జగన్ కౌంటర్కు రఘురామ కౌంటర్.. అంతా వెంకన్న స్వామి చూసుకుంటారు..
posted on Jun 1, 2021 @ 7:41PM
జగన్ కౌంటర్కు కౌంటర్ వేశారు. రఘురామ మళ్లీ తన వాయిస్ వినిపించారు. అరెస్ట్, బెయిల్, చికిత్సతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన తాజాగా జగన్ కేసుపై స్పందించారు. సీఎం జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్ వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని చెప్పారు. కోర్టులో జగన్ కౌంటర్ పేలవంగా ఉందని.. ఆయన తరపు న్యాయవాది చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. జగన్ వేసిన కౌంటర్ లో ఎలాంటి విషయం లేదని తెలిపారు. ఈ కేసులో కచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం కోసం, తన బెయిల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు. పైనున్న వేంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు.
అక్రమాస్తుల కేసులో అరెస్టై.. బెయిల్పై బయట ఉన్న సీఎం జగన్.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. వెంటనే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు గతంలో జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించగా.. తాజాగా కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
రఘురామరాజు తన పిటిషన్లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు ఉండటంతో జగన్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.
రఘరామ పిటిషన్పై జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో తెలిపారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని అన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని.. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివరించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్పష్టం చేశారు. రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్కు లేఖ కూడా రాసినట్లు వెల్లడించారు. రఘురామ పిటిషన్కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రఘురామరాజుపై ఏపీలో అనేక కేసులున్నాయని.. కౌంటర్లో తెలిపారు.
అయితే, జగన్ బెయిల్ రద్దు చేయవద్దని సీబీఐ ఎక్కడా కోరకపోవడం ఆసక్తికరం. రఘురామ పిటిషన్పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే కోర్టును కోరింది సీబీఐ. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని విన్నవించింది. తదుపరి విచారణ ఈనెల 14కి వాయిదా పడింది.
జగన్ బెయిల్ కేసులో సీబీఐ వేసిన కౌంటర్ పై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ బెయిలు రద్దుకు ఎస్ లేదా నో అని చెప్పకుండా బంతిని కోర్టు పరిధిలోకి నెట్టింది సీబీఐ. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోం.. మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. దీంతో జగన్ బెయిల్ కేసులో ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. ఎంపీ రఘురామ సైతం జగన్ తరఫున వేసిన కౌంటర్ పేలవంగా ఉందంటూ వ్యాఖ్యానించడం.. ఆయనలోని ధీమాకు నిదర్శనం.