విజయసాయిరెడ్డిపై వంద కోట్ల పరువు నష్టం దావా!!
posted on Oct 11, 2019 @ 5:29PM
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై అసత్య ఆరోపణలు చేసినందుకు వైసిపి నేత విజయసాయిరెడ్డిపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించామని రవిప్రకాష్ మేనేజర్ తెలిపారు. ఎబిసిఎల్ సంస్థ లోకి రామేశ్వరరావు, మేఘా క్రిష్ణారెడ్డి చట్ట వ్యతిరేఖంగా ప్రవేశించారని వారిద్దరే రవిప్రకాష్ పై ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. నెల క్రితం ఇవే ఆరోపణలను రామేశ్వరరావు, మేఘా క్రిష్ణారెడ్డి అనుచరుడైన రామారావు లిఖిత పూర్వకంగా వివిధ శాఖలకు పంపించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ఆరోపణలు కేవలం గాలి కబుర్లే నని అధికారులు నిర్ధారించారని వివరించారు. అప్పట్లో రామారావు పంపిన లేఖ ప్రతినే ఎంపీ విజయసాయిరెడ్డి తన లెటర్ హెడ్ పై ఇప్పుడు పంపించారని పేర్కొన్నారు.
నిరాధారమైన ఆరోపణలను అత్యుత్సాహంతో ప్రసారం చేసిన చానళ్లపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు రవిప్రకాష్ మేనేజర్ ఆ ప్రకటనలో వివరించారు. మీడియాను అడ్డం పెట్టుకుని రవిప్రకాష్ అక్రమంగా భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారని నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ వీటిపై ఈడీ, సిబిఐ విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గొగోయ్ కు విజయసాయిరెడ్డి తాజాగా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఫెమా ఆర్.బీ.ఐ రెగ్యులేషన్స్ మనీ లాండరింగ్ తోపాటు ఆదాయ పన్ను ఎగ్గొట్టడం ద్వారా అక్రమాస్తులు కూడబెట్టారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. మోయిన్ ఖురేషి, సానా సతీష్ తో కలిసి చాలామందిని మోసం చేశారని సానా సతీష్, మొయిన్ ఖురేషి, రవిప్రకాష్ కలిసి నకిలీ డాక్యుమెంట్ లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి తన లేఖలో ఆరోపించారు.
హవాలా సొమ్మును కెన్యా, యుగాండాలో సిటీ కేబుల్లో రవిప్రకాష్ పెట్టుబడులు పెట్టారని రవిప్రకాష్ అవినీతి వ్యాపారాల జాబితా పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను చీఫ్ జస్టిస్ కు విజయసాయి లేఖలో తెలిపారు. అలంద మీడియా కేసులో అరెస్టయిన టీవీ నైన్ మాజీ సీఈవో రవిప్రకాశ్ పై వై.యస్.ఆర్.సి.పి ఎంపి విజయసాయిరెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ తో విచారణ జరిపించాలని ఆయన చేసిన స్కామ్ లపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ సిజెకి విజయసాయి లేఖ రాశారు. రవిప్రకాష్ పై ఈడీ, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ విజయసాయి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యింది.
గతంలో జగన్ ను రవిప్రకాష్ టార్గెట్ చేయడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. టిడిపికి అనుకూలంగా వై.యస్.ఆర్.సీ.పీ కి వ్యతిరేకంగా రవిప్రకాష్ పని చేశారని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. టీవీ 9 కొత్త యాజమాన్యం అధీనం లోకి వెళ్లాక కూడా సి.ఇ.ఒ పదవి నుంచి వైదొలగడానికి రవిప్రకాష్ అంగీకరించలేదని, తన మాటను చెల్లుబాటు చేసుకోవటానికే ప్రయత్నించారని వార్తలొచ్చాయి. ఇప్పుడు రవిప్రకాష్ చేతుల్లో ఏ మీడియా లేక పోయినప్పటికీ త్వరలోనే ఓ మీడియా ఛానల్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ఆ ప్రయత్నాలు మొగ్గ లోనే తుంచివేయడం కోసమే ఆయనపై విజయసాయిరెడ్డి సీజేకి లేఖ రాశారని తెలుస్తోంది. ఏబీసీఎల్ సంస్థలో చట్ట వ్యతిరేకంగా ప్రవేశించిన రామేశ్వరరావు మేఘా క్రిష్ణారెడ్డి ద్వయం ఈ నీచమైన ఆరోపణలు చేస్తోందని రవిప్రకాష్ కార్యాలయం ఆరోపించింది. నెల క్రితం ఇవే అసత్య ఆరోపణలు రామేశ్వరరావు, మేఘా క్రిష్ణారెడ్డి అనుచరుడైన రామారావు అనే వ్యక్తితో లిఖిత పూర్వకంగా వివిధ శాఖలకు పంపించారని ఇప్పుడు అవే ఆరోపణలు పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి చేస్తున్నారనీ రవిప్రకాష్ మీడియా కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కట్టుకథలు వెనుక ఈ పెద్దలే ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంది.