కేసీఆర్, మోడీ దొంగ నాటకాలు! తెలంగాణ ప్రజలు ఉరి పెడతారన్న రేవంత్..
posted on Nov 8, 2021 7:35AM
వరి ధాన్యం కొనుగోలు, పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ దుర్యోధనుడి ఏకపాత్రాభినయంలా ఉందన్నారు. బీజేపీ, టిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. ప్రజలను మోసం చేయడంలో ప్రజలను పక్కదారి పట్టించడంలో ఇద్దరు దొంగలే అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్, మోడీ ఇద్దరు కలిసి రైతులను మోసం, నష్టం చేస్తున్నారని రేవంత్ అన్నారు.
పంజాబ్ తో సహా దేశంలోని 24 రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్ తగ్గించినపుడు తెలంగాణ లో ఎందుకు తగ్గించరు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను దోచుకోవడంలో అవినీతి సొమ్ము దాచుకోవడంలో కేసీఆర్,మోడీ ఇద్దరు ఇద్దరే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి, గుండు కలిసి ప్రజలకు గుండు కొడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. వరి వేయమని కేంద్రానికి చెప్పి వరి వేస్తే ఉరి అని కేసీఆర్ తెలంగాణ రైతులకు మరణ శాసనం రాసాడు అంటూ రేవంత్ అన్నారు. కేసీఆర్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు ఉరి పెట్టె రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ అన్నారు.
రాయచూరు ప్రజలు తెలంగాణ మమ్మల్ని కలపాలని అంటున్నారు అని కేసీఆర్ అంటున్నారు.. కాని తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలుపుతారు అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు మొద్దు నిద్ర నటించిన కేసీఆర్ ఇప్పుడు మోడీ పై బీజేపీ పైన యుద్ధం అంటూ మరోసారి నటిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, మోడీ దొంగ నాటకాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెవుతారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.