పార్లమెంట్ కు వెళ్లకుండా కేసీఆర్ కుట్ర.. స్పీకర్ కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు
posted on Jul 19, 2021 @ 11:36AM
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం హౌజ్ అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది. తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై లోక్సభ స్పీకర్కు ఎంపీ రేవంత్రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా అడ్డుకుని తన హక్కులకు భంగం కలిగించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా కోకాపేట భూములకు ఇటీవల తెలంగాణ సర్కార్ నిర్వహించిన వేలం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. సీఎం కేసీఆర్ తన బినామీలకు ఖరీదైన భూములను చవక ధరకే కట్టబెట్టేందుకే వేలం నిర్వహించారని ఆరోపిస్తోంది కాంగ్రెస్.కోకాపేట భూముల విషయంలో జరిగిన అక్రమాలపై పార్లమెంట్ తొలి సమావేశంలో ప్రభుత్వ అక్రమాలపై ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ భూములు అమ్మకాలల్లో వెయ్యి కోట్లు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావ్, సీఎస్ సోమేశ్ కుమార్, సిద్దిపేట కలెక్టర్ లపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తొలి రోజు పార్లమెంట్ కు వెళ్లకుండా ఇంటిముందు పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లో కేసీఆర్ అవినీతిని భయటపెడతారనే భయంతోనే ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. దీనిపైనే లోక్ సభ స్పీకర్ కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భూముల వేలంలో జరిగిన అక్రమాలను లోక్ సభలో ప్రస్తావిస్తానని చెప్పడం వల్లే తనను అడ్డుకుంటున్నారని చెప్పారు. లోక్ సభ సభ్యుడిగా తనకున్న హక్కులను తెలంగాణ సర్కార్ హరిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి ఇంటి వద్ద ఈ తెల్లవారుజామున మూడు గంటల నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భారీగా రేవంత్ ఇంటి దగ్గరకు చేరుకున్న పోలీసులు.. ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి నుంచి ఎవరూ కదలకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.