సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ కు ఊరట

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో  భారీ ఊరట లభించింది.   కాళేశ్వరం ప్రాజెక్టులో  అవినీతి, అక్రమాలు, అవకతవకలపై  విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికలో  ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ పేరు కూడా ప్రస్తావించింది. దీనిపై స్మితా సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం (సెప్టెంబర్ 25)న సభా సభర్వాల్ పై నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యా తీసుకోవద్దంటూ ఆదేశాలుజారీ చేసింది.  ఇదేవిషయమై ఇప్పటికే  మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వంటి నాయకులకు కూడా హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. 


తెలంగాణ ఆవిర్భావం తరువాత అధికారం చేపట్టిన   కేసీఆర్    అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయి. రేవంత్ రెడ్డి   నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం అక్రమాలపై విచారణకోసం జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్   ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను రేవంత్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచి చర్చించింది.

ప్రాజెక్టులో రాజకీయ జోక్యం, ఆర్థిక అవినీతి, టెక్నికల్ లోపాలు, ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలు వంటి అనేక అంశాలని కమిషన్ నివేదికలో పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ  మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సభర్వాల్, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ సీ మురళీధర్ రావు వంటి అధికారులు ఈ అక్రమాలకు బాధ్యులని పేర్కొంది. బ్యారేజ్‌ల నిర్మాణాలకు సంబంధించిన కీలక ఫైళ్లను క్యాబినెట్ ముందు పెట్టకపోవడం, బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించడం వంటి  విషయాలలో స్మితా సభర్వాల్ ను కూడా కమిషన్ నివేదికలో తప్పుపట్టింది.  

ఈ నివేదికలో తన పేరు ప్రస్తావించబడటానికి వ్యతిరేకంగా స్మితా సభర్వాల్ ఈ నెల 23న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.   నివేదికలో తన పేరును తొలగించాలని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టకుండా  ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారించి,  ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దనీ,  ఇప్పటికే దాఖలైన పిటిషన్‌లతో కలిపి స్మితా సభర్వాల్ పిటిషన్ ను కూడా విచారి స్తామనీపేర్కొంది.  

ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి విందు...30 వేల మంది అతిథులు

  మధ్యప్రదేశ్ సాంచీ ఎమ్మెల్యే ప్రభు రామ్ చౌదరీ తన కొడుకు పెళ్లి విందు అత్యంత వైభవంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు పర్వ్ చౌధరీ వివాహం ఇటీవల జరిగింది. దానిని భోపాల్‌లో సింపుల్‌గా నిర్వహించారు. రిసెప్షన్‌ కోసం మాత్రం భారీగా ఏర్పాట్లు చేశారు. అందుకోసం రాయ్‌సెన్‌లో ఎనిమిది ఎకరాల్లో వేదిక వేశారు. వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 30 వేల మంది అతిథులు హాజరయ్యారు. 1000 మంది వంటవాళ్లు దేశీ, విదేశీ వంటకాలను సిద్ధం చేశారు.  రాజస్థాన్‌ నుంచి కళాకారులు.. సంప్రదాయ సంగీతాన్ని వినిపించారు. రాయ్‌సెన్‌లో ఈ స్థాయి వేడుక ఎన్నడూ జరగలేదని స్థానికులు వెల్లడించారు. అయితే ఈ వ్యయంతో ఒక చిన్నపాటి ప్రాజెక్ట్‌ నిర్మించివుండవచ్చని వారు అభిప్రాయపడ్డారు.  మరోవైపు సీఎం మోహన్ యాదవ్ చిన్న కుమారుడు డాక్టర్ అభిమన్యు పెళ్లి సాధారణంగా జరిగింది. ఉజ్జయినిలో పెళ్లి చేసుకున్నారు.  బాబా రామ్‌దేవ్‌ మంత్రాలు చదువుతుండగా.. పూల దండలు మార్చుకుని.. చాలా సింపుల్‌గా ఈ తతంగాన్ని ముగించారు. వీరితో పాటు మరో 21 జంటలు ఇదే ముహూర్తంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఎలాంటి కానుకలు, హంగూ, ఆర్భాటాలు లేకుండా ఈ తంతు ముగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎమ్మెల్యే పెళ్లి విందులో కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్‌ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం జగదీశ్‌ దేవ్డా, మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇతర సీనియర్ నేతలు వేడుకలో పాల్గొన్నారు

మాజీ ఎంపీ కనకమేడలకు కీలక పదవి

  సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్‌ను కేంద్రం నియమించింది. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌తో పాటుదవీందర్‌పాల్ సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినేట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనకమేడల  నియామకం న్యాయరంగంలో ఆయనకు ఉన్న అనుభవానికి, సామర్థ్యానికి గుర్తింపుగా రాజకీయ, న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ జీవితంతో పాటు న్యాయరంగంలోనూ చురుకైన పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు దేశస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం ప్రత్యేకంగా నిలుస్తోంది.  ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయ అంశాలపై రవీంద్ర కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్యాంగపరమైన కీలక వివాదాల్లో ప్రభుత్వ వాదనను ఆయన బలంగా వినిపిస్తారని కేంద్రం భావిస్తోంది. రవీంద్ర కుమార్‌కు ఈ పదవి వరించడంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనుభవజ్ఞుడైన న్యాయవాదికి ఈ పదవి రావడం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూరుస్తోందని తెలుగు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యూకేని వీడుతున్న భారతీయ డాక్టర్లు, నర్సులు ఎందుకంటే?

  దశాబ్దాల కాలంగా భారతీయ డాక్టర్లకు కలల గమ్యస్థానంగా ఉన్న బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్  ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతోంది. నైపుణ్యం కలిగిన భారతీయ వైద్యులు, నర్సులు ఇప్పుడు యూకేను వీడి స్వదేశానికి చేరుకుంటున్నారు. మరికొందరు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే వీరంతా యూకేను వీడడానికి భారీగా పెరిగిన పన్నులు, ఆకాశాన్ని అంటుతున్న జీవన వ్యయం, కఠినతరమైన వీసా నిబంధనలేనని తెలుస్తోంది.  దశాబ్దాలుగా భారతీయ వైద్యులు, నర్సులకు అత్యంత ఇష్టమైన విదేశీ గమ్యస్థానంగా ఉన్న బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవ .. ఇప్పుడు తన ఆకర్షణను కోల్పోతోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య వ్యవస్థగా పేరొందిన బ్రిటన్ నుంచి భారతీయ వైద్యులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో నిష్క్రమిస్తున్నారు. కేవలం వైద్య వృత్తిపై అసంతృప్తితోనే కాకుండా.. పెరిగిన ఆర్థిక భారం, కఠినమైన వలస నిబంధనలు, భవిష్యత్తుపై అనిశ్చితి వీరిని ఈ నిర్ణయం వైపు పురికొల్పుతున్నాయి.  బ్రిటన్ పార్లమెంటులో ఇటీవల సమర్పించిన గణాంకాల ప్రకారం.. భారతీయులకు జారీ చేసే 'హెల్త్ అండ్ కేర్ వర్కర్' వీసాల సంఖ్య భారీగా తగ్గింది. భారతీయ జాతీయులకు ఇచ్చే వీసాలు ఏకంగా 67 శాతం పడిపోగా.. నర్సులకు ఇచ్చే వీసాల్లో 79 శాతం క్షీణత నమోదైంది. దీనిని బట్టి భారతీయ వైద్య నిపుణులు యూకే కంటే ఇతర దేశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం అవుతోంది. భారతీయ వైద్యులు యూకేను వీడటానికి ప్రధాన కారణం ఆర్థిక ఒత్తిడిగా తెలుస్తోంది.  ఎన్‌హెచ్‌ఎస్‌లో పనిచేసే సీనియర్ కన్సల్టెంట్లు తమ ఆదాయంలో 45 శాతం ఆదాయపు పన్నుగా, మరో 2 శాతం నేషనల్ ఇన్సూరెన్స్‌గా చెల్లించాల్సి వస్తోంది. వీటికి తోడు పెన్షన్ పథకం కోసం మరో 12.5 శాతం వెచ్చించాలి. ఇక జూనియర్ డాక్టర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆకాశాన్ని అంటుతున్న గృహ అద్దెలు, జీవన వ్యయంతో పోలిస్తే వారు పొందుతున్న జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అజయ్ నారాయణ్ అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భారతీయ వైద్యులకు డిమాండ్ పెరగడంతో వారు ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్ దేశాలు మెరుగైన జీతాలతో పాటు తక్కువ పన్నులు, సులభతరమైన పౌరసత్వ నిబంధనలను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు బ్రిటన్ ప్రభుత్వం నికర వలసలను తగ్గించాలనే లక్ష్యంతో నిబంధనలను కఠినతరం చేస్తోంది. నైపుణ్యం కలిగిన విదేశీ వర్కర్లపై ఈ విధానాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.  ఒకప్పుడు వైద్యులకు కొరత ఉన్న ఎన్‌హెచ్‌ఎస్‌లో ఇప్పుడు పోటీ పెరిగింది. ఒక్కో పోస్టుకు వందలాది దరఖాస్తులు వస్తున్నాయి. విదేశీ వైద్యులకు తప్పనిసరి అయిన పి.ఎల్.ఎ.బి  పరీక్షల సంఖ్యను కూడా తగ్గించాలని నిబంధనలు మారుతున్నాయి. ఈ పరీక్షలు అత్యంత ఖరీదైనవి కావడంతో పాటు ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగ భరోసా లేకపోవడం టెక్కీలను నిరాశకు గురిచేస్తోంది.  1948లో ఎన్‌హెచ్‌ఎస్ స్థాపించబడినప్పటి నుంచి భారతీయ వైద్యులు ఆ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఎస్ సిబ్బందిలో 13 శాతం మంది ఆసియా సంతతికి చెందిన వారే ఉన్నారు. అయితే కొవిడ్ తర్వాత ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్టులు ఖర్చులను తగ్గిస్తున్నాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాల వల్ల భవిష్యత్తులో బ్రిటన్ వైద్య రంగంలో భారతీయుల భాగస్వామ్యం మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

హెచ్ -1బీ ఉద్యోగులకు గూగుల్ సంస్థ గుడ్ న్యూస్

  అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం వేచి చూస్తున్న వేలాది మంది విదేశీ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు గూగుల్ ముందస్తు 'న్యూ ఇయర్' గిఫ్ట్ ఇచ్చింది. 2023లో లేఆఫ్స్ కారణంగా నిలిపివేసిన గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్  ప్రక్రియను 2026 నుంచి మళ్లీ పట్టాలెక్కించనున్నట్లు కంపెనీ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ అవకాశం అందరికీ వర్తించదు. కేవలం ఆఫీసు నుంచి పనిచేసే వారికి, మెరుగైన పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఉన్నవారికే గూగుల్ ప్రాధాన్యత ఇవ్వనుంది.  ఆ క్రమంలో అమెరికాలోని టెక్ దిగ్గజం గూగుల్‌లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. గత రెండేళ్లుగా నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను 2026 నుంచి భారీ ఎత్తున తిరిగి ప్రారంభించనున్నట్లు కంపెనీ తన అంతర్గత వర్గాల ద్వారా స్పష్టం చేసింది. ఈ మేరకు డిసెంబర్ నెలలో ఉద్యోగులకు పంపిన న్యూస్ లెటర్‌లో కంపెనీ తన ప్రణాళికలను వివరించింది.  అమెరికాలో విదేశీ ఉద్యోగి శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్ కార్డ్ పొందాలంటే.. ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రీవ్యూ మేనేజ్‌మెంట్ అనేది అత్యంత కీలకమైనది. దీని ద్వారా కంపెనీలు సదరు ఉద్యోగి చేసే పనికి తగిన అమెరికన్ అభ్యర్థులు అందుబాటులో లేరని ప్రభుత్వం ముందు నిరూపించాల్సి ఉంటుంది. 2023 జనవరిలో గూగుల్ సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించిన సమయంలో.. నియమ నిబంధనల దృష్ట్యా ఈ ప్రక్రియను నిలిపివేసింది. అమేజాన్, మెటా వంటి సంస్థలు కూడా అదే దారిలో వెళ్లడంతో వేలాది మంది టెక్కీలు గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసుకోలేక అనిశ్చితిలో పడిపోయారు. అయితే 2026 మొదటి త్రైమాసికం నుంచి గూగుల్ నియమించుకున్న న్యాయ సంస్థలు అర్హులైన ఉద్యోగులను సంప్రదించడం ప్రారంభిస్తాయి. 2026 ఏడాది పొడవునా పీఈఆర్‌ఎమ్ దరఖాస్తులను పెంచుకుంటూ వెళ్లాలని గూగుల్ భావిస్తోంది. అయితే ఈ ప్రక్రియకు గూగుల్ కొన్ని కఠినమైన నిబంధనలను కూడా విధించింది. ముఖ్యంగా గూగుల్ ఉద్యోగులు అందరికీ ఈ స్పాన్సర్‌షిప్ లభించదు. పీఈఆర్‌ఎమ్ కావాలనుకునే వారు కచ్చితంగా గూగుల్ కార్యాలయం నుంచే పనిచేయాలి.  ప్రస్తుతం రిమోట్ లో ఉన్నవారు గ్రీన్ కార్డ్ ప్రక్రియ కోసం ఆఫీసు ఉన్న ప్రాంతానికి తరలి రావాల్సి ఉంటుంది. అలాగే సదరు ఉద్యోగి కచ్చితంగా ఒక ప్రత్యేక డిగ్రీ, పని అనుభవం ఉన్న ధృవీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా లెవల్-3, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి అవకాశం తక్కువని కూడా కంపెనీ పేర్కొంది. అలాగే వార్షిక సమీక్షలో 'మోడరేట్ ఇంపాక్ట్' లేదా అంతకంటే మెరుగైన రేటింగ్ పొందిన వారికి మాత్రమే స్పాన్సర్‌షిప్ లభిస్తుంది.  అలాగే కంపెనీలో మంచి పనితీరు కనబరిచే వారికే ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవలి కాలంలో వీసా ఫీజులు పెరగడం, ప్రాసెసింగ్ ఆలస్యం కావడం వంటి కారణాలతో అమెరికాలోని భారతీయ టెక్కీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గూగుల్ కూడా తన ఉద్యోగులను అనవసరంగా దేశం దాటి వెళ్లవద్దని.. వీసా స్టాంపింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. గూగుల్ గ్రీన్ కార్డ్ ప్రక్రియను మళ్లీ పట్టాలెక్కించడం వేలాది మంది భారతీయ కుటుంబాలకు పెద్ద ఉపశమనం కానుంది.  

సొంత బిడ్డ, అల్లుడి ఫోన్లను ట్యాప్ చేసిన నీచ సంస్కృతి వారిది : బండి సంజయ్

  ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తనతో పాటు పలువురు అగ్ర నేతల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు. ఆఖరికి కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచమైన చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్న ఎస్ఐబీ వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టుపట్టించారని ఆరోపించిన బండి సంజయ్, ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? లేక పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేలుస్తారా? అన్నది అనుమానంగానే ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారే తప్ప, గట్టి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుంచి ప్రారంభమైన టీవీ సీరియల్ ఎపిసోడ్‌లు కూడా పూర్తయ్యాయని, కానీ ఈ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  విచారణాధికారులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేసిన బండి సంజయ్, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బులు దండుకున్న వ్యవహారంపై కూడా నిగ్గు తేల్చాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

  తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి, నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారని తెలిపారు. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం మేరకు వైకుంఠ ఏకాదశిపై ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సామాన్య భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించామన్నారు. భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించామన్నారు. దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను ఈ-డిన్ ద్వారా ఎంపిక చేసి టోకెన్లు కేటాయించామని తెలిపారు. టోకెన్ పొందిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శనానికి రావాలి ఈ మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేది, సమయాన్ని కేటాయించడం జరిగిందని, ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే దర్శనభాగ్యం కలుగుతుందని అన్నారు.టోకెన్ పొందలేని భక్తులకు చివరి ఏడు రోజుల్లో సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఈ-డిప్ ద్వారా టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదటి మూడు రోజులు మాత్రమే ఈ-డిప్ విధానంలో టోకెన్లు కేటాయించామని, చివరి ఏడు రోజులు భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఢిల్లీ బంగ్లా హైకమిషన్ వద్ద వీహెచ్‌పీ నేతల నిరసన

  బంగ్లాదేశ్‌లో  హిందూవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల వీహెచ్‌పీతో పాటు పలు హిందూ సంఘాలు పాల్గొని నినాదాలు చేశాయి. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్‌పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణాలు,  దీపూ చంద్ర దాస్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ వీహెచ్‌పీ సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. చంద్ర దాస్‌ మర్డర్‌పై న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు.

