పరిమితికి మించి 17 వేల కోట్ల అప్పు.. జగన్ సర్కార్ కు కేంద్రం చివాట్లు...
posted on Jul 10, 2021 @ 12:36PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి కేంద్ర ఆర్థికశాఖ వర్గాలే అవాక్కవుతున్నాయంటే ఎంతగా దివాళ తీసిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ఇంతగా అప్పుల్లో కూరుకుపోవడానికి జగన్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్థ, అనాలోచిత విధానాలే కారణమనే ఆరోపణలు వస్తుండగా.. మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఏకంగా 41 వేల కోట్ల రూపాయలకు లెక్కలే లేవని తెలుస్తోంది. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ లేఖ కూడా రాసింది.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై తాజాగా మరో విషయం బయటపడింది. పరిధికి మించి ఏపీ సర్కార్ రూ.17,923.94 కోట్లు అప్పులు చేసిందని తేలింది. దీనికి సంబంధించి ఏపీ ఆర్ధిక శాఖకు కేంద్రం రాసిన మరో లేఖను పీఏసీ ఛైర్మన్ పయ్యావుల విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న రుణాల విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆర్ధిక శాఖకు కేంద్రం రాసిన లేఖను బయటపెట్టారు. రూ.17,923.94 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ లేఖలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రుణాలు.. కేంద్ర అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పయ్యావుల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ వివరణ కోరడంపై ఆర్ధిక శాఖ స్పందించాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేఖతో స్పష్టమైందని పేర్కొన్నారు. రాష్ట్రం చేసే ఆర్ధిక తప్పిదాలపై కేందమైనా సమాధానం చెప్పాల్సిందే అని పయ్యావుల స్పష్టం చేశారు.
రాష్ట్రప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై గురువారం గవర్నర్ కలిసి పిర్యాదు చేశారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని ఆరోపించారు. ట్రెజరీ కోడ్ ప్రకారం ప్రభుత్వం లోని ఏ శాఖ అయినా ట్రెజరీ నుండి డబ్బు తీసుకునేటప్పుడు అది ఎందుకు తీసుకుంటున్నామో, దేనికి ఖర్చు పెడుతున్నామో బిల్లులో పేర్కొనాలి. కానీ అలాంటిదేమీ చూపించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రత్యేక బిల్లు అంటూ 10,806 బిల్లుల కింద రూ.41,043 కోట్లను విత్ డ్రా చేశాయి. ఈ బాగోతాన్ని పక్కా ఆధారాలతో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టారు.
రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు కేశవ్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161, 151/2 లను ప్రస్తావిస్తూ... రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్ర ఆర్థిక, జమ ఖర్చుల నిర్వహణపై దృష్టి పెట్టాలని... గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరారు. ప్రభుత్వ పద్దుల్లో రూ.41 వేల కోట్ల తప్పుడు లెక్కలు ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. పరిధికి మించి తెస్తున్న అప్పులను దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ వస్తోంది.