ఉద్యోగులకు జీతాలు ఇవ్వు జగన్ సామీ..!
posted on Oct 8, 2021 @ 5:28PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికరంగం తీవ్రంగా కుదేలైంది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితికి పడిపోయింది. సకాలంతో డబ్బులు రాకపోవడంతో వేతనజీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల కష్టాలపై తీవ్రంగా స్పందించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో అందించడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు, ఒకటో తారీఖున జీతాలు వస్తాయనే మాటను ప్రభుత్వ ఉద్యోగులు మరచిపోయేలా చేశారని విమర్శించారు. జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని, ఈ అనిశ్చితి ఏపీ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ లేమిని సూచిస్తోందని పవన్ అన్నారు. ముఖ్యంగా, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందకపోవడం బాధాకరమని అన్నారు.
దశాబ్దాల పాటు ఉద్యోగ సేవలు అందించి విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటారని జనసేనాని తెలిపారు. వృద్ధాప్యంలో వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని, ఆ ఖర్చులకు పెన్షన్ డబ్బులే ఆధారమని చెప్పారు. వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే వారు ఎంతో మానసిక వేదనకు గురవుతారని అభిప్రాయపడ్డారు. తన తండ్రి కూడా ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైరయ్యారని, ఆయన ఎంత ఆత్మాభిమానంతో ఉండేవారో తాను చూశానని పవన్ తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ జీతం మీద, పెన్షన్ మీద ఎంతో ఆత్మాభిమానంతో జీవిస్తారని వివరించారు. నిర్దేశిత సమయానికి ఆ డబ్బు చేతికి అందకపోతే ఎంతకాలం వారు చేబదుళ్లతో నెట్టుకురావాలి? అని ప్రశ్నించారు.
నిరంతరం ఉద్యోగ విధుల్లో ఉండే పోలీసులకు గడచిన 11 నెలలుగా టి.ఏ కూడా లభించడంలేదని పవన్ వెల్లడించారు. పోలీసుల ఇబ్బందులు తన దృష్టికి వచ్చినందునే అనంతపురం జిల్లా కొత్తచెరువు సభలో ప్రస్తావించానని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రభుత్వం 7 డి.ఏలు బకాయి పడిందని, పీఆర్సీ కూడా అమలు చేయడంలేదని ఆరోపించారు. జీతం ఇవ్వడం ఆలస్యం చేస్తే డి.ఏ, టి.ఏ, పీఆర్సీ అడగరని, జీతం ఇస్తే అదే పదివేలు అని ఉద్యోగులు భావిస్తారని ప్రభుత్వం అనుకుంటోందని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలసరి ఆదాయం గతేడాది కంటే పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయని, మరి ప్రభుత్వ నిర్వహణలో భాగమైన జీతభత్యాల చెల్లింపులు కూడా చేయడంలేదంటే ఆ ఆదాయం ఎటుపోతోందని ప్రశ్నించారు. ప్రతి నెలా తెస్తున్న అప్పులు ఏమైపోతున్నాయని పవన్ కల్యాణ్ నిలదీశారు.
ఏపీ సర్కారు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. ఆర్థికమంత్రి అప్పులు శాఖ మంత్రిగా మారారని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వవయ్యా స్వామీ... పనిచేసిన వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగ? అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "జీతాలు, పెన్షన్లు అందనివాళ్లు మాట్లాడుతుంటే అయ్యో అనిపించింది. డబ్బు అందకపోతే వాళ్లేం కావాలి?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "చెప్పుకోవడానికి మూడు రాజధానులేమిటి, 30 రాజధానుల పేర్లు చెప్పుకోవచ్చు, పేపర్లలో రాయించుకోవచ్చు. కర్నూలులో హైకోర్టు అంటున్నారు. ఎక్కడంటే అక్కడ పెట్టడానికి ఇదేమైనా హైస్కూలా...? ఈ అంశంలో వైసీపీ సర్కారు అనుభవలేమి బయటపడుతోంది. మంత్రులే నిర్ణయం తీసుకుంటున్నారు. వారికి ఎలా వ్యవహరించాలో తెలియదు. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో జడ్జిలు నిర్ణయించాలి. వైసీపీ మంత్రులు ప్రజలను ఈ అంశంలో మభ్యపెడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయం ఆచరణ సాధ్యం కాదు" అని చింతా మోహన్ విమర్శించారు.