్రకారం ఆయనకు ఎలక్షన్ పుణ్యమా అని రమారమీ.. ఓ వందకోట్లకి బొక్కపడ్డట్టు సమాచారం. దానివల్ల ఒరిగిందికూడా ఏమీ లేదు.


కనీసం తన త్యాగాన్ని దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం కేంద్రమంత్రిపదవినో లేక టిటిడి చైర్మన్ గిరీనో లేక కనీసం తన భార్యకైనా టిటిడి కుర్చీనో ఇస్తారని ఆశించిన సుబ్బిరామిరెడ్డికి ఆశలు అడియాసలే అయ్యాయి. డబ్బూపోయే శనీ పట్టె అన్న సామెత ఆయన విషయంలో రుజువయ్యిందని రాజకీయవర్గాలు బాహాటంగానే అనుకుంటున్నాయ్.


సుబ్బిరామి రెడ్డి మాత్రం పెదవి కదపడం లేదు. ఎందుకంటే రాజకీయపరమైన లబ్ధిని చేకూర్చలేకపోయిన అధిష్ఠానం వ్యాపారపరంగా మంచి లాభసాటి బేరాల్ని అప్పజెప్పాలన్న నిర్ణయానికి వచ్చిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అందుకే తిక్కవరపు తన అసంతృప్తిని ఎక్కడా వెళ్లగక్కలేదనేది రాజకీయ పండితుల మాటల సారాంశం.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.