ఆదిమూలపు సురేష్ దంపతులకు ఎదురుదెబ్బ
posted on Oct 8, 2021 @ 3:36PM
అనుకున్నదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో, తెలంగాణ హై కోర్టులో ఉపసమనం పొందిన ఆదిమూలపు దంపతులకు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి సురేష్ దంపతుల ఐఆర్ఎస్ అధికార హోదాలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణపై, నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణను కొనసాగించాలని సీబీఐకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన సతీమణి విజయలక్ష్మిపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ 2016లోనే కేసు నమోదు చేసింది.2017లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ ఆదిమూలపు సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేశారని వాదించారు. దీంతో తెలంగాణ తెలంగాణ హైకోర్టు కేసును కొట్టి వేసింది.
అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ పిటిషన్పై విచారణ జరిపింది. దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణ జరపలేదని, ఆధారాలు చూపకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని మంత్రి ఆదిమూలం సురేష్ దంపతుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్దవే వాదించారు. అయితే సీబీఐ మాత్రం అన్ని దర్యాప్తులు నిర్వహించామని.. సాక్ష్యాలు కూడా సేకరించామని తెలిపింది.
మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఆయన భార్య విజయలక్ష్మిపై అక్రమాస్తుల కేసులో 120 మందికి పైగా సాక్షులను విచారణ చేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో తెలిపింది 500 కు పైగా దస్తవేజులను పరిశీలించినట్లు వెల్లడించింది. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని .. రెండు, మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి అవుతుందని..విచారణ పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ నివేదిక అందజేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. సీబీఐ పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రెండు వారాల కిందట రెండు వారాల కిందట తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరించింది. కేసు విచారణను కొనసాగించాలని ఆదేసించింది.
ఆదిమూలం సురేష్ మాజీ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన భార్య ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నారని వారి ఇళ్లలో సోదాలు చేసిన సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా సురేష్ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులను సీబీఐ స్వాధీనం చేసుకుంది.