'రైతు భరోసా' పథకం లబ్ధిదారుల జాబితాలో ఏపీ మంత్రి పేరు!!
posted on Oct 11, 2019 @ 4:58PM
వైయస్ఆర్ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు కూడా ఉండటం కలకలం రేపింది.ఒక్కసారిగా అధికారులు కూడా హుటాహుటిన ఆయన పేరును తొలగించేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల్లో ప్రారంభించనున్న వైయస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను రాష్ట్రమంతా విడుదల చేశారు. ఈ జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు కూడా చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలం, గణపవరం మండలంలో విడుదల చేసిన జాబితాలో మంత్రి పేరుంది. విషయం తెలుసుకున్న మంత్రి ఈ పొరపాటు ఎలా జరిగిందో విచారణ జరిపించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. జాబితాలో పొరపాటు జరిగిందన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పథకాల లబ్ధిదారుల జాబితాను విడుదల చేసే ముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని సూచించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఆదిమూలపు సురేష్ పేరు ఆయన కోడ్,డీటైల్స్ ఆయన తండ్రి పేరు అన్నీ చాలా స్పష్టంగా వైయస్ఆర్ రైతు భరోసా గ్రామ అర్హుల జాబితాలో ఉంది. క్రమ సంఖ్య 223 అలాగే పట్టాదారుల ఖాతా 1881 చాలా స్పష్టంగా ఉంది. ఆయన కూడా దీనిని అంగీకరించారు.ఈ వివరాలన్ని తనవేనని, కానీ ఇందులోకి ఎలా వచ్చాయో అన్న విషయం పై విచారణ జరిపిస్తున్నట్లు తెలియజేశారు.ఈ పధకం కింద లబ్దిపొందాలంటే దాదాపుగా ఐదెకరాలకు మించి పొలం ఉండకూడదు అలాగే ఆదాయపు పన్ను కడుతున్నా కూడా దీనికి అర్హులు కారు. అయితే మంత్రి సురేష్ పేరు ఇక్కడ రావడంతో ఆయన ఇంతకు ముందు గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా ఈ రైతు భరోసా పథకం కింద ఏమన్నా లబ్ధిదారిగా ఉన్నారా లేకపోతే కొత్తగా ఈయన పేరు నమోదు చేశారా అనే విషయం కూడా విచారణకు స్వీకరించారు. ప్రస్తుతం ఐతే పేరును తోలగించడమే కాక విచారణ జరుపుతున్నట్లు తెలియజేస్తున్నారు అధికారులు.