దేవుళ్లతో కన్నీళ్లు పెట్టిస్తారా.. కేసీఆర్ ను కడిగిపారేసిన రేవంత్ రెడ్డి...
posted on Jul 10, 2021 @ 1:01PM
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. శుక్రవారం ప్రగతి భవన్ ముందు ధర్నాకు దిగిన స్టాఫ్ నర్సుల సమస్యపై సీఎం కేసీఆర్ ను కడిగిపారేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ పిసిసి చీఫ్ గా సిఎం కేసిఆర్ కు తొలి బహిరంగల లేఖ రాశారు రేవంత్ రెడ్డి. నర్సులకు ఉద్యోగాలు తొలగించిన అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా సమయంలో స్టాఫ్ నర్సులను దేవుళ్లు అని కేసీఆరే పొగిడారని.. ఇప్పుడు వాళ్లంతా ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. దేవుళ్లతో కన్నీళ్లు పెట్టిస్తారా అంటూ ప్రశ్నించారు. కరోనా వేళ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా రోగులకు 24 గంటల పాటు సేవలు అందించిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ నర్సులను ఉద్యోగాల నుంచి తొలగించడం హేయమైన చర్యని మండిపడ్డారు.
ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1640 కుటుంబాలను రోడ్డున పడేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రగతి భవన్ కు వస్తే ఐదు నిముషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా? ప్రగతి భవన్ అనేది ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా? చెప్పండని నిలదీశారు. 2018 లో ఎంపికైన ఎఎన్ఎంలకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు.స్టాఫ్ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలి. 2018 ఎఎన్ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.
50 వేల ఉద్యోగాల భర్తీ పై కేసీఆర్ చేసిన ప్రకటన చీటింగ్ “వన్స్ మోర్” లాగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ నివేదిక ఇస్తే 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏంటన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ సంగతి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్ల లోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలి. లేని పక్షంలో అతి త్వరలో నిరుద్యోగ యువత తరఫున టీపీసీసీ కార్యచరణ ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.