రేషన్ బియ్యం వాహనాలు పరమవేస్టు!
posted on Aug 3, 2024 @ 6:00PM
ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాల వల్ల ఎలాంటి లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సివిల్ సప్లైస్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలో రేషన్ బియ్యం పంపిణీ వాహనాలు- ఎండీయీలపై కీలక చర్చ జరిగింది. ఎండీయూ వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎండీయు (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్)లను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. ఎండీయు వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండడంతో సమస్యను ఎలా పరిష్కరించాలన్న దానిపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని మంత్రి అన్నారు. వీధి చివర వాహనం పెట్టి మాత్రమే బియ్యం పంపిణీ చేశారని, రేషన్ డోర్ డెలివరీ పేరుతో 1,844 కోట్ల రూపాయలతో తో 9260 వాహనాలు గత ప్రభుత్వం కొనుగోలు చేసిందని అధికారులు వెల్లడించారు.
రేషన్ బియ్యం తరలింపు వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్కు వాడుకున్నారన్న అంశాన్ని సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావన తీసుకొచ్చారు. రేషన్ డీలర్లను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులకు నిర్ణయం తీసుకున్నారు. పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా అందుబాటులో నిత్యావసర వస్తువులు ఉంచాలని మంత్రులతో పాటు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 2019 ముందు వరకు సివిల్ సప్లైస్ శాఖ అప్పులు 21,622 కోట్ల రూపాయలు కాగా.. ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను 41550 కోట్ల రూపాయలకు తీసుకు వెళ్లిందని ముఖ్యమంత్రి అన్నారు. రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.