కొత్త మంత్రులు.. అంతా హేమాహేమీలు.. మోదీ సెలక్షన్ అదుర్స్..!
posted on Jul 7, 2021 @ 12:23AM
78 మంత్రులతో కేంద్రంలో జంబో కేబినెట్ ఏర్పడింది. కొత్తగా 15 మంది కేబినెట్ మంత్రులు, 28 మంది సహాయ మంత్రులు మోదీ మంత్రిమండలిలో చేరారు. కేబినెట్ కూర్పునకు మోదీ గట్టి కసరత్తే చేసినట్టున్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, యువతరం, అనుభవం.. ఇలా అన్ని అంశాలకూ ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త కేబినెట్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు నలుగురు ఉన్నారు. 13 మంది లాయర్లు, ఆరుగురు డాక్టర్లు, ఐదుగురు ఇంజినీర్లు, ఏడుగురు మాజీ ప్రభుత్వ అధికారులు, ఏడుగురు రీసెర్చి డిగ్రీ, ముగ్గురు బిజినెస్ డిగ్రీలు చేసిన వారున్నారు. ఎస్సీలు 12 మంది, ఎస్టీలు 8 మంది, ఓబీసీలు 27 మంది మంత్రులుగా చేరారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల నుంచి ఎక్కువ మందికి కేబినెట్లో స్థానం కల్పిస్తూ.. రాజకీయ అంశాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు ప్రధాని మోదీ.
నారాయణ రాణే.. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎమ్మెల్సీగా పనిచేశారు. గతంలో ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో అధికారిగా ఉద్యోగం చేశారు.
సర్బానంద సోనోవాలా.. అసోం ముఖ్యమంత్రిగా ఫుల్ పాపులర్. అసోం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశారు. ఇంతకుముందు మోదీ కేబినెట్లో క్రీడల శాఖ (ఇండిపెండెంట్ ఛార్జ్) మంత్రిగా ఉన్నారు.
జ్యోతిరాదిత్య సింధియా.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5 సార్లు ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరారు. సింధియా రాజకుటుంబానికి చెందిన బలమైన నాయకుడు కావడం.. పార్టీలో చేరినందుకు ప్రతిఫలంగా మంత్రి పదవి దక్కింది. గతంలో ఆయన తండ్రి చేసిన.. విమానయాన శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు పీఎం మోదీ. గతంలో కేంద్ర విద్యుత్ శాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
జాన్ బార్లా.. బెంగాల్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. తేయాకు తోటలో కార్మికుడిగా పనిచేశారు.
శోభ కరంద్లాజే.. ఫస్ట్ టైమ్ ఎంపీ. శోభ కరంద్లాజే కర్ణాటకలోని ఉడుపి చిక్మగళూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
శంతనూ ఠాకూర్... బెంగాల్లోని బంగోన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. బీఏ ఇంగ్లీష్ చేశారు.
మంజుపారా మహేంద్ర భాయ్.. గుజరాత్లోని సురేంద్ర నగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్గా ప్రసిద్ధులు. సామాజిక కార్యకర్త.
డాక్టర్ మురుగన్... మద్రాస్ హైకోర్టులో లాయర్. 15 సంవత్సరాలుగా ప్రజా జీవనంలో ఉన్నారు. జాతీయ షెడ్యూల్ కాస్ట్ వైస్ చైర్మన్గా ఉన్నారు.
నితీశ్ ప్రామాణిక్... బెంగాల్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉన్నారు. మోదీ కేబినెట్లో యువకుడిగా గుర్తింపు పొందారు.
డా. వీరేంద్ర కుమార్.. పార్లమెంట్లోనే అత్యంత సీనియర్. 7 సార్లు ఎంపీ. మధ్యప్రదేశ్లోని టిక్మార్గ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మోదీ కేబినెట్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బాల కార్మిక వ్యవస్థపై పీహెచ్డీ చేశారు.
ఆర్సీపీ సింగ్.. మాజీ ఐఏఎస్. బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి 2 సార్లు ఎంపీ. సీఎం నితీశ్కు అత్యంత సన్నిహితుడు.
అశ్వనీ వైష్ణవ్.. ఒడిశా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్. మాజీ ఐఏఎస్. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో విశేష అనుభవం.
పశుపతి కుమార్ పారస్.. బిహార్లోని హజీపూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎమ్మెల్సీగా పనిచేశారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
భూపేందర్ సింగ్ యాదవ్.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకి అత్యంత సన్నిహితుడు. క్షేత్ర స్థాయిలో గట్టి పట్టున్న నేత. అనేక పార్లమెంటరీ కమిటీల్లో్ సభ్యునిగా ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉండేవారు.
పంకజ్ చౌదరి.. యూపీలోని మహారాజ్ గంజ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 6 సార్లు ఎంపీగా గెలిచారు. యూపీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. మిలటరీ సైన్స్లో పీహెచ్డీ చేయడం ఈయన ప్రత్యేకత.
మీనాక్షి లేఖి.. బీజేపీ నేత, ఢిల్లీ లోక్సభ సభ్యురాలు మీనాక్షి లేఖి న్యాయవాదిగా సుపరిచితురాలు. ఆమె వాగ్ధాటి అందరినీ ఆకట్టుకుంటుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఆమె వ్యవహరించారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా. జాతీయ మహిళా కమిషన్, బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన వివిధ సంస్థల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు.
అనుప్రియ సింగ్ పటేల్.. అప్నాదళ్ (ఎస్) నేత అనుప్రియ పటేల్ ఉత్తర ప్రదేశ్లోని మీర్జాపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆమె దివంగత డాక్టర్ సోనీలాల్ పటేల్ కుమార్తె. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఛత్రపతి సాహూజీ మహరాజ్ విశ్వవిద్యాలయాల్లో చదివారు.
కపిల్ మోరేశ్వర్ పాటిల్... మహారాష్ట్రలోని భీవండి నుంచి ఎంపీ. 2 సార్లు ఎంపీ. సర్పంచ్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభం.
సుభాశ్ సర్కార్... బెంగాల్లోని బంకూరా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. ప్రముఖ గైనకాలజిస్ట్. రామకృష్ణ మిషన్లో కార్యకర్తగా పనిచేశారు.
కిషన్ రావ్ కర్నాడ్... మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ మేయర్గా పనిచేశారు. ప్రముఖ వైద్యులు.
రాజ్కుమార్ రంజన్ సింగ్... మణిపూర్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం. జాగ్రఫీ ప్రొఫెసర్గా సుప్రసిద్ధులు. జాగ్రఫీలో పీహెచ్డీ చేశారు.
విశ్వేశ్వర్ తుడు... ఒడిశాలోని మయూర్బంజ్ నుంచి ప్రాతినిధ్యం. సీనియర్ ఇంజినీర్గా పనిచేశారు. జలవనరుల విషయంలో నిపుణులు.
దర్శన విక్రమ్ జర్దోశ్.. గుజరాత్లోని సూరత్ ఎంపీ దర్శన విక్రమ్ జర్దోశ్. ఆమె 2019 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలిగా కూడా ఆమె వ్యవహరించారు.
అన్నపూర్ణ దేవి... జార్ఖండ్లోని కొడెర్మా బీజేపీ ఎంపీ అన్నపూర్ణ దేవి 2019 నుంచి మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖ, పునరుద్ధరణీయ ఇంధనాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో కూడా ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఆమె 1998-2000 మధ్య కాలంలో బిహార్ శాసన సభ సభ్యురాలిగా సేవలందించారు.
ప్రతిమ భౌమిక్... త్రిపుర (తూర్పు) నియోజకవర్గం బీజేపీ ఎంపీ ప్రతిమ భౌమిక్. రాజకీయాల్లో ప్రవేశించడానికి పూర్వం ఆమె అగ్రికల్చరిస్ట్. ప్రస్తుతం ఆమె రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలు.
భారతి ప్రవీణ్ పవార్.. మహారాష్ట్రలోని డిండోరి (ఎస్టీ) నియోజకవర్గం బీజేపీ ఎంపీ భారతి ప్రవీణ్ పవార్. ఆమె నాసిక్లో ఎంబీబీఎస్ చేశారు. నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూవర్షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.
రాజీవ్ చంద్రశేఖర్... కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా బాధ్యతల్లో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో పట్టా తీసుకున్నారు.
భానుప్రతాప్ సింగ్ వర్మ... యూపీలోని జాలూన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
ఏ. నారాయణ స్వామి... కర్నాటకలోని చిత్రదుర్గ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కర్నాటకలో మంత్రిగా పనిచేశారు.
కౌశల్ కిశోర్... యూపీలోని మోహన్లాల్ గంజ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. 2 సార్లు ఎంపీ.
అజయ్ భట్.. ఉత్తరాఖండ్ నైనీటాల్ ఉదమ్సింగ్ నగర్ నుంచి ఎంపీ. 3 సార్లు ఎమ్మెల్యే. ప్రముఖ న్యాయవాది.
బి.ఎల్. వర్మ... యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 35 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు.
అజయ్ కుమార్... యూపీలోని ఖేరీ నుంచి ఎంపీగా బాధ్యతల్లో ఉన్నారు. 2 సార్లు ఎంపీ. ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.
చౌహాన్ దేవుసింగ్.. గుజరాత్లోని ఖేడా నుంచి ఎంపీగా గెలుపొందారు. 2 సార్లు ఎంపీ. 2 సార్లు ఎమ్మెల్యే. ఆలిండియా రేడియోలో ఇంజినీర్గా పనిచేశారు.
భగవంత్ ఖుబా... కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 సార్లు ఎంపీ. మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు.