సిలెండర్‌ మండుతోంది...!

 

సంవత్సరానికి ఒక కుటుంబానికి ఆరు సిలెండర్లు మాత్రమే... అది కూడా సబ్సిడిపైనే... ఆరు దాటితే మార్కెట్‌ రేటు ప్రకారం 827 రూపాయలకు కొనుక్కోవాలని.. ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు దీనికి మరో 138 రూపాయలు చేర్చి 965 రూపాయలుగా చేసింది. అంటే ఇంచుమించుగా గృహ అవసరాలకు ఆరు సిలెండర్లకంటే ఒకటి ఎక్కువ అడిగినా సుమారుగా 1000 రూపాయలు చెల్లించుకోవాల్సిందే! ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. వాటికే కొనలేకపోతుంటే... ఇప్పుడు గ్యాస్‌ మంట...! సరుకులే కొనలేనప్పుడు... ఇక గ్యాస్‌ ఎందుకు ... దండగ... అనుకుని ప్రభుత్వం ఎంచక్కా పెంచేసింది! ఎంతైనా ప్రభుత్వం చాలా తెలివిగలది! కొంతకాలంపోతే 60ఏళ్ళు పైబడి బ్రతికిన వారిపై ఏడాదికి కొంత చొప్పున పన్ను వేస్తుంది. దీనిలో నుండి సంపన్నులను మినహాయిస్తుంది.ఎందుకంటే వారు పార్టీలకు నిధులు, ఇతరత్రా వనరులు సమకూర్చే వారు కనుక. కనీసం నగరం, గ్రామీణ ప్రాంతం అన్న బేధం లేకుండా గ్యాస్‌ సిలెండర్‌ కొనే వారికి ఆయా షాపుల్లో కట్టెలు, కట్టెల పొయ్యిలు కూడా అమ్మితే కొంచెం వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. దీని వల్ల కూడా ప్రభుత్వానికి లాభమే.. కనుక కనీసం ఆ దిశగా ఆలోచించి సామాన్యులకు వాటికోసం దూరాభారాలు వెళ్ళి తెచ్చుకునే శ్రమను తగ్గించమని కోరుకుంటున్నారు సామాన్యులు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.