10 వేలు ఇవ్వని దొర.. 10 లక్షలు ఇస్తడా?
posted on Jul 30, 2021 @ 12:26PM
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం విమర్శల సుడిగుండంలో చిక్కుకుంటోంది. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఆ నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు. దీంతో దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త పథకం తెచ్చారని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దళిత బంధు స్కీం, సీఎం కేసీఆర్ ప్రకటనలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లు ఎదురుచూసినా రాష్ట్రంలోని పేదలకు రూ.10 వేల రుణం కూడా ఇవ్వని పాలకుడు.. ఇప్పుడు ఉప ఎన్నిక ఉండడంతో దళితులకు రూ.10 లక్షల సాయం ఇస్తామంటున్నారని మండిపడ్డారు.
'ఏళ్లకేళ్లు పడిగాపులు పడినా పట్టుమని పది వేలు రుణమివ్వని పాలకుడు... పది లక్షల రూపాయల సాయమంటూ కొత్త జిత్తుతో ఎత్తులు వేస్తున్నాడు. ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు... మళ్లీ మళ్లీ మోసపోతే మనదే తప్పు. తెలంగాణ సమాజమా ఆలోచన చెయ్' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 'పచ్చి నిజం... పచ్చి మోసం.. తన కాళ్లపై తాను నిలబడదామని, ఆత్మగౌరవంగా బతుకుదామని అప్పు కోసం చెప్పులరిగేలా తిరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు మొండి చెయ్యి చూపే దుర్మార్గం నేడు గద్దెనెక్కి రాజ్యమేలుతోంది. ఓట్ల వాసన రాగానే నోట్ల కట్టలతో స్వైరవిహారం చేస్తోంది' అని రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో విమర్శించారు.
ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తుంటారని, ఇలాంటి వారికి కార్పొరేషన్లు ఇచ్చే రాయితీ రుణాలు సువర్ణావకాశమని అందులో పేర్కొన్నారు. ఇలాంటి రాయితీ రుణ పథకాలను తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసిందని చెప్పారు. 2019-20 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల జారీని నిలిపేసిందని ఈనాడులో వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థలు అందించే రుణాలకు సైతం మోకాలడ్డిందని అందులో పేర్కొంది. దీంతో వేలాది మంది నిరుపేదలకు ఈ చర్య అశనిపాతంగా మారుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.