నార్సింగిలో ఘనంగా జరిగిన యాదవుల సదర్ ఉత్సవాలు...
posted on Oct 28, 2019 @ 2:05PM
జంట నగరాల్లో నివసించే యాదవులు సంస్కృతి వేడుకగా నిర్వహించే సదర్ ఉత్సవాలు హైదరాబాద్ నార్సింగ్ లో ఘనంగా జరిగాయి. నార్సింగ్ మాజీ సర్పంచ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ వేడుకల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. యాదవులతో స్థానికులు భారీ దున్నపోతులను సుందరంగా అలంకరించి ఈ సదర్ ఉత్సవాలకు తీసుకొచ్చారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఈ సదర్ వేడుకల్లో పాల్గొని ఆనందించారు. దున్నపోతుల్ని గ్రామంలో తిప్పుతూ వాటితో విన్యాసాలు చేయించారు. వెంకటేశ్ యాదవ్ తండ్రి హయాం నుంచి నార్సింగి లో సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
అతిపెద్ద పశువుల సంత కూడా ఇక్కడే ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని భారీ దున్నపోతులని ఇక్కడికి తీసుకొస్తారు. దీంతో ఏటా దీపావళి తర్వాత సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్న యాదవ సోదరులు ఈసారి ఉత్సవాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దున్నపోతుల తిండి దగ్గర నుంచి వాటికిచ్చే శిక్షణ వరకు అవి చేసే సాహసాలు ఉత్సవాల్లో ప్రదర్శనకు తీసుకొస్తారు. ఈసారి నార్సింగి లో పంజాబ్ కు చెందిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ దున్నపోతుతో యాదవ సోదరులు విన్యాసాలు చేస్తుంటే మరోవైపు వాటిపై ఎక్కిన చిన్నారులు డీజే మ్యూజిక్ కు స్టెప్పులేశారు.
దీపావళి సందర్భంగా యాదవులు నగరం లోని పలుచోట్ల సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రం లోని ట్రైనింగ్ ఇచ్చిన దున్నపోతులతో పాటు పక్క రాష్ట్రాల నుంచి తెస్తున్న భారీ దున్నలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాచిగూడ చెప్పల్ బజార్ లో బీజేవైఎం నాయకుడు సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనం ఆకట్టుకుంది. తమ వృత్తిలో భాగమైన దున్నపోతులతో సాహస కార్యక్రమాలు చేపట్టారు. ఈ సదర్ వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
సదర్ ఉత్సవాల్లో దున్నపోతులని అందంగా అలంకరించిన యజమానులకు బహుమతులను అందజేశారు. రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఎల్బీనగర్ నియోజకవర్గమైన కొత్తపేటలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి, యాదవుల ఐక్యతకు నిదర్శనంగా చెప్పుకునే ఈ వేడుకల్ని యాదవ సంఘం నాయకులు పండగలా జరుపుకున్నారు. ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్న సదరులో సర్తాజ్ అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది, హర్యానాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్ర సింగ్ కు చెందిన సర్తాజ్ ప్రపంచంలోనే ఎంతో డిమాండ్ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. ఇరవై ఏడు కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్ వేడుకల్లో ప్రదర్శించేందుకు అఖిల భారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది.