ఏపీ ఖజానా ఖాళీ!.. సమయానికి నో పెన్షన్..!
posted on Jul 4, 2021 @ 11:33AM
ఏపీ ఖజానా ఖాళీ. ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. 1వ తేదీ జీతం తీసుకొని చాలా నెలలే అయిందంటున్నారు. మాజీ ఉద్యోగుల పెన్షన్లకు కూడా ఇదే పరిస్థితి. కేలండర్లో డేట్లు మారుతుంటాయి.. కానీ ఏపీ ఉద్యోగుల మొబైల్కు మనీ క్రెడిటెడ్ అనే మెసేజ్ మాత్రం అంత ఈజీగా రాదంటారు. ఈ నెల కాకపోతే వచ్చే నెల అయినా.. పరిస్థితి మారుతుందిలే అనుకుంటే.. నెల నెలా అదే తీరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తారీఖు ఈఎమ్ఐలు కట్ అయ్యే వారి బాధలు అంతాఇంతా కాదు. అప్పు చేసి అకౌంట్లో డబ్బులు ఉండేలా చూసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైనా ఇలా అప్పులు చేయడం ఏంటంటూ వాపోతున్నారు.
ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగుదీ అదే బాధ. అసలే అరకొర పెన్షన్. అది కూడా టైమ్కి రాకపోతే ఎలా? ఎన్ని ఖర్చులుంటాయి? ఎన్ని బాధ్యతలుంటాయి? టైమ్కి పెన్షన్ పడకపోతే ఇంత కష్టమవుతుంది? ఈ బాధలేవీ సర్కారు చెవికి సోకడం లేదు. ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదని.. జగన్ హయాంలోనే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓ రిటైర్డ్ ఎంప్లాయిస్ వాట్సప్ గ్రూల్లో జరిగిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెన్షన్ ఎవరెవరికి పడలేదంటూ ఓ పెద్దాయన మెసేజ్ పెడితే... హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మాకు రాలేదంటే... మాకు రాలేదంటూ.. టకటకా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు.
మొదట కృష్ణా జిల్లా రిటైర్డ్ ఎంప్లాయ్ తమ జిల్లాలో ఎవరికీ ఇంకా పెన్షన్ పడలేదని పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత గుంటూరు, విశాఖ, విజయనగరం, ప్రకాశం.. ఇలా ఏపీ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎవరికీ సమయానికి పెన్షన్ రాలేదంటూ.. మెసేజ్లతో హోరెత్తించారు. ఆ వాట్సాప్ మెసేజ్లు ఇప్పుడు వైరల్గా మారాయి.. ఏపీలో సమయానికి పెన్షన్లు కూడా వేయడంలేదంటూ.. ఇదేమి సర్కారంటూ నెటిజన్లు జగన్ సర్కారును కామెంట్లతో కుమ్మేస్తున్నారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి అసలేమాత్రం బాగాలేదని అంటున్నారు. నవరత్నాల పేరుతో ఖజానా ఖాళీ చేశారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులే ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఖాతాలో పైసా కూడా లేదంటున్నారు. ఈ విషయం స్వయంగా అధికారులే హైకోర్టుకు చెప్పారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బుల కోసం భూముల వేలానికీ సిద్ధమయ్యారు. పెట్టుబడులు ఆకర్షిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. ఆదాయం పెరుగుతుంది. అది వదిలేసి.. ఓట్ల కోసం సంక్షేమ పథకాలతో ఊదరగొడితే.. ఉన్న సొమ్ముంతా ఖర్చయిపోతోంది. అమరావతిని డెవలప్ చేసినా బాగుండేది.. ఎంతోకొంత ఏపీ ఇమేజ్ పెరిగి కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చేవి. సీఎం జగన్ అరాచక విధానాలతో రాష్ట్రం దివాళా తీస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం రూపంలో మరో సమస్య వచ్చిపడింది.
ఏం చేసినా.. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఏపీ సర్కారుకు అప్పు ముట్టడం లేదు. ఇప్పటికే లిమిట్ దాటేయడమే.. కొత్త అప్పులకు కేంద్ర సర్కారు చెక్ పెట్టింది. తాజాగా, ఏ మేరకు కేంద్రం నుంచి వచ్చిన తాఖీదు.. జగన్ సర్కారుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేయడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టే. రుణ పరిమితిని పెంచాలంటూ రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతుంటే.. ఉన్న లిమిట్నూ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
అప్పులనే నమ్ముకొని సంక్షేమ పథకాలతో ఊదరగొడుతున్న జగన్ సర్కారుకు కేంద్రం విధించిన ఈ షరతు బిగ్ షాక్ అనే చెబుతున్నారు. అప్పు పరిమితిలో కోత పడటంతో.. ఇప్పుడిక తిప్పలు తప్పవంటున్నారు. మరి ఈ అప్పుల ఊబి నుంచి జగన్రెడ్డి ప్రభుత్వం ఎలా బయటపడుతుందో.. ఉద్యోగులకు, పెన్షన్దారులకు సమయానికి శాలరీ ఎప్పుడు పడుతుందో.....