ఈ.ఎస్.ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్
posted on Oct 11, 2019 @ 5:56PM
కార్మిక బీమా వైద్య సేవల సంస్థ ఈ.ఎస్.ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మొత్తం రెండు వందల కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు అంచనా వేస్తున్న ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకూ పదమూడు మంది నిందితులను అరెస్టు చేసిన అధికారులు తరువాత ఏడుగురు నిందితులను రెండ్రోజుల పాటు తమ కస్టడీ లోకి తీసుకోనున్నారు. ఈ.ఎస్.ఐ ఐ.ఎం.ఎస్ విభాగంలో మందుల కుంభకోణం కేసులో ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది.
ఈ కేసులో పదమూడు మందిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు దేవికారాణి, పద్మ, రాధికతో పాటు మరో నలుగురిని బుధవారం నుంచి రెండు రోజుల పాటు కోర్టు అనుమతితో ఏసీబీ కస్టడీ లోకి తీసుకోనుంది. ప్రస్తుతం వీరంతా చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. దేవికారాణితో పాటు మిగతా ఆరుగురిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించటం వల్ల కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించారని అధికారులు భావిస్తున్నారు. కోట్ల రూపాయల అక్రమాల్లో ఎవరెవరి వాటా ఎంత, ఫార్మా సంస్థల ప్రతినిధులతో ఏ విధంగా కుమ్మక్కయ్యారు అనే అంశాలు తేల్చే పనిలో ఏసీబీ అధికారులున్నారు.
దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు భావిస్తున్న విచారణ బృందం ఇందుకు ఎవరెవరు సహకరించారనే ఆధారాలు సేకరిస్తున్నారు. అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేయడం, నిర్ణయించిన ధర కంటే ఎక్కువ చెల్లించటం డిస్పెన్సరీ లకు చేరాల్సిన రోగ నిర్ధారణ పరీక్షల కిట్ లను ప్రైవేటు వ్యక్తులకు చేరవేసి బహిరంగ మార్కెట్ లో విక్రయించడం వంటి మోసాలకు ఈ.ఎస్.ఐ ఆధికారులు ఫార్మా సంస్థలతో కలిసి పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు.
ఆయా అంశాలపై నిందితులను పూర్తి స్థాయిలో విచారించేందుకు రంగం సిద్ధమైంది. నిందితుల కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టిన తర్వాత మరి కొంత మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి ఫార్మసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ ఆఫీస్ ఉద్యోగి పాషాను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.