వల్లభనేని వంశీపై కుట్ర చేసిన అజ్ఞాత శత్రువు దేవినేని ఉమానేనా?
posted on Oct 28, 2019 @ 1:45PM
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి గుడ్ బై చెప్తారు అనుకుంటే.. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ని కలిసిన వంశీ.. మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు అంశంపై దీపావళి తరువాత స్పష్టత ఇస్తానన్నారు. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరతారని భావించారంతా. కానీ అనూహ్యంగా రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నట్టుగా వంశీ ప్రకటించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకి వంశీ తన రాజీనామా లేఖను పంపారు. రాజకీయ కుట్రలు, దాడుల నుంచి తన అనుచరులని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని వంశీ తెలిపారు. అయితే వంశీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కేవలం అధికార పార్టీ నేత రాజకీయ వేధింపులే కాదు.. సొంత పార్టీ నేత కుట్రలు కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజీనామా ప్రకటన అనంతరం వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యక్ష శత్రువుతోనైనా పోరాడొచ్చు కానీ అజ్ఞాత శత్రువుతో పోరాడలేమన్నారు. దీంతో ఇప్పుడు ఆ అజ్ఞాత శత్రువు ఎవరా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ కార్యకర్తలైతే ఆ అజ్ఞాత శత్రువు మాజీ మంత్రి దేవినేని ఉమా అని భావిస్తున్నారు.
కృష్ణ జిల్లాలో పార్టీ పరంగా చంద్రబాబు.. దేవినేని ఉమాకి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదే చంద్రబాబు చేస్తున్న పెద్ద తప్పని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అసలు దేవినేని తీరు వల్లే జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని కార్యకర్తలు మండిపడుతున్నారు. కొడాలి నాని వంటి వారు పార్టీని వీడటానికి కూడా ఉమానే కారణమని అంటున్నారు. అంతెందుకు ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా ఉమా తీరే కారణమని వార్తలొచ్చాయి.
కృష్ణా టీడీపీ అంటే ఉమా, ఉమా అంటే కృష్ణా టీడీపీ.. అన్నట్టుగా ఉమా ఫీలవుతారని.. జిల్లాలో తాను చెప్పిందే జరగాలని చూస్తారని అంటున్నారు. జిల్లా టీడీపీ నేతలంతా ఆయన చెప్పినట్టే వినాలని, వినకపోతే వారిని ఎదగనివ్వకుండా కుట్రలు చేస్తారని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వంశీ విషయంలో కూడా ఆ అజ్ఞాత శత్రువు ఉమానే అయ్యుంటారని అంటున్నారు. ఉమా తీరు వల్ల జిల్లా టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అధిష్టానం కూడా ఉమా మాటకే ప్రాధాన్యత ఇస్తూ మిగతా వారిని పట్టించుకోకపోవడంతో.. ఏం చేయాలో తెలియక వారు పార్టీని వీడుతున్నారని అంటున్నారు. ఉమా ఇప్పటికైనా తన తీరు మార్చుకొని, అందర్నీ కలుపుకొని పోతూ జిల్లాలో పార్టీకి భవిష్యత్తు ఉండేలా చూడాలని హితవు పలుకుతున్నారు. ఒకవేళ ఉమా తన తీరు మార్చుకోకపోతే.. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా కళ్లుతెరిచి.. ఉమా చెప్పినదానికల్లా తల ఊపకుండా, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకొని.. ఉమాని, పార్టీని గాడిలో పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.