వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12మంది మృతి! కొత్త సంవత్సరం రోజే తీవ్ర విషాదం
posted on Jan 1, 2022 8:27AM
కొత్త సంవత్సరం మొదలైన కొన్ని నిమిషాల్లోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ లోని ప్రఖ్యాత మాతా వైష్టోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె చెంతకే చేరారు. తొలుత ఏడుగురు చనిపోయినట్టు వార్తలు రాగా, ఆ తర్వాత 12 మంది చనిపోయినట్టు నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మృతులను ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను కాట్రా, కాక్రయల్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆలయాన్ని మూసివేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు.
కొత్త సంవత్సరం రోజున భక్తులు వైష్ణోదేవి ఆలయానికి వేలాదిగా తరలివస్తుంటారు. ఈసారి కూడా ఆలయానికి పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.భక్తుల రద్దీని తట్టుకునేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ప్రమాదానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మాతా వైష్టోదేవి ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధితులకయ్యే ఖర్చును భరిస్తామని ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రకటించింది.