అమరావతిని భారత క్వాంటమ్‌ వ్యాలీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

  విద్యార్థుల్లో నైపుణ్యం కల్పనకు  కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. వేలాది టెక్‌ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ‘క్వాంటమ్‌ టాక్‌’ నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు ప్రపంచం మొత్తం క్వాంటం టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఐటీని ప్రమోట్ చేయడంలో తాను విజయం సాధించానని సీఎం తెలిపారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలను రప్పించాలని చెప్పారు. క్వాంటమ్ టాక్‌లో ఆయన మాట్లాడారు. 1998లో మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు రప్పించామని తెలిపారు. అప్పటో గూగుల్ స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు గూగుల్‌ను తీసుకోచ్చామని తెలిపారు. విశాఖలో  చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. భవిష్యత్తులో నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి ఆ నగరం చిరునామాగా మారబోతోందని తెలిపారు.   25 ఏళ్ల క్రితమే ఐటీ విజన్‌తో  విప్లవం తెచ్చామని ఇప్పుడు ప్రపంచ ఐటీ నిపుణుల్లో ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులేనని కొనియాడారు. పురాతన విజ్ఞానం మన డీఎన్‌ఎలోనే ఉందని ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌‌కు షాక్... నోటీసులు ఇవ్వనున్న సిట్?

  తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయమైన సమాచారం. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వాలనే అంశంపై సిట్ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ వ్యవహారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో చేపట్టారన్న దానిపై సిట్ దృష్టి కేంద్రీకరించింది.  ముఖ్యంగా రాజకీయ నాయకులు, కీలక వ్యక్తుల ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారా? అన్న కోణంలో లోతైన విచారణ కొనసాగుతోంది. అలాగే, ఈ అక్రమ ఫోన్ టాపింగ్ చర్యలు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయన్న అంశంపై సిట్ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం... ఇప్పటికే సుప్రీంకోర్టు అనుమతితో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ను సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు లోకి తెస్తున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. విచారణ సమయంలో ప్రభాకర్ రావు పదే పదే మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావిస్తున్నారని తెలు స్తోంది. ఇప్పటికే సిట్ అధికారులు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని విచారణ చేసి అతని స్టేట్‌మెంట్‌ను  రికార్డ్ చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఉన్నతాధి కారులు, రాజకీయ నేతల పాత్రపై సిట్ దర్యాప్తు విస్తరించినట్లు తెలుస్తోంది.  అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటు న్నాయి. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఫోన్ టాపింగ్ కేసు మరింత ఉత్కంఠభరితంగా మారనుందని రాజకీయ, న్యాయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు అసెంబ్లీ సెషన్స్ తర్వాత హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ నోటీసులు ఇవ్వనుంది.

ఎడారి దేశంపై మంచు దుప్పటి.. సౌదీలో వింత వాతావరణం!

ఎడారిలో వర్షం పడటమే వింత అనుకుంటే..ఏకంగా మంచు వర్షమే కురిసింది. ఔను సౌదీ అరేబియాను మంచు దుప్పటి కప్పేసింది. మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా సౌదీ ఎడారిని మంచు దుప్పటి కప్పేసింది. పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఏడారిలో వర్షాలు, మంచు కురవడం వాతావరణ మార్పులకు నిదర్శనంగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. నిత్యం భగభుగలాడే వేడిమితో ఉండే ఎడారి దేశం సౌదీ ఇప్పుడు చలికి గజగజలాడుతోంది.  ఉత్తర, మధ్య ప్రాంతాల్లోకి చల్లని గాలులు ప్రవేశించడం వల్ల ఈ మార్పులు సంభవించాయని  వాతావరణ కేంద్రం   తెలిపింది. రానున్నరోజులలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.