ఏపీలో ప్రైవేట్ స్కూళ్లపై దాడులు... అధిక ఫీజులపై యాక్షన్...
posted on Feb 13, 2020 @ 1:10PM
తన ప్రాధాన్యతా రంగాల్లో విద్యాశాఖ ఒకటని మొదట్నుంచీ చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థ ప్రక్షాళన చేపట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతోపాటు నాడు-నేడు పేరుతో పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. డ్రాపౌట్లను తగ్గించేందుకు అమ్మఒడి పథకంతో ప్రతి పిల్లాడికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కూడా జగన్మోహన్ రెడ్డి నడుంబిగించారు. విద్య వ్యాపారంగా మారకూడదంటూ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం చట్టం తీసుకొచ్చారు. విద్యా హక్కు చట్టాన్ని నూరు శాతం అమలు చేయడమే కాకుండా, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేదలకు 25శాతం సీట్లు కేటాయించేలా చర్యలు చేపడతామని చెప్పారు. విద్య అనేది సేవే కానీ... డబ్బు ఆర్జించే వ్యాపార రంగం కాదన్న జగన్మోహన్ రెడ్డి.... ప్రైవేట్ పాఠశాలల్లో కనీస ప్రమాణాలు, ఉపాధ్యాయులు ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు.
అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు యాక్షన్ మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో తనిఖీలు పెట్టారు. పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రమాణాలు, ఫీజులను పరిశీలిస్తున్నారు. ఒకవేళ అధిక ఫీజులు వసూలు చేస్తున్నా... కనీస మౌలిక వసతులు లేకపోయినా చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 130 ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు జరగగా, మిగతా స్కూళ్లలోనూ ఈ సోదాలు కొనసాగనున్నాయి